Share News

TG News: ప్రజాభవన్ ఎదుట కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన..

ABN , Publish Date - Aug 02 , 2024 | 09:53 PM

బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 46రద్దు చేయాలంటూ బేగంపేట్‌లోని ప్రజాభవన్ ఎదుట కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. 200మంది అభ్యర్థులు నిరాహార దీక్షకు కూర్చున్నారు. తమ కోరికలు నెరవేర్చాలంటూ ముందుగా ప్రజాభవన్‌లో మెమొరాండం అందించారు. అనంతరం ఎన్నికల హామీ మేరకు జీవో 46రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.

TG News: ప్రజాభవన్ ఎదుట కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన..

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 46రద్దు చేయాలంటూ బేగంపేట్‌లోని ప్రజాభవన్ ఎదుట కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. 200మంది అభ్యర్థులు నిరాహార దీక్షకు కూర్చున్నారు. తమ కోరికలు నెరవేర్చాలంటూ ముందుగా ప్రజాభవన్‌లో మెమొరాండం అందించారు. అనంతరం ఎన్నికల హామీ మేరకు జీవో 46రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పెద్దఎత్తున పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసనకారులతో ప్రజాభవన్ ఎదుట ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


జీవో రద్దుపై హైకోర్టులో ఆగస్టు 7న వాదనలు జరుగుతాయని, దీనికి ఏజీ హాజరుకావాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విచారణ జరుగుతున్నప్పుటికీ అడ్వకేట్ జనరల్ కోర్టుకు వచ్చి వాదనలు వినిపించడం లేదని అభ్యర్థులు మండిపడుతున్నారు. గ్రామీణ అభ్యర్థులకు తీవ్రనష్టం కలిగించేలా జీవో ఉందని దాన్ని సవరించి సీడీ-1, సీడీ-2 ప్రకారం కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలను ప్రకటించాలని వారు కోరుతున్నారు. దానికి అనుగుణంగా వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలిందే అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.


జీవో రద్దుపై బుధవారం రాత్రి కూడా కానిస్టేబుల్ అభ్యర్థులు దిల్‌సుఖ్‌నగర్‌లో భారీఎత్తున ధర్నాకు దిగారు. ఒక్కసారిగా వందల మంది రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్రఇబ్బందులు పడ్డారు. పోలీసులు వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టారు. జీవో రద్దుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్దఎత్తున ప్రజాభవన్ వద్దకు నిరసనకారులు రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - Aug 02 , 2024 | 09:53 PM