Share News

Hyderabad: ఐటీ కారిడార్‌.. స్టంట్‏లతో హడల్‌.. వీకెండ్‌లో రోడ్లపై రాత్రిపూట రేస్‌లు

ABN , Publish Date - Oct 24 , 2024 | 11:22 AM

ఐటీ కారిడార్‌(IT Corridor)లో శని, ఆదివారాల్లో రాత్రిళ్లు రహదారులపై కొందరు యువత ప్రమాదకర స్థితుల్లో బైక్‌రేస్‏లు చేస్తూ, స్టంట్లు కొడుతున్నారు. రేసింగ్‌ చేస్తూ.. బైక్‌లను గాలిలోకి లేపుతూ.. మంటలు పుట్టిస్తున్నారు. కొందరు అయితే అతివేగంగా డ్రైవింగ్‌ చేస్తూ.. స్టాండ్‌లను రోడ్డుకు తాకేలా కాళ్లతో పట్టి మంటలు పుట్టేలా చేస్తున్నారు.

Hyderabad: ఐటీ కారిడార్‌.. స్టంట్‏లతో హడల్‌.. వీకెండ్‌లో రోడ్లపై రాత్రిపూట రేస్‌లు

- వాహనదారులను హడలెత్తిస్తున్న రేసింగ్‌లు

- అధికంగా రాయదుర్గం, నాలెడ్జ్‌ సిటీ ప్రాంతాల్లోనే..

- కేసులు పెడుతున్నా.. మారని తీరు

వీకెండ్‌లో రాత్రుళ్లు ఐటీకారిడార్‌ రోడ్లపై బైక్‌స్టంట్లు, బైక్‌రేసింగ్‌లతో కొందరు యువత హడలెత్తిస్తున్నారు. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా.. వాహనాలను సీజ్‌ చేసినా.. కౌన్సెలింగ్‌ ఇస్తున్నా.. కోర్టుల్లో జరిమానాలు విధిస్తూన్నా ‘ఐ డోంట్‌ కేర్‌’ అంటూ రయ్‌..రయ్‌..మంటూ చేజింగ్‌ చేస్తున్నారు. దీంతో వాహనదారులు, సామాన్యులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు రాయదుర్గం, నాలెడ్జ్‌ సిటీ ప్రాంతాల్లోనే అధికంగా చోటుచేసుకుంటున్నాయి.

హైదరాబాద్: ఐటీ కారిడార్‌(IT Corridor)లో శని, ఆదివారాల్లో రాత్రిళ్లు రహదారులపై కొందరు యువత ప్రమాదకర స్థితుల్లో బైక్‌రేస్‏లు చేస్తూ, స్టంట్లు కొడుతున్నారు. రేసింగ్‌ చేస్తూ.. బైక్‌లను గాలిలోకి లేపుతూ.. మంటలు పుట్టిస్తున్నారు. కొందరు అయితే అతివేగంగా డ్రైవింగ్‌ చేస్తూ.. స్టాండ్‌లను రోడ్డుకు తాకేలా కాళ్లతో పట్టి మంటలు పుట్టేలా చేస్తున్నారు. దీంతో తోటి వాహనదారులు హడలిపోతున్నారు. ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని, తామెక్కడ యాక్సిడెంట్‌కు గురవుతామోనని భయపడిపోతున్నారు. తాజాగా శనివారం రాత్రి రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని రహదారులపై ప్రమాదకర స్థితిలో బైక్‌రేస్‌, స్టంట్లు చేస్తున్న 10 మంది బైక్‌ రైడర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని బైక్‌లను సీజ్‌ చేశారు. శని, ఆదివారాలు వచ్చిందంటే చాలు బైక్‌ రైడర్లు రెచ్చిపోతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Secunderabad: చంపేస్తానని బెదిరిస్తే హత్య చేశా..


కేసులు పెడుతున్నా.. అంతే..

బైక్‌ స్టంట్లు, బైక్‌ రేసింగ్‌లు చేస్తున్న రైడర్లపైన పోలీసులు అనేకమార్లు కేసులు నమోదు చేస్తున్నా వారు లెక్క చేయడంలేదు. కొంతకాలంగా రాయదుర్గం, నాలెడ్జ్‌సిటీ ప్రాంతాల్లో రోడ్లు విశాలంగా స్ర్టేయిట్‌గా ఉన్నాయి. దీంతో బైక్‌రైడర్లు ఈ ప్రాంతాల్లో తమ బైక్‌లతో స్టంట్లు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.


పేద, మధ్య తరగతి యువతే ఎక్కవ

ఒకప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు(Software employees) తమకు లక్షల్లో జీతాలు వచ్చే సరికి ఖరీదైన బైక్‌లు కొని సరదా కోసం బైక్‌ రైడింగ్‌, రేసింగ్‌లకు పాల్పడే వారు. కానీ కాలక్రమేనా సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో వచ్చిన పోటీతత్వంతో ఆ ఉద్యోగుల్లో ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. దీంతో వారు తమ ఉద్యోగాన్ని కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్‌డేట్‌ చేసుకోవడంలో మగ్నమై, ఇలాంట్‌ సరదాలకు దూరం అవుతున్నారు. అయితే ఈ సరదా నేడు పేద, మధ్య తరగతి యువతకు పాకింది.


చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగించే యువకులే స్టంట్ల బాట పడుతున్నారు. సుమారు 18వేల జీతం తీసుకునే యువకుడు రూ.2.80 లక్షల విలువ చేసే బైక్‌ను లోన్‌ ద్వారా కొని బైక్‌రేస్‌, స్టంట్లు చేస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటి వరకు పోలీసులు 4 నెలలుగా నమోదు చేసిన కేసుల్లో ఎక్కువ మంది యువకులు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారే ఉండడం విస్మయం కలిగిస్తోంది. వీరిలో కార్పెంటర్‌, ఇళ్లలో పీఓపీ పనులు చేసుకునే కూలీలు, పేయింటర్లు, ఎలక్ర్టీషియన్లు, చిన్నచిన్న పనులు చేసుకునే వారు ఎక్కువగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.


ట్రెండ్‌ కోసం స్టంట్లు..

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బైక్‌ స్టంట్లు, బైక్‌ రేసింగ్‌ల వీడియోలకు ఆదరణ లభిస్తున్నాయి. దీంతో యువకులు తమ బైక్‌లతో పలు రకాల స్టంట్లు చేసి ట్రెండింగ్‌ వీడియోలు రికార్డుచేసి సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. ఇందు కోసం యువత ప్రమాదకరమైన బైక్‌రైడ్‌ స్టంట్లకు పాల్పడుతున్నారు. ఇలాంటి స్టంట్ల కారణంగా ఫ్యామిలీలతో రోడ్లపై వెళ్లే ఇతర వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బైక్‌ రైడర్ల స్టంట్లతో విసిగి పోయిన సామాన్యులు పోలీసుల దృష్టికి తీసుకెళుతున్నారు. దీంతో పోలీసులు ఈ రోడ్లపైన ప్రత్యేక నిఘాఏర్పాటు చేసి బైక్‌ రేసింగ్‌లు, స్టంట్లు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని బైక్‌లను సీజ్‌చేస్తున్నారు. అయినా బైక్‌ రైడర్లలో ఎలాంటి మార్పు రావటం లేదని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


- శిక్షలు కఠిన తరం చేయాలి

బైక్‌ రేసర్లపై పోలీసులు ఇప్పుడు ఉన్న చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టులో అప్పగిస్తున్నారు. అయితే బైకర్లు కోర్టులో పెనాల్టీ రూ.5 వేల నగదు కట్టి, కొన్ని కేసుల్లో బేయిల్‌ పైన బయటకు వచ్చి మళ్లీ బైక్‌ రేసింగ్‌లకు పాల్పడుతున్నారు. రూ.5 వేలు నగదు పెనాల్టీగా చెల్లించడానికి చిరుఉద్యోగాలు చేసుకునే యువత వెనకాడటం లేదు అనేది అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అయితే నిందితులపైన కేసులు కఠిన తరం చేస్తే తప్ప వీరిని అరకట్టలేమని వాహనదారులు చెబుతున్నారు. అధికారులు బైక్‌ రైడర్లపై మరింత కఠినతరమైన శిక్షలు అమలు చేసి, వీటిని అరికట్టాలని కోరుతున్నారు.


ఇదికూడా చదవండి: చెప్పినట్లుగానే దరణిని మారుస్తున్నాం: మంత్రి పొంగులేటి

ఇదికూడా చదవండి: తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలనూ తిరుమలలో అనుమతించాలి

ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

ఇదికూడా చదవండి: Bandi Sanjay: భయపెట్టాలని చూస్తే భయపడతామా?

Read Latest Telangana News and National News

Updated Date - Oct 24 , 2024 | 11:22 AM