Share News

Miyapur: కన్నవాడే కడతేర్చాడు!

ABN , Publish Date - Jun 20 , 2024 | 05:03 AM

మంచి చదువు చెప్పిస్తూ.. చక్కని భవిష్యత్తు కోసం ఆకాంక్షించే కన్నతండ్రి మనసులో తన పట్ల ‘దారుణమైన ఆలోచన’ ఉందని ఏ కూతురు ఊహిస్తుంది? ఆప్యాయంగా ఎత్తుకోవాల్సిన చేతులే రాకాసి హస్తాలై తన ప్రాణాన్ని బలిగొంటాయని ఏ కూతురు అనుకుంటుంది? పాపం పదమూడేళ్ల ఆ చిట్టితల్లి... ‘వంట కోసం కట్టెలు తెద్దాం..

Miyapur: కన్నవాడే కడతేర్చాడు!

  • 13 ఏళ్ల కూతురిపై కన్నేసిన తండ్రి కోరిక తీర్చలేదనే ఉన్మాదం

  • ఊపిరాడకుండా చేసి హత్య

  • మియాపూర్‌లో ఘోరం

  • 11 రోజుల తర్వాత వీడిన మిస్టరీ

  • తలపై బండరాయితో మోదిన వైనం

  • ఆపై ముక్కు, నోరు మూసి హత్య

23.jpg

మియాపూర్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): మంచి చదువు చెప్పిస్తూ.. చక్కని భవిష్యత్తు కోసం ఆకాంక్షించే కన్నతండ్రి మనసులో తన పట్ల ‘దారుణమైన ఆలోచన’ ఉందని ఏ కూతురు ఊహిస్తుంది? ఆప్యాయంగా ఎత్తుకోవాల్సిన చేతులే రాకాసి హస్తాలై తన ప్రాణాన్ని బలిగొంటాయని ఏ కూతురు అనుకుంటుంది? పాపం పదమూడేళ్ల ఆ చిట్టితల్లి... ‘వంట కోసం కట్టెలు తెద్దాం.. బండెక్కు’ అని తండ్రి చెబితే మరో ఆలోచన లేకుండా బైక్‌ ఎక్కింది! ఫోన్లో బూతు వీడియోలు చూసేందుకు మరిగి.. రక్తం పంచుకు పుట్టిన కూతురుపైనే కన్నేసిన ఆ తండ్రి, ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తన కోరిక తీర్చాలని అడిగాడు! భయంతో వణికిపోయిన ఆ పాప, ‘నీ గురించి అమ్మకు చెబుతా’నంటూ బెదిరించింది! అంతే.. ఉన్మాదిగా మారిన అతడు, చిన్నారిని జుట్టు పట్టుకొని కొట్టి.. ఆపై బండరాయితో తలపై కొట్టాడు! తల పగిలి.. రక్తస్రావం జరగడంతో పాప అపస్మారక స్థితికి చేరుకుంది. అప్పటికీ ఉన్మాదం చల్లారని ఆ దుర్మార్గుడు.. ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి బాలికను చంపేశాడు! సభ్యసమాజాన్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసే ఈ దారుణ ఘటన హైదరాబాద్‌ మియాపూర్‌ పరిధిలో జరిగింది. బాలిక హత్య జరిగిన 11 రోజులకు పోలీసులు మిస్టరీని ఛేదించారు.


22.jpg

కన్న తండ్రే హంతకుడని నిర్ధారించారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ ప్రాంతానికి చెందిన దంపతులు బతుకుదెరువు కోసం తమ కుమారుడు, కుమార్తె (13)ను వెంటబెట్టుకొని జూన్‌ మొదటివారంలో మియాపూర్‌ పరిధిలోని నడిగడ్డ తండాకు వచ్చి ఉంటున్నారు. ఇంటిపెద్ద ఓ ప్రైవేటు సంస్థలో చిన్న ఉద్యోగం చేస్తుంటే, ఆ ఇల్లాలు దగ్గర్లోని ఇళ్లలో పని చేస్తోంది. భార్య పొద్దున్నే పనికి వెళ్లినా, ఆ భర్త 11:30 దాకా ఖాళీగానే ఉండేవాడు. పనికి వెళ్లేదాకా సెల్‌ఫోన్‌లో బూతు వీడియోలు చూసేవాడు. ఆరో తరగతి చదువుతున్న తన కుమార్తెకు అప్పుడప్పుడూ డబ్బులిచ్చేవాడు. ఈనెల 7వ తేదీన ఆ పాపకు, ఆమె అన్నకు డబ్బుల విషయంలో గొడవ జరిగింది. అన్న మీద అలిగిన బాలిక ఉదయం 9:30కు ఇంట్లోంచి వెళ్లిపోయింది. దీంతో తండ్రి, కుమార్తెను వెతికేందుకు బయలుదేరాడు.


తండా పరిసరాల్లోనే బాలిక కనిపించడంతో ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటికే కూతురు మీద దుర్మార్గపు ఆలోచనతో ఉన్న అతడు, వంటచెరకు పేరుతో ఆమెను బైక్‌ మీద ఎక్కించుకొని సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ తండ్రి తనతో పంచుకున్న మాటలు విని షాక్‌కు గురైన బాలిక, ఇంటికెళ్లాక అమ్మకు చెబుతానంటూ బెదిరించింది. విషయం బయటకు పొక్కితే తన పరువు పోతుందని భయపడిన తండ్రి ఉన్మాదిగా మారి ఆమెను దారుణంగా హత్యచేశాడు. తర్వాత ఇంటికొచ్చేశాడు. చనిపోయిందా? ప్రాణాలతో ఉందా? అని నిర్ధారించుకునేందుకు మళ్లీ ఘటనాస్థలికి వెళ్లాడు. చనిపోయిందని నిర్ధారించుకొని ఇంటికి తిరిగొచ్చాడు. సాయంత్రం తన కూతురు కనిపించడం లేదంటూ అతడే మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.


13న రాత్రి 10.30గంటలకు ముళ్లపొదల్లో కుళ్లిపోయిన స్థితిలో గుర్తుతెలియని బాలిక మృతదేహం కనిపించందంటూ సమాచారం రావడంతో పోలీసులు వెళ్లారు. దుస్తుల ఆధారంగా మృతదేహం కూతురుదేనని తల్లిదండ్రులు నిర్ధారించారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ నివేదికలు రావాల్సి ఉండగా పోలీసులు వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేశారు. విచారణలో హతురాలి కుటుంబ సభ్యులు సహకరించ పోవడంతో అనుమానించి ఆ కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. స్థానిక అపార్ట్‌మెంట్‌లోని సీసీ ఫుటేజీని పరిశీలించగా.. ఇంట్లోంచి బయటకు వెళ్లిన బాలికను తండ్రే తీసుకురావడం, తర్వాత అతడే తీసుకెళ్లడం కనిపించింది. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తొలుత తనకేమీ తెలియదని బుకాయించినా పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు.

Updated Date - Jun 20 , 2024 | 05:03 AM