Share News

Hyderabad : గంగ ఒడికి గణనాథుడు!

ABN , Publish Date - Sep 18 , 2024 | 03:30 AM

‘గణేశ్‌ మహరాజ్‌ కీ జై’.. ‘గణపతి బొప్పా మోరియా.. అగ్లే బరస్‌ తూ జల్దీ ఆ’ అంటూ మేళతాళాలు, నృత్యాల మధ్య ఉప్పొంగిన భక్తిభావంతో కూడిన నినాదాలతో పెద్ద సంఖ్య లో భక్తులు గణనాథుడికి వీడ్కోలు పలికారు.

Hyderabad : గంగ ఒడికి   గణనాథుడు!

  • హైదరాబాద్‌లో మహా నిమజ్జనం ప్రశాంతం

  • ఈసారి పూర్తిగా నీళ్లలో ఖైరతాబాద్‌ గణేశుడు

  • 25 అడుగుల లోతు.. 35 అడుగుల వెడల్పుతో వారం రోజులుగా పూడిక తీయడంతోనే

  • రూ.30.01 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ

  • పలుచోట్ల రూ.10 లక్షలు దాటిన వేలం

  • నిమజ్జనం తీరుపై పొన్నం ఏరియల్‌ వ్యూ

  • ఎన్‌టీఆర్‌ మార్గ్‌కు సీఎం.. ఏర్పాట్ల పరిశీలన

  • పారిశుధ్య కార్మికులు, క్రేన్‌ ఆపరేటర్లతో మాట

  • నిమజ్జనంపై ప్రభుత్వ వ్యవస్థల పనితీరు భేష్‌..

  • రేవంత్‌ పర్యవేక్షణ అభినందనీయం: రాజాసింగ్‌

‘గణేశ్‌ మహరాజ్‌ కీ జై’.. ‘గణపతి బొప్పా మోరియా.. అగ్లే బరస్‌ తూ జల్దీ ఆ’ అంటూ మేళతాళాలు, నృత్యాల మధ్య ఉప్పొంగిన భక్తి భావంతో కూడిన నినాదాలతో పెద్ద సంఖ్యలో భక్తులు గణనాథుడికి వీడ్కోలు పలికారు. మంగళవారం హైదరాబాద్‌లో మహా నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 17 (ఆంధ్రజ్యోతి): ‘గణేశ్‌ మహరాజ్‌ కీ జై’.. ‘గణపతి బొప్పా మోరియా.. అగ్లే బరస్‌ తూ జల్దీ ఆ’ అంటూ మేళతాళాలు, నృత్యాల మధ్య ఉప్పొంగిన భక్తిభావంతో కూడిన నినాదాలతో పెద్ద సంఖ్య లో భక్తులు గణనాథుడికి వీడ్కోలు పలికారు. మంగళవారం హైదరాబాద్‌లో మహా నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. హుస్సేన్‌సాగర్‌, సరూర్‌నగర్‌, ఐడీఎల్‌ చెరువు సహా 73 చోట్ల నిమజ్జనం కోసం క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిభిరాలు అందుబాటులో ఉంచారు.

గ్రేటర్‌ పరిధిలో 35 వేల మందితో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వర్షం లేకపోవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శోభాయత్రలో పాల్గొన్నారు. ట్యాంక్‌బండ్‌, ఎన్‌టీఆర్‌ మార్గ్‌ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. మహా నిమజ్జనంలో ప్రధాన ఆకర్షణ ఖైరతాబాద్‌ గణేషుడిదే! 70 అడుగుల శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి మధ్యాహ్నం 1:40 గంటలకు హుస్సేన్‌సాగర్‌లో గంగమ్మ ఒడికి చేరాడు. ఉదయం 6:32 గంటలకు మొదలైన శోభాయాత్రలో వేలమంది భక్తులు పాల్గొన్నారు. 350 టన్నుల బాహుబలి క్రేన్‌తో 13 నిమిషాల్లోనే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశారు. మునుపైతే.. నిమజ్జనం చేశాక కూడా ఖైరతాబాద్‌ గణేషుడు నీళ్ల మీదే కనిపించేవాడు. అయితే వారం రోజులుగా 25 అడుగుల లోతు.. 35 అడుగుల వెడల్పుతో ప్రత్యేకంగా పూడిక తీయడంతో మహా గణపయ్య సంపూర్ణంగా గంగ ఒడికి చేరాడు! బాలాపూర్‌ గణపతి శోభాయాత్ర ఉదయం 11:20కి ప్రారంభమైంది.


ఈ గణపతిని ట్యాంక్‌బండ్‌ నుంచి సాయంత్రం 4:10 గంటలకు నిమజ్జనం చేశారు. మహా నిమజ్జనానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌, డీజీపీ జితేందర్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాట, పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టిలు ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. బాలాపూర్‌ లడ్డూ వేలం మరోసారి ఆసక్తిగా సాగింది. నిరుడు వేలంలో రూ.27 లక్షలు పలికిన లడ్డూ ఈసారి రూ.30.1 లక్షలు పలికింది. పలుచోట్ల లడ్డూలు రూ.10 లక్షలు దాటాయి. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేటలో వీరాంజనేయభక్త సమాజం ఏర్పాటుచేసిన లడ్డూ రూ.11.50లక్షలు, అత్తాపూర్‌ పోచమ్మ దేవాలయం న్యూస్టార్‌ భక్త సమాజం లడ్డూ రూ.11.10 లక్షలు, ఉప్పర్‌పల్లి వీరాంజనేయస్వామి ఆలయం వద్ద రూ.10 లక్షలు, ఖానాపూర్‌లో రూ.9.52 లక్షలు, బాలాజీనగర్‌ డివిజన్‌లోని సేవాలాల్‌నగర్‌లో లడ్డూ రూ.9.02 లక్షలు పలికింది. మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. అయితే రద్దీని క్రమబద్ధీకరించడానికి ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ గేట్లు 10 నిమిషాలకోసారి మూస్తూ తెరిచారు. దీనిపై ప్రయాణికుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.

  • ఏర్పాట్లను పరిశీలించిన సీఎం

ఎన్‌టీఆర్‌ మార్గ్‌లో నిమజ్జన ఏర్పాట్లను సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. నిమజ్జన సాగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ పారిశుధ్య కార్మికులు, క్రేన్‌ ఆపరేటర్లతో ముచ్చటించారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. విశ్రాంతి కోసం ఏర్పాట్లు చేయాలని క్రేన్‌ ఆపరేటర్లు కోరగా.. ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. కాగా, నిమజ్జనం కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రశంసించారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా రేవంత్‌ రెడ్డి.. ఎన్‌టీఆర్‌ మార్గ్‌లో ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారని ప్రశంసించారు.

Untitled-2 copy.jpg

Updated Date - Sep 18 , 2024 | 03:31 AM