Share News

BRS: అనుమతుల్లేకుండా నల్లగొండ బీఆర్‌ఎస్‌ కార్యాలయం!

ABN , Publish Date - Jul 02 , 2024 | 04:46 AM

నల్లగొండ పట్టణ నడిబొడ్డులో రూ.100 కోట్ల విలువైన స్థలంలో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని అనుమతి లేకుండా నిర్మించారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. దీనిపై మునిసిపల్‌ కమిషనర్‌ వెంటనే నోటీసులిచ్చి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

BRS: అనుమతుల్లేకుండా నల్లగొండ బీఆర్‌ఎస్‌ కార్యాలయం!

  • విచారణకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు

  • అనుమతుల్లేకుండా బీఆర్‌ఎస్‌ కార్యాలయం!

  • తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోండి

  • మునిసిపల్‌ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం

  • నిబంధనలు పరిశీలిస్తే ఎప్పుడో కూలగొట్టాల్సిందని వ్యాఖ్య

నల్లగొండ, జూలై 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నల్లగొండ పట్టణ నడిబొడ్డులో రూ.100 కోట్ల విలువైన స్థలంలో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని అనుమతి లేకుండా నిర్మించారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. దీనిపై మునిసిపల్‌ కమిషనర్‌ వెంటనే నోటీసులిచ్చి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆ స్థలాన్ని కాపాడేందుకు తాను కృషి చేస్తానన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న 33 కేవీ సబ్‌స్టేషన్‌కు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎవరూ అడగకపోతే నడిరోడ్డు మీద ఇళ్లు కట్టుకున్నా మునిసిపల్‌ అధికారులు ఏమీ అనేలా లేరని, ఇదేనా మీ వ్యవహారం అంటూ నిలదీశారు. సామాన్యులకు ఎలాంటి నిబంధనలు వర్తింపజేస్తారో... రాజకీయ పార్టీలకైనా, పెద్దవాళ్లకైనా అలాంటి నిబంధనలే అమలు చేయాలని అన్నారు.


నిబంధనలు పరిశీలిస్తే బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ఎప్పుడో కూలగొట్టి ఉండాల్సిందన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడం అందరి కర్తవ్యమని, బీఆర్‌ఎస్‌ కార్యాలయం నిర్మించిన విలువైన స్థలంపై జిల్లా కలెక్టర్‌ విచారణ జరపాలని కోరారు. ప్రతిదానికీ బీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోందని, కానీ తాము ప్రజాప్రయోజనాల అంశంలో ఎన్నడూ రాజకీయాలు చేయలేదని పేర్కొన్నారు. రోడ్లు విస్తరణ సమయంలో వందలాది మందికి సంబంధించి, కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూలగొట్టినా, పరిహారం ఇవ్వకపోయినా తాము ఎవరినీ బదనాం చేయలేదన్నారు.

Updated Date - Jul 02 , 2024 | 04:47 AM