Share News

Jeevanreddy: తీవ్ర మనోవేదనలో జీవన్ రెడ్డి.. ఏ క్షణమైనా

ABN , Publish Date - Oct 23 , 2024 | 09:36 AM

Telangana: ముఖ్య అనుచరులతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈరోజు (బుధవారం) సమావేశం కానున్నారు. ముఖ్య అనుచరుడి హత్యతో తీవ్ర మనోవేదనలో ఉన్న ఎమ్మెల్సీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Jeevanreddy: తీవ్ర మనోవేదనలో జీవన్ రెడ్డి.. ఏ క్షణమైనా
Congress MLC Jeevan Reddy

జగిత్యాల, అక్టోబర్ 23: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Congress MLC Jeevan Reddy) తీవ్ర మనోవేదనలో ఉన్నారు. నాలుగు నెలలుగా అవమానాలు ఎదురవుతున్నాయని ఆవేదనలో ఉన్న ఆయన.. ముఖ్య అనుచరుడి హత్యతో మరింత కుంగుబాటుకు గురయ్యారు. ఈరోజు (బుధవారం) ముఖ్య అనుచరులతో ఆయన సమావేశం కానున్నారు. అయితే జీవన్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అనుచరుల నుంచి వస్తున్న టాక్. నేటి సమావేశంలో జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. పార్టీలో ఉంటారా.. లేక రాజకీయాలకి దూరంగా వెళ్లిపోతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పార్టీలో, ప్రజా జీవితం నుంచి దూరంగా ఉంటానంటూ నిన్న ఎమ్మెల్సీ ప్రకటించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. మరి జీవన్ రెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

YSRCP:అన్నా.. సారీ.. నీతో ఉండలేను.. జగన్‌కు గుడ్‌బై చెప్పనున్న మరో సీనియర్ నేత..


అయితే పార్టీకి, ప్రజాజీవితం నుంచి దూరంగా ఉంటానంటూ జీవన్ రెడ్డి ప్రకటించడంతో కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమైంది. వెంటనే బుజ్జగింపుల పర్వానికి పూనుకుంది. ఏకంగా టీపీసీసీ చీఫ్ మహేష్‌ గౌడ్‌ను రంగంలోకి దించి బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది హైకమాండ్. మరోవైపు పార్టీ ఫిరాయింపులను జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. నిన్న(మంగళవారం) ముఖ్య అనుచరుడి హత్యపై ఆందోళన చేస్తున్న జీవన్‌ రెడ్డికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫోన్ చేశారు. ఈ సమయంలో ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను పార్టీలో ఉండలేను.. నాలుగు దశబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇస్తున్నారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహేష్ గౌడ్ మాట్లాడుతుండగానే జీవన్ రెడ్డి ఫోన్ కట్ చేసి విసిరేసినట్లు తెలుస్తోంది.


జగిత్యాలలో ఉద్రిక్త పరిస్థితులు...

కాగా... జగిత్యాల జిల్లాలో నిన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్యతో జిల్లాలో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. జగిత్యాల మండలం జాబితాపూర్‌లో నిన్న తెల్లవారుజామున పని నుంచి ఇంటికి వెళ్తుండగా గంగారెడ్డి బైక్‌ను దుండగులు కారుతో ఢీకొట్టి.. కిందపడిన అతడిపై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన గంగారెడ్డిని కుటుంబసభ్యులు జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గంగారెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే జీవన్ రెడ్డి ఆస్పత్రికి తరలివచ్చారు. గంగారెడ్డి మృతదేహాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్య అనుచరుడి హత్యకు నిరసనగా జగిత్యాలలోని పాత బస్టాండ్ ఆవరణలో నడి రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కూడా జీవన్‌రెడ్డితో కలిసి ఆందోళనకు దిగారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ కార్యకర్తల నినాదాలు చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఎమ్మెల్సీ ధర్నా చేశారు. పోలీసులు నచ్చ జెప్పేందుకు యత్నించినప్పటికీ జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు.

AP Politics: బొత్సకు జీ హుజూర్‌!


మరోవైపు గంగారెడ్డిని హత్య చేసిన నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితుడి నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కాల్ డేటా, వాట్సాప్ డేటాను పరిశీలిస్తున్నారు. అలాగే పోలీసులతో నిందితుడికి సంబంధాలపై విచారణ కొనసాగుతోంది. పోలీసుల వైఫల్యంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ నిన్న తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడు రీల్స్ చేసినా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే రీల్స్ విషయం తన దృష్టికి రాలేదని డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. ఈ ఘటనను కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది.


ఇవి కూడా చదవండి...

‘మహా’ యుద్ధంలో గెలుపు ఎవరిది?

Viral Video: టాప్ లెస్ కారులో అంబానీ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్తోందో..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 23 , 2024 | 09:54 AM