Share News

Crime News: దారుణం.. తల్లిదండ్రులను కొడుతున్నారనే ఆందోళనతో బాలిక మృతి..

ABN , Publish Date - Aug 16 , 2024 | 09:21 PM

నాగారం మండలం డి.కొత్తపల్లి(D.Kothapalli) గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో తల్లిదండ్రులపై జరుగుతున్న దాడిని చూసి తట్టుకోలేక ఓ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.

Crime News: దారుణం.. తల్లిదండ్రులను కొడుతున్నారనే ఆందోళనతో బాలిక మృతి..

సూర్యాపేట: నాగారం మండలం డి.కొత్తపల్లి(D.Kothapalli) గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో తల్లిదండ్రులపై జరుగుతున్న దాడిని చూసి తట్టుకోలేక ఓ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. గ్రామానికి చెందిన కడారి సైదులు, కాసం సోమయ్య, నాగయ్య, కాసం లింగం అనే వ్యక్తులకు కాసం సోమయ్య (Kasam Somayya) దంపతులకు పాత కక్షలు ఉన్నాయి. దీంతో వారంతా కలిసి సోమయ్య ఇంటిపై దాడికి దిగారు.


కర్రలు, ఇనుప రాడ్లతో భార్యభర్తలను తీవ్రంగా కొట్టారు. అదే సమయంలో వారి కుమార్తె పావని(14) అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉంది. తల్లిదండ్రులపై జరుగుతున్న దాడిని కళ్లారా చూసి ఆమె తట్టుకోలేక పోయింది. వారిని కొట్టొద్దంటూ ప్రాధేయపడుతూనే ఒక్కసారిగా కుప్పకూలింది. బాలిక మృతిచెందినట్లు తల్లిదండ్రులు గుర్తించారు. తీవ్రగాయాలతో ఉన్న వారు బాలిక మృతదేహంపై ఏడ్చారు. ఇది చూసిన నిందితులు సంఘటన స్థలం నుంచి పరారయ్యారు.


ఘటనపై సోమయ్య దంపతులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన దాడికి, కుమార్తె మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వాపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నారు.

Updated Date - Aug 16 , 2024 | 09:21 PM