Share News

Revanth Reddy : సన్నాయి నొక్కులెందుకు?

ABN , Publish Date - Jul 10 , 2024 | 05:21 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరుతుండడంపై పార్టీ ఫిరాయింపులంటూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని.....

Revanth Reddy : సన్నాయి నొక్కులెందుకు?
CM Revanth Reddy

  • కేటీఆర్‌ మీ వరకు వస్తే కాని బాధ తెలియడం లేదా?

  • ఈ సర్కారు నెల రోజుల్లో కూలుతుందని అనలేదా?

  • ప్రభుత్వం సుస్థిరంగా ఉండేందుకు చేరికలు తప్పవు

  • బీఆర్‌ఎస్‌ బలహీనపడినప్పుడల్లా పిల్లల్ని రెచ్చగొడుతున్నారు

  • డీఎస్సీపై బీఆర్‌ఎస్‌, కోచింగ్‌ సెంటర్లది కృత్రిమ ఉద్యమం

  • పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో దీక్షలు చేయించడం కాదు

  • హరీశ్‌, కేటీఆర్‌ ఆర్ట్స్‌ కళాశాల దగ్గర ఆమరణ దీక్ష చేయాలి

  • వాయిదా పడడమో.. వారి ప్రాణాలు పోవడమో జరగాలి

  • మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ సమావేశంలో సీఎం రేవంత్‌

మహబూబ్‌నగర్‌, జూలై 9(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రె్‌సలో చేరుతుండడంపై పార్టీ ఫిరాయింపులంటూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఇదే పద్ధతిన కాంగ్రెస్‌ సభ్యులను చేర్చుకోలేదా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అప్పుడు ఇదంతా ఏమైందని.. ఆయన వరకు వస్తే కానీ, బాధ తెలియలేదా? అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేయలేదా? ఈ సర్కారు నెల రోజుల్లో కూలుతుందని కేసీఆర్‌ అనలేదా? అని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ సుస్థిరత కోసం చేరికలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సహకరించాలని, లేకపోతే ఫామ్‌హౌజ్‌లో పడుకోవాలని, కాళ్లలో కట్టె పెడితే వీపు విమానం మోత మోగుతుందని కేసీఆర్‌ను హెచ్చరించారు.

మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్‌.. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రె్‌సకు 3 వేల ఓట్లు వచ్చినప్పుడు పార్టీ, రేవంత్‌రెడ్డి పని అయిపోయిందని శునకానందం పొందారు. కానీ, 1.50 శాతం ఓట్ల నుంచి 40 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చాం. కాంగ్రెస్‌ కార్యకర్తలతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని ఆ రోజే చెప్పాం. వారి ఉసురు తగిలి మట్టికొట్టుకుపోయారు. ఇక బీఆర్‌ఎ్‌సకు మనుగడ ఉండదు. బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రె్‌సది అన్యాయం అంటున్నారు. పదేళ్లు కాంగ్రెస్‌ కార్యకర్తలను కొట్టి, చంపి జైల్లో పెట్టినప్పుడు కేసీఆర్‌ రాజనీతి ఎక్కడికి పోయింది? మేం అక్రమ కేసులు పెట్టడం లేదు. కేసీఆర్‌కు ముందుంది ముసళ్ల పండగ’’ అని రేవంత్‌ అన్నారు. రైతు రుణమాఫీ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు.

త్వరలోనే కొత్త పీసీసీ ఏర్పాటవుతుందని, అనంతరం అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తామని తెలిపారు. కార్యకర్తల కష్టంతోనే ఎమ్మెల్యేలు గెలిచారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం ఎమ్మెల్యేలు వారికంటే ఎక్కువ కష్టపడాలని రేవంత్‌ సూచించారు. తనకు సీఎం పదవి నాయకుల వల్ల రాలేదని, కార్యకర్తల కష్టంతో వచ్చిందన్నారు. 35 మందికి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఇచ్చామని, నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారానికి సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, ఇన్‌చార్జి మంత్రులతో కలిసి పనులు చేసుకోవాలని సూచించారు.


శవాల మీద రాజకీయం కేసీఆర్‌కు అలవాటే..

బీఆర్‌ఎస్‌ బలహీనపడినప్పుడల్లా అమాయక పిల్లలను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించి వారిని బలిచేస్తున్నారని సీఎం రేవంత్‌ ధ్వజమెత్తారు. శవాల మీద రాజకీయం చేసి పబ్బం గడుపుకోవడం కేసీఆర్‌కు అలవాటని మండిపడ్డారు. తమను కాపాడమని కేటీఆర్‌, హరీశ్‌లు ఢిల్లీలో మోదీ చుట్టూ తిరుగుతున్నారని, అయినా చేసిన తప్పులకు లెక్కలు చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. ‘‘డీఎస్సీ వాయిదా వేయాలంటూ దళిత, గిరిజన విద్యార్థులతో దీక్షలు చేయించడం కాదు.

Also Read: 5 సెకెన్లలో దీన్ని పరిష్కరిస్తే మీరే తోపు..

బావబామ్మర్దులు హరీశ్‌, కేటీఆర్‌ ఓయూ ఆర్ట్స్‌ కళాశాల దగ్గర ఆమరణ దీక్షకు కూర్చోవాలి. డీఎస్సీ వాయిదా పడడమో, వారి ప్రాణాలు పోవడమో జరగాలి. డీఎస్సీ వాయిదా ఉద్యమం.. రూ.వందల కోట్లు సంపాదనకు కోచింగ్‌ సెంటర్లు, బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న కృత్రిమ ఉద్యమం. కోచింగ్‌ సెంటర్ల మాఫియా కోసం పరీక్షను రద్దు చేయడం కుదరదు’’ అని తేల్చిచెప్పారు. పదేపదే పరీక్షల రద్దు కోసం ప్రతిపక్షం కుట్ర చేస్తోందని.. వాయిదాల డిమాండ్‌ వెనుక కోచింగ్‌ సెంటర్ల కుట్ర కూడా ఉందని ఆరోపించారు. వాయిదాతో తనకు వచ్చే నష్టం ఏమీ లేదని లక్షలమంది నిరుద్యోగులు నష్టపోతారని అన్నారు. డీఎస్సీ ద్వారా 11,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తే ప్రతి తల మాసినోడు వచ్చి వాయిదా వేయాలంటున్నారని విమర్శించారు.

Also Read: జులై 13 వరకు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్


ఉద్యోగాలపై దొంగలంతా కలిసి గూడుపుఠాణీ..

జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం గ్రూప్‌ 1, 2, 3, 4 పరీక్షలు నిర్వహిస్తామని, ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. డిసెంబర్‌ 31 వరకు ఫలితాలు వెల్లడించి.. వెయ్యి మంది గ్రూప్‌-1 అధికారులను నియమిద్దామంటే దొంగలంతా కలిసి గూడుపుఠాణీ చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పాలన పదేళ్లలో ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదని, 1:50 ప్రాతిపదికన గ్రూప్‌-1 మెయిన్స్‌కు ఎంపిక చేస్తే 1:100 నిష్పత్తి ప్రకారం పిలవాలని డిమాండ్‌ చేస్తున్నారని, దీనివెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చెప్పినట్లు చేస్తే కోర్టుకు వెళ్తారని.. నోటిఫికేషన్‌లో లేకుండా ఎలా పిలుస్తారని పరీక్షను రద్దు చేసే ప్రమాదం ఉందన్నారు. 19 వేలమంది ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చి రాజకీయ ప్రమేయం లేకుండా బదిలీ చేశామని చెప్పుకొచ్చారు.

For More Telangana News and Telugu News..

Updated Date - Jul 10 , 2024 | 07:48 AM