Share News

Hyderabad: దేశ ప్రజల కోసం రాజీవ్‌గాంధీ బలిదానం

ABN , Publish Date - Aug 15 , 2024 | 02:27 AM

దేశప్రజల కోసం రాజీవ్‌గాంధీ బలిదానం అయ్యారని, ఇలా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర బీజేపీలో ఎవరికైనా ఉందా అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Hyderabad: దేశ ప్రజల కోసం రాజీవ్‌గాంధీ బలిదానం

  • దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర బీజేపీలో ఎవరికైనా ఉందా?.. దేశంలో టెక్నాలజీ తెచ్చిందే రాజీవ్‌గాంధీ

  • ఆయనకు సన్నిహితుడు వీహెచ్‌: జగ్గారెడ్డి

  • రాజీవ్‌ గాంధీ అమరజ్యోతి యాత్రకు గాంధీభవన్‌లో ఘన స్వాగతం

హైదరాబాద్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): దేశప్రజల కోసం రాజీవ్‌గాంధీ బలిదానం అయ్యారని, ఇలా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర బీజేపీలో ఎవరికైనా ఉందా అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర రాజీవ్‌గాంధీ కుటుంబానిదన్నారు. తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌ నుంచి బయలుదేరిన రాజీవ్‌గాంధీ అమరజ్యోతి యాత్రకు బుధవారం గాంధీభవన్‌లో తూర్పు జగ్గారెడ్డి, సీనియర్‌ నేత వి. హన్మంతరావు, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.


ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజున ప్రధాని మోదీ వాడుతున్న టెక్నాలజీ కూడా రాజీవ్‌గాంధీ తెచ్చినదేనన్నారు. రాహుల్‌, సోనియాగాంధీల ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు బాగా పనిచేస్తున్నారంటూ కితాబునిచ్చారు. ఈ యాత్రను నిర్వహిస్తున్న దొరై బృదానికి ఈ సందర్భంగా ధన్యవాదాలని పేర్కొన్నారు. రాజీవ్‌కు సన్నిహితంగా పార్టీ సీనియర్‌ నేత వి. హన్మంతరావు వ్యవహరించారని ఆయన గుర్తు చేశారు.


వీహెచ్‌ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో ఒకటిగా భారత్‌ను నిలబెట్టాలని రాజీవ్‌గాంధీ అనుకున్నారని, ఓటు హక్కు వయసును 18 సంవత్సరాలకు మార్చిందీ ఆయనేనని తెలిపారు. అమరజ్యోతి యాత్ర నిర్వాహకుడు దురై మాట్లాడుతూ.. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. కేసీఆర్‌ తెలంగాణ ప్రజల్ని మోసం చేశారన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ముందుకు సాగుతోందని కొనియాడారు. రాజీవ్‌ జ్ఞాపకార్థంగా శ్రీపెరంబుదూర్‌ నుంచి ఢిల్లీ వెళుతున్న అమరజ్యోతి.. తెలంగాణలో అడుగు పెట్టిందని తెలిపారు.

Updated Date - Aug 15 , 2024 | 02:27 AM