Share News

Komatireddy Venkat Reddy :ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో దోపిడీ

ABN , Publish Date - Jun 15 , 2024 | 06:33 AM

రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలు ఫీజు దోపిడీకి పాల్పడుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అడ్డగోలుగా యూనివర్సిటీల పేరిట అనుమతులు తెచ్చుకున్న కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి ఫీజు, డొనేషన్‌ రూపేణా రూ.12లక్షల దాకా వసూలు చేస్తున్నారని విమర్శించారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.

Komatireddy Venkat Reddy :ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో దోపిడీ

  • విద్యా రంగంలో మార్పులు తెస్తాం

  • త్వరలోనే13 వేల టీచర్‌ పోస్టుల భర్తీ

  • 4 నెలల్లో బ్రాహ్మణ వెల్లెంల పూర్తి

  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నార్కట్‌పల్లి, జూన్‌ 14: రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలు ఫీజు దోపిడీకి పాల్పడుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అడ్డగోలుగా యూనివర్సిటీల పేరిట అనుమతులు తెచ్చుకున్న కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి ఫీజు, డొనేషన్‌ రూపేణా రూ.12లక్షల దాకా వసూలు చేస్తున్నారని విమర్శించారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండంలంలోని తన స్వగ్రామం బ్రాహ్మణవెల్లెంలలో బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు.

అనంతరం ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణవెల్లెంల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తాను ఏడో తరగతి వరకు చదువుకున్నానని, ఇది జిల్లాలోనే ఆదర్శ పాఠశాలగా మారాలని ఆకాంక్షించారు. ప్రైవేటు విద్యా వ్యవస్థ.. ప్రభుత్వ పాఠశాలల ఉనికికే ప్రమాదంగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే 13వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తుంటే ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం ఎలా వస్తుందని చురకలంటించారు. వచ్చే నాలుగు నెలల్లో బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టును పూర్తి చేసి సీఎం రేవంత్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ప్రకటించారు.

  • ఏ బాధ్యతైనా నిర్వర్తిస్తా: రాజగోపాల్‌రెడ్డి

చౌటుప్పల్‌ టౌన్‌: త్వరలోనే ఓ శుభవార్త వస్తుందన్న ఆశ ఉందని, క్రమశిక్షణ గల కార్యకర్తగా అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా విజయవంతంగా అమలు చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ భువనగిరి ఇన్‌చార్జిగా బాధ్యత తీసుకొని చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించామని గుర్తు చేశారు. చౌటుప్పల్‌ను మోడల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Updated Date - Jun 15 , 2024 | 06:33 AM