Share News

Mahabubnagar: పోలింగ్‌ బహిష్కరణాస్త్రం!

ABN , Publish Date - May 14 , 2024 | 04:52 AM

సమస్యలు పరిష్కరించలేదంటూ.. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదంటూ.. ఆగ్రహానికి గురైన ప్రజలు తమ నిరసన వ్యక్తం చేయడానికి పోలింగ్‌ బహిష్కరణను అస్త్రంగా ఎంచుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఎదిర గ్రామంలో పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 59 రోజులుగా టెంట్‌ వేసి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న స్థానికులు సోమవారం ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

Mahabubnagar: పోలింగ్‌ బహిష్కరణాస్త్రం!

  • పాలమూరు జిల్లా ఎదిరలో ఓటేయని 3,300 మంది

  • పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన

  • మైనింగ్‌పై బల్మూర్‌ మండలం మైలారంలో నిరసన

  • ఎన్నికలకు దూరంగా 700 మంది గ్రామస్థులు

  • పలు జిల్లాల్లోనూ ఆందోళనలు.. హామీలతో విరమణ

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

సమస్యలు పరిష్కరించలేదంటూ.. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదంటూ.. ఆగ్రహానికి గురైన ప్రజలు తమ నిరసన వ్యక్తం చేయడానికి పోలింగ్‌ బహిష్కరణను అస్త్రంగా ఎంచుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఎదిర గ్రామంలో పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 59 రోజులుగా టెంట్‌ వేసి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న స్థానికులు సోమవారం ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మూడు బూత్‌లలో 3,299 మందికిగాను ఎవరూ ఓటేయలేదు. పక్కనే ఉన్న హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీకి చెందిన 300 మంది ఓటర్లలోనూ 128 మంది మాత్రమే ఓటేశారు. ఆర్డీవో నవీన్‌, తహసీల్దార్‌ గన్షీరాం, మునిసిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి సర్దిచెప్పినా శాంతించలేదు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలం మైలారం గ్రామ శివారులోని గుట్టను మైనింగ్‌ కోసం కేటాయించడంపై కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అచ్చంపేట ఆర్డీవో మాధవి నచ్చజెప్పినా వినలేదు. 783 మందికిగాను ఆరుగురే ఓటేశారు. అధికారుల నిర్లక్ష్యంతో తమ ఓట్లు రేఖ్యాతండాకు మారాయంటూ మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం చింతలగడ్డ తండా వాసులు మండిపడ్డారు. 5 కి.మీ. దూరం వెళ్లి ఓటు వేయలేమంటూ 500 మంది పోలింగ్‌ను బహిష్కరించారు.


ఆగ్రహించారు.. శాంతించారు

భద్రాద్రి జిల్లా గుండాల మండలం పెద్దతోగు గిరిజన గ్రామంలో 81 మంది ఓటర్లు ఉండగా 61 మంది ఓటు వేసేందుకు 16 కిలోమీటర్ల దూరంలోని గుండాలలో వెళ్లాల్సి ఉంది. మధ్యలో 6 కి.మీ. రోడ్డు లేదంటూ స్థానికులు 2 గంటల పాటు ధర్నా చేశారు. వచ్చే ఎన్నికల నాటికి అందరి ఓటు గ్రామంలోనే ఉండేలా చూస్తామని గుండాల తహసీల్దార్‌ ఇమాన్ముయేల్‌, ఎంపీడీవో సత్యనారాయణ చెప్పడంతో వారు ఓటు వేశారు. ఇల్లెందు మండలం కొమ్ముగూడెం తండావాసులు సైతం ఓటు వేయబోయని బీష్మించగా ఎమ్మెల్యే కోరం కనకయ్య, తహసీల్దార్‌ కోట రవికుమార్‌ పరిష్కారానికి హామీ ఇవ్వడంతో వెనక్కుతగ్గారు. ఎన్‌ఎ్‌సపీ కాల్వపై వంతెన నిర్మించాలంటూ ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారం గ్రామస్థులు పోలింగ్‌ కేంద్రం ఎదుట ఆందోళన చేశారు. తహసీల్దార్‌ శేషగిరిరావు వచ్చి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో పోలింగ్‌లో పాల్గొన్నారు. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం రాంసాగర్‌ తండా వాసులు, ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం మన్కపూర్‌, దేగామా గ్రామస్థులు, ఇచ్చోడ మండలం బావోజిపేట వాసులు సైతం నిరసన గళం వినిపించినా.. అధికారుల హామీతో శాంతించారు. అభివృద్ధి పనులు జరగడం లేదంటూ కుమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం బోరిగాం ప్రజలు ఆందోళనకు దిగినా.. ఆ తర్వాత ఓటేశారు.

Updated Date - May 14 , 2024 | 04:52 AM