Share News

Bhadrachalam: పెదవాగుకు మళ్లీ గండి

ABN , Publish Date - Sep 02 , 2024 | 04:16 AM

ఎడతెరిపి లేని వర్షాలతో భద్రాద్రి జిల్లాలోని పెదవాగు ప్రాజెక్టు రింగ్‌ బండ్‌కు భారీ గండి పడింది.

Bhadrachalam: పెదవాగుకు మళ్లీ గండి

  • సీతారామ ప్రధాన కాల్వ,సాగర్‌ ఎడమ కాల్వకు రెండు చోట్ల..

నడిగూడెం, అశ్వారావుపేట/ములకలపల్లి, సెప్టెంబరు 1: ఎడతెరిపి లేని వర్షాలతో భద్రాద్రి జిల్లాలోని పెదవాగు ప్రాజెక్టు రింగ్‌ బండ్‌కు భారీ గండి పడింది. దీంతో.. రూ.3.5 కోట్లు వెచ్చించి నిర్మించిన రింగ్‌బండ్‌ కొట్టుకుపోయింది. జూన్‌ 18న గండి పడడంతో పంటలకు తాత్కాలికంగా నీరందించేందుకు ప్రభుత్వం దీనిని నిర్మించింది. రెండు రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలోనే శనివారం రాత్రి 25 మీటర్ల మేర గండి పడింది. ఏపీలోని గుబ్బలమంగమ్మ ఆలయ పరిసరాలు, స్థానికంగా భారీ వర్షం పడడంతో పెదవాగుకు వరద పోటెత్తింది. జూన్‌లో జరిగినట్టే.. ప్రాజెక్టులోని నీరంతా బయటకు పోయింది.


మరోవైపు సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వకు 25 మీటర్ల మేర గండి పడింది. భద్రాద్రి జిల్లా ములకలపల్లి-పాల్వంచ మండలాల మధ్య వీకే మాదవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో సీతారామ ఫేజ్‌-3లో 38 కి.మీ. వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సీతారామ పంపుహౌజ్‌ను ప్రారంభించిన ప్రాంతానికి ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా నిర్మించిన ప్రధాన కాలువ చిన్న వరదకే తెగిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు.


పాలేరు జలాశయం తిరుగు జలాల ఉధృతితో సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద 132, 133 కిలోమీటర్ల పరిధిలో సాగర్‌ ఎడమకాల్వకు రెండుచోట్ల గండి పడింది. ఇవి 60 అడుగుల మేర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సిరిపురం డీప్‌ కట్‌ వద్ద వంతెనపై నుంచి నీరు గ్రామంలోని ఇళ్లలోకి చేరింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయికన్‌గూడెం పరిసర పంట పొలాలు నీట మునిగాయి. గండిని ఎన్నెస్పీ సీఈ రమే్‌షబాబు పరిశీలించారు. తక్షణ చర్యలు చేపట్టి నీటి విడుదలను నిలిపివేశారు. ఎడమ కాల్వపై షట్టర్ల నాలుగు గేట్లు తెరుచుకోలేదు. ఇదే గండికి కారణంగా తెలుస్తోంది.

Updated Date - Sep 02 , 2024 | 04:16 AM