Share News

Hyderabad: పైకి షెడ్లు.. లోన బిల్డింగులు

ABN , Publish Date - Sep 01 , 2024 | 03:08 AM

హైదరాబాద్‌లోని మరో చెరువుకు విముక్తి కలిగింది. రాజేంద్రనగర్‌ మండలం గగన్‌పహాడ్‌ అప్ప చెరువు ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌లో రేకుల షెడ్‌లు వేసి అక్రమంగా నిర్వహిస్తున్న పలు పరిశ్రమలను హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా) కూల్చివేసింది.

Hyderabad: పైకి షెడ్లు..  లోన బిల్డింగులు

  • హైదరాబాద్‌ అప్ప చెరువులో ఆక్రమణల కూల్చివేత

  • శిఖం భూమిలో 13 నిర్మాణాల తొలగింపు

  • వాటిలో అక్రమంగా పరిశ్రమల నిర్వహణ

  • అందులో రెండు బీజేపీ కార్పొరేటర్‌వి

  • నోటీసులివ్వకుండా కూల్చేశారన్న బాధితులు

  • ఈ షెడ్ల కారణంగానే 4 ఏళ్ల క్రితం వరదలు

  • చెరువు కట్ట తెగి ఐదుగురి దుర్మరణం

  • జాతీయ రహదారిపై రోజుల తరబడి నీరు

  • నాడు ఎలాంటి చర్యలు చేపట్టని అధికారులు

  • నేడు మామిడికుంటలో కూల్చివేతలు?

హైదరాబాద్‌ సిటీ/రాజేంద్రనగర్‌, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని మరో చెరువుకు విముక్తి కలిగింది. రాజేంద్రనగర్‌ మండలం గగన్‌పహాడ్‌ అప్ప చెరువు ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌లో రేకుల షెడ్‌లు వేసి అక్రమంగా నిర్వహిస్తున్న పలు పరిశ్రమలను హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా) కూల్చివేసింది. ఇందులో కొన్ని షెడ్లు స్థానిక బీజేపీ కార్పొరేటర్‌ తోకల శ్రీనివాసరెడ్డి తండ్రి శ్రీశైలం రెడ్డికి చెందిన పదెకరాల శిఖం పట్టా భూముల్లో ఉన్నాయి. ఇదే చెరువు ఆక్రమణల కారణంగా 2020 అక్టోబరు వర్షాలకు ఆకస్మిక వరద వచ్చి కట్ట తెగి గగన్‌పహాడ్‌ బస్తీలను ముంచెత్తింది.


జాతీయ రహదారిపై కొన్ని రోజులపాటు రాకపోకలు ఆగిపోయాయి. ఫంక్షన్‌ హాల్లో పడుకున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. ఆ తర్వాత కూడా ఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేయలేదు. తాజాగా శనివారం హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. అప్ప చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్న రేకుల షెడ్లను నేలమట్టం చేసింది. ఈ షెడ్లలో పలువురు ప్లాస్టిక్‌ రీ సైక్లింగ్‌, వాటర్‌ బాటల్స్‌, అట్టలు, బిస్కట్‌ కంపెనీ లేబుల్స్‌ తయారీ, ప్యాకింగ్‌ పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న 13 షెడ్లను తొలగించారు.


మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలను కూల్చివేశామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. బయటకు తాత్కాలిక నిర్మాణాల్లాగా రేకులు కనిపిస్తున్నా లోపల మాత్రం కాంక్రీట్‌ శ్లాబులు ఉన్నాయి. చెరువు ఎఫ్‌టీఎల్‌లో భూములు ఉండడంతో బయటకు తాత్కాలిక నిర్మాణంగా కనిపించేలా రేకులు ఏర్పాటు చేశారు. మునిసిపల్‌, రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారుల సమక్షంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిశ్రమలో ఉన్న యంత్రాలు, ఇతర వస్తువులు తీసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఆ తరువాతే కూల్చివేతలు ప్రారంభించారు.


కార్పొరేటర్‌ తోకల శ్రీనివా్‌సరెడ్డి గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాజేంద్రనగర్‌ నుంచి పోటీ చేశారు. ఆయన కుటుంబానికి ఉన్న పదెకరాల భూమి శిఖం పట్టా అని రెవెన్యూ అధికారులు చెబుతుండగా, మెట్టపట్టా అని శ్రీనివాసరెడ్డి తండ్రి శ్రీశైలంరెడ్డి చెబుతున్నారు. వీరి కుటుంబం ఇందులో 3 వేల చదరపు గజాలను ఇతరులకు విక్రయించింది. అన్నీ కలిపి మూడు ఎకరాల్లో షెడ్లు వేశారు. అందులో రెండు రెండు కార్పొరేటర్‌వే అని తెలుస్తోంది. కూల్చివేతలను అడ్డుకునేందుకు కొందరు స్థానికులు ప్రయత్నించినా పోలీస్‌ అధికారులు సర్ధిచెప్పి పంపారు. వాటర్‌ ప్యాకెట్ల పరిశ్రమ నిర్వహిస్తున్న ఓ మహిళ తమ షెడ్డు కూల్చవద్దని శంషాబాద్‌ ఏసీపీ కె.శ్రీనివా్‌సరావు వద్దకు వచ్చి వేడుకుంది. ఎఫ్‌టీఎల్‌లో ఉంటే మేమేం చేయలేమని ఆమెకు నచ్చచెప్పారు.


  • అప్ప చెరువు తెగి ఆగమాగం

గగన్‌పహడ్‌లోని సర్వేనెంబర్‌ 89, 90లో 17.35 ఎకరాల విస్తీర్ణంలో రైలు పట్టాలకు రెండు వైపులా అప్ప చెరువు ఉంది. వర్షపు నీరు ఒక వైపు నుంచి మరో వైపు వచ్చేలా పట్టాల కింద ప్రవాహ వ్యవస్థ ఉంది. ఓ వైపు షెడ్లు, గోదాములు నిర్మించిన స్థానికులు నీరు రాకుండా ప్రవాహ వ్యవస్థకు అడ్డుగా గోడలు నిర్మించారు. 2020లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైన సమయంలో అప్ప చెరువు కట్ట తెగింది. వరదల్లో భారీ నష్టం సంభవించింది. చెరువు నుంచి సహజ సిద్ధంగా వెళ్లాల్సిన నీటి ప్రవాహానికి అడ్డుగా గోడలు నిర్మించడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది.


నీటిపారుదల శాఖ అధికారులు షెడ్లు ఉన్న వైపు కాకుండా.. చెరువుకు మరో వైపు దిగువకు నీరు వెళ్లేలా రూ.6 కోట్లతో కాలువ నిర్మించారు. మామూలు సమయాల్లో కూడా చెరువులో నీరు నిలవకుండా చేశారు.. చెరువు మొత్తం కబ్జా చేసేందుకే అధికారులు, స్థానిక నాయకులు కుమ్మక్కయి ఆ కాలువ నిర్మించారని ప్రచారం జరుగుతోంది. పక్కనే ఉన్న మామిడికుంట చెరువులో ఆక్రమణలను నేడు కూల్చివేసే అవకాశముందని తెలుస్తోంది. 19.15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మామిడి చెరువులోనూ తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలున్నాయి. నివాసేతర నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. మీరాలం ట్యాంక్‌ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లోని నిర్మాణాలనూ కూల్చివేస్తారని చెబుతున్నారు.


  • అరగంట సమయంలో ఎలా ఖాళీ చేసేది?

అప్ప చెరువుకు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ నిర్ధారించకుండా కూల్చివేతలు చేపట్టారని కార్పొరేటర్‌ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. దీనిపై న్యాయపరంగా పోరాడుతామన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్‌ నేతలు కూల్చివేతలకు పాల్పడ్డారని ఆరోపించారు. మరోపక్క నోటీసులు ఇవ్వకుండాకూల్చివేతలు చేపట్టారని, పరిశ్రమలలో ఉన్న సామగ్రిని, మిషనరీని కూడా తీయడానికి సమయం ఇవ్వలేదని కొన్ని పరిశ్రమల యజమానులు ఆరోపించారు.


అరగంట సమయం ఇస్తే అంత లోపే ఎలా సామగ్రిని తీసుకువెళ్తామని ప్రశ్నించారు. ప్లాస్టిక్‌ బాటిల్‌లు తయారు చేసే తమ పరిశ్రమను కూల్చవద్దని ఓ మహిళ రోధిస్తూ పోలీసులను వేడుకుంది. తన కొడుకు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని చెప్పింది. లక్షల రూపాయల మిషనరీ లోపల ఉందని తెలిపింది. తమకు కరెంటు బిల్లు, ట్రేడ్‌ లైసెన్స్‌, ఫుడ్‌ లైసెన్స్‌, జీఎ్‌సటీ సర్టిపికెట్‌ ఉన్నాయని ఆమె కుమారుడు హరన్‌ చెప్పారు. యంత్రాలను హైడ్రా సిబ్బంది ధ్వంసం చేశారని తెలిపారు. ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించగా, పోలీసులు వారించి పక్కన కూర్చోబెట్టారు.

Updated Date - Sep 01 , 2024 | 03:08 AM