Share News

Vikarabad: మృతుడు.. తిరిగొస్తే?

ABN , Publish Date - Jun 24 , 2024 | 03:56 AM

ఆస్పత్రుల్లో మృతదేహాలు తారుమారై.. ఒకరికి బదులు మరొకరికి అంత్యక్రియలు చేసిన ఉదంతాలను చదివి ఉంటాం..! ఇది మాత్రం మరో రకం..! సినిమాల్లో చూపించినట్లుగా.. ఎక్కడో జరిగినట్లుగా చెప్పుకొనే తరహా ఘటన..! ‘మృతుడు’ తమవాడే అనుకుని తీసుకెళ్లి కర్మకాండలు చేస్తుండగా..

Vikarabad: మృతుడు.. తిరిగొస్తే?

  • రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

  • గుర్తుపట్టలేని విధంగా దెబ్బతిన్న శరీరం

  • ఫోన్‌ ఆధారంగా ‘కుటుంబానికి’ సమాచారం

  • గ్రామంలో అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు

  • ఇంతలో.. ఇంటికొచ్చిన అసలు వ్యక్తి

  • వికారాబాద్‌ జిల్లా నవాంద్గీలో ఘటన

  • పట్టాలపై లభ్యమైన మృతదేహం ఎవరిదో?

బషీరాబాద్‌/వికారాబాద్‌, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): ఆస్పత్రుల్లో మృతదేహాలు తారుమారై.. ఒకరికి బదులు మరొకరికి అంత్యక్రియలు చేసిన ఉదంతాలను చదివి ఉంటాం..! ఇది మాత్రం మరో రకం..! సినిమాల్లో చూపించినట్లుగా.. ఎక్కడో జరిగినట్లుగా చెప్పుకొనే తరహా ఘటన..! ‘మృతుడు’ తమవాడే అనుకుని తీసుకెళ్లి కర్మకాండలు చేస్తుండగా.. అతడు నిక్షేపంగా ఊళ్లో ప్రత్యక్ష్యమై అందరినీ ఆశ్చర్యపరిచాడు. వికారాబాద్‌ జిల్లా నవాంద్గీ గ్రామానికి చెందిన పిట్టల ఎల్లప్ప (47) బషీరాబాద్‌లో ఓ వ్యక్తి వద్ద పశువుల కాపరిగా పనిచేసేవాడు.


మద్యానికి బానిస కావడంతో ఇటీవల అతడిని పనిలో నుంచి తీసేశారు. కాగా, ఎల్లప్ప రెండు రోజుల కిందట భార్యాపిల్లలకు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. వికారాబాద్‌ స్టేషన్‌లో పట్టాలు దాటుతుండగా.. శనివారం రాత్రి 11 గంటల సమయంలో జమ్మూకశ్మీర్‌ నుంచి తిరుపతి వెళ్లే నాన్‌స్టాప్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓ గుర్తుతెలియని వ్యక్తి(45)ని ఢీకొట్టింది. అతడి వద్ద ఫోన్‌ లభించగా కాలింగ్‌ లిస్టులో ఉన్న నంబర్‌కు రైల్వే పోలీసులు ఫోన్‌ చేశారు. ఆ ఫోన్‌ నావంద్గీలోని ఎల్లప్ప కుటుంబానికి వెళ్లింది. దీంతో వారు వికారాబాద్‌ వ చ్చారు. ఎలప్ప ఈ మధ్య అతిగా తాగుతూ అక్కడఇక్కడ తిరుగుతున్నాడు.


రెండు రోజులుగా ఇంటికి కూడా రావడం లేదు. ఇలాంటి సమయంలో అతడి ఫోన్‌ నుంచే కాల్‌ రావడంతో.. కుటుంబసభ్యులు సైతం చనిపోయింది తమవాడేనని భావించారు. మరోవైపు ప్రమాదంలో మృతదేహం గుర్తుపట్టలేనంతగా దెబ్బతినడంతో ఎక్కువగా ఆలోచించలేదు. పోస్టుమార్టం అనంతరం నావంద్గీకి తీసుకొచ్చారు. ఆదివారం ఉద యం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.


తాండూరులో తారసపడడంతో..

ఎల్లప్ప నవాంద్గీ గ్రామానికే చెందిన వ్యక్తికి తాండూరులో కనిపించాడు. ‘‘నువ్వు బతికే ఉన్నావా? మరి ఊర్లో నీ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు కదా?’’ అని చెప్పడంతో ఎల్లప్ప అవాక్కయ్యాడు. వెంటనే గ్రామానికి వెళ్లాడు. అతడిని చూసి కుటుంబసభ్యులు, బంధువులు షాక్‌ అయ్యారు. వెంటనే చనిపోయిన వ్యక్తి తమవాడు కాదంటూ వికారాబాద్‌ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు సైతం ఆశ్చర్యపోయి.. మృతదేహాన్ని తీసుకురావాలని సూచించారు. కాగా, ఈ మొత్తం ఉదంతంలో ఎల్లప్ప తన ఫోన్‌ పోగొట్టుకోవడం పెద్ద మలుపు. రైలు ఢీకొని చనిపోయిన గుర్తుతెలియని వ్యక్తి.. ఎల్పప్ప ఫోన్‌ను చోరీ చేసినవాడిగా అనుమానిస్తున్నారు. అతడు ఫోన్‌తో వికారాబాద్‌కు రావడం, అనూహ్యంగా ప్రమాదానికి గురికావడంతో పెద్ద డ్రామానే నడిచింది.

Updated Date - Jun 24 , 2024 | 05:34 PM