Share News

TG: పరిశీలన పూర్తి.. పరిష్కారమెప్పుడు?

ABN , Publish Date - May 18 , 2024 | 05:34 AM

ధరణిలో పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది బాధితులు ఎదురు చూస్తున్నారు. ధరణి దరఖాస్తులకు సంబంధించిన అంతర్గత పరిశీలన పూర్తయినప్పటికీ, ఇంకా పెండింగ్‌లోనే ఉంచారు. ఈ ప్రక్రియను రెవెన్యూ అధికారులు ఎప్పుడు చేపడుతారోనన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది.

TG: పరిశీలన పూర్తి..  పరిష్కారమెప్పుడు?

  • ధరణి స్పెషల్‌ డ్రైవ్‌ అర్జీలకు లభించని మోక్షం

  • ఎన్నికల హడావుడిలో ఫైళ్ల వైపే చూడని కలెక్టర్లు

  • ఇప్పటికీ పెండింగ్‌లోనే 2.45 లక్షల దరఖాస్తులు

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ధరణిలో పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది బాధితులు ఎదురు చూస్తున్నారు. ధరణి దరఖాస్తులకు సంబంధించిన అంతర్గత పరిశీలన పూర్తయినప్పటికీ, ఇంకా పెండింగ్‌లోనే ఉంచారు. ఈ ప్రక్రియను రెవెన్యూ అధికారులు ఎప్పుడు చేపడుతారోనన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ధరణి దరఖాస్తులు పరిష్కారం కాక ధరణి పోర్టల్‌, కలెక్టర్ల లాగిన్‌లో కుప్పలు తెప్పలుగా పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ధరణి దరఖాస్తుల పరిష్కారంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. దీనిపై నిపుణులతో ఓ ప్రత్యేక కమిటీని వేశారు. కమిటీ సూచనల మేరకు ధరణి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఈ కార్యక్రమంలో 2.45 లక్షల పెండింగ్‌ దరఖాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.


వీటిని పరిశీలించి అప్రూవ్‌, లేదా రిజెక్ట్‌ చేసేందుకు సంబంధిత నివేదికలు సైతం సిద్ధం చేసి ఉంచారు. వీలైనంత త్వరలో వీటిని పరిష్కరిస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం హామీ ఇచ్చారు. ఇంతలోనే మార్చి 16న లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడడంతో.. ధరణి దరఖాస్తుల పరిశీలన, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్లు ఆపేశారు. నోటిఫికేషన్‌ జారీ నుంచి ఇప్పటి వరకు వాటి జోలికే వెళ్లలేదు. రెవెన్యూ యంత్రాంగమంతా బిజీగా ఉందంటూ ఒక్క ఫైలును కూడా ముట్టుకోలేదు. దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ధరణి కమిటీ సైతం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం కమిటీ సమావేశం కానుంది. స్పెషల్‌ డ్రైవ్‌లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాల్సిన అధికారులు..గత ప్రభుత్వంలో మాదిరిగానే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


పరిష్కరించాల్సిన దరఖాస్తులు ఇలా..

ధరణిలో వివిధ రకాల భూ సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. మొత్తంగా 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పాస్‌బుక్‌ డేటా కరెక్షన్‌ దరఖాస్తులు 1,00,766, గ్రీవెన్స్‌ ఆన్‌ ల్యాండ్‌ మ్యాటర్‌ దరఖాస్తులు 40,364, అన్‌బ్లాక్‌ పీపీబీ (పట్టాదార్‌ పాస్‌బుక్‌)ఆఫ్‌ ప్రొహిబిటెడ్‌ ప్రాపర్టీస్‌ దరఖాస్తులు 26,087, కోర్టు కేసు అండ్‌ ఇంటిమేషన్‌ దరఖాస్తులు 27,096, పెండింగ్‌ మ్యూటేషన్‌ దరఖాస్తులు 14.991, సక్సేషన్‌ విత్‌అవుట్‌ పీపీబీ దరఖాస్తులు 13,943, పీపీబీ త్రూ కోర్టు కేసు దరఖాస్తులు 6,058, నిషేదిత జాబితా దరఖాస్తులు 1,877, నాలా విత్‌అవుట్‌ పాస్‌బుక్‌ దరఖాస్తులు 3,590, పీపీబీ లేదా నాలా, హౌజ్‌సైట్‌, హౌస్‌ దరఖాస్తులు 1,466, సెమీ అర్బన్‌ పీపీబీ దరఖాస్తులు 1,198, ఆల్‌రెడీ ఎగ్జిక్యూటెడ్‌ జీపీఏ దరఖాస్తులు 908, ఆర్గనైజేషన్‌ పీపీబీ దరఖాస్తులు 482, ఎన్‌ఆర్‌ఐ పీపీబీ దరఖాస్తులు 316 ఉన్నాయి.

Updated Date - May 18 , 2024 | 05:34 AM