Share News

Jagga Reddy : వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నా భార్య నిర్మల పోటీ

ABN , Publish Date - Oct 14 , 2024 | 04:44 AM

‘వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి నా భార్య నిర్మల లేదంటే నా అనుచరుడు చేర్యాల ఆంజనే యులులో ఒకరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారేమో’ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.

Jagga Reddy : వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నా భార్య నిర్మల పోటీ

  • లేదంటే నా అనుచరుడు ఆంజనేయులు పోటీలో ఉంటారేమో

  • సీఎం రేవంత్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌తో మాట్లాడుతా

  • జిల్లా మంత్రి దామోదర సహకారంతో కిషన్‌ సేట్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తా

  • సంగారెడ్డి దసరా సంబరాల్లో జగ్గారెడ్డి

సంగారెడ్డి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి నా భార్య నిర్మల లేదంటే నా అనుచరుడు చేర్యాల ఆంజనే యులులో ఒకరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారేమో’ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌తోనూ మాట్లాడతానని చెప్పారు. శనివారం తన సొంత ఖర్చులతో సంగా రెడ్డిలో దసరా సంబరాలను జగ్గారెడ్డి ఘనంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ సహకారంతో మరో అనుచరుడు సీనియర్‌ నేత తోపాజి కిషన్‌ సేట్‌కు ఉమ్మడి మెదక్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని ప్రకటించారు.


  • ఎస్పీ కారును నా కారుతో గుద్దిన..

ఏం లేనప్పుడే పోలీసులను ఎదుర్కొన్న. 1995లో మునిసిపల్‌ ఎన్నికల్లో అవతలి పార్టీ వాళ్లు రిగ్గింగ్‌ చేస్తుంటే అడ్డుకున్న నా కార్యకర్తలను అప్పటి ఎస్పీ చితకబాది దౌర్జన్యం చేశాడు. ఎస్పీ ఎక్కడున్నాడో తెలుసుకుని, నా కారుతో ఎస్పీ కారును గుద్దిన. 4 వేల మందితో సంగారెడ్డి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసిన. ఎక్కడికక్కడ నిర్బంధించి రిగ్గింగ్‌ చేయించిన. నా ధైర్యం చూసి ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు బెదిరిపోయారు. మొన్న టి ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ వాళ్లు డబ్బులు పంచు తున్నారని నా కార్యకర్తలు డీఎస్పీ, సీఐలను కలిస్తే.. మీరూ కూడా పంచుకోండని హేళన చేశారు. 30 ఏళ్ల కిందటనే పోలీసులను అదరగొట్టినోడిని.

మొన్న ఎన్నిక ల్లో బెదిరించడం, రిగ్గింగ్‌ చేయడం నాకు లెక్కనా అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లో సంగారెడ్డిలో విచ్చలవిడిగా డబ్బులు పంచుతుంటే మా వాళ్లు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేయగా కొందరు ఓటర్లు మా పొట్టకొట్టవద్దని బతిమాలాడారు. నాకు తెలియగానే మా వాళ్లను వెనక్కి రప్పించిన. పైసలన్నీ పండుగలకు ఖర్చు చేస్తాగానీ ఎలక్షన్లల్లో పంచిపెట్టి గెలవబోనని నా అనుచరులతో చెప్పా. ఎంత తోపుల మైనా ఏదో ఒకరోజు కాటికి పోవాల్సిందే. ప్రాణానికి చావుంది కానీ పైసాకు చావు లేదు. జగ్గారెడ్డి బలహీనుడు కాదు.. నాకు బాధ్యతలు, పనులు ఉన్నాయి. కాంగ్రెస్‌ గవర్నమెంట్‌లో ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నా అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Oct 14 , 2024 | 04:44 AM