Share News

SC Gurukulas: సైకాలజీ సెల్‌కు చెల్లుచీటీ?

ABN , Publish Date - Aug 26 , 2024 | 03:56 AM

విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టడం, వారిలోని ఆందోళనలను తగ్గించి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఎస్సీ గురుకులాల్లో ఏర్పాటు చేసిన సైకాలజీ సెల్‌ మాయమైందా ?

SC Gurukulas: సైకాలజీ సెల్‌కు చెల్లుచీటీ?

  • ఎస్సీ గురుకులాల్లో మూతబడ్డ స్టూడెంట్‌ కౌన్సిలింగ్‌ సెల్‌లు!.. ఎస్‌సీసీల్లోని సిబ్బంది వేరే ప్రాంతాలకు బదిలీ

  • ఆ తర్వాత తిరిగి భర్తీ కానీ ఆ స్థానాలు

  • ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర విమర్శలు

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టడం, వారిలోని ఆందోళనలను తగ్గించి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఎస్సీ గురుకులాల్లో ఏర్పాటు చేసిన సైకాలజీ సెల్‌ మాయమైందా ? ప్రారంభమైన తొమ్మిది నెలలకే ‘స్టూడెంట్‌ కౌన్సెలింగ్‌ సెల్‌ (ఎస్‌సీసీ)’లు మూతపడ్డాయా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎస్సీ గురుకుల పరిధిలో చేపట్టిన సాధారణ బదిలీల్లో ఎస్‌సీసీల్లో ఉన్న సిబ్బందిని వేరే ప్రాంతాలకు బదిలీ చేసిన అధికారులు ఆయా స్థానాలను తిరిగి భర్తీ చేయకపోవడమే ఇందుకు ముఖ్య కారణం.


అంతేకాక, మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చినా ఉన్నతాధికారులు స్పందించకపోవడం మరో కారణం. ఎస్సీ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల మానసిక ఆరోగ్య సంరక్షణలో భాగంగా అదికారులు ఇంటర్వ్యూలు చేసి 2023 డిసెంబరులో నలుగురితో సైకాలజీ టీమ్‌(రాష్ట్ర స్థాయి) ఏర్పాటు చేశారు. ఈ బృందానికి స్టూడెంట్‌ కౌన్సిలింగ్‌ సెల్‌ అనే పేరు పెట్టారు. ఇది ఏర్పాటై తొమ్మిది నెలలవుతున్నా విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహించిన దాఖలాలు లేవు. సెల్‌ ఏర్పాటుకు హడావిడి చేసిన అధికారులు తరగతుల నిర్వహణకు వసతులు కల్పించలేదనే ఆరోపణలు ఉన్నాయి.


  • టీచర్లకు శిక్షణ ఇచ్చారు.. కానీ..

మానసికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్ధులను గుర్తించి, వారికి ఎస్‌సీసీ ద్వారా కౌన్సిలింగ్‌ ఇప్పించేందుకు గాను దాదాపు 13 రీజియన్ల నుంచి (ఒక్కో రీజియన్‌లో 20 పాఠశాలలు ఉంటాయి) ఒక ప్రిన్సిపాల్‌, నలుగురు ఉపాధ్యాయులు కలిపి ఐదుగురు చొప్పున 65 మందిని ఎంపిక చేసి హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. వీరితో మిగిలిన పాఠశాలల్లోని సిబ్బందికి శిక్షణ ఇప్పించారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రతీ స్కూల్‌లో స్టూడెంట్‌ కౌన్సెలింగ్‌ సెల్‌ కో-ఆర్డినేటర్‌ను నియమించారు. ఆ సమయంలోనే విద్యార్ధుల మానసిక స్థితి ప్రకారం గ్రీన్‌, ఎల్లో, ఆరెంజ్‌, రెడ్‌ అనే విభాగాలుగా విభజించి తగిన కౌన్సిలింగ్‌ ఇవ్వాలని నిర్ణయించారు.


ఇందులో భాగంగా దాదాపు 1300 మంది విద్యార్థులు రెడ్‌ కేటగిరీలో ఉన్నట్టు గుర్తించారు. కోపం ఎక్కువగా ఉన్నవారు, చిన్న విషయాన్ని పెద్దదిగా చూడడం, చిన్న బాధలను త్వరగా మరచిపోలేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారిని రెడ్‌ కేటగిరీలో పెట్టారు. వీరికి తొలుత జిల్లా స్థాయిలోని ‘డిస్ట్రిక్ట్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌’ వారితో కౌన్సిలింగ్‌ ఇప్పిస్తారు. ఆ తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడకపోతే రాష్ట్ర స్థాయి బృందానికి సిఫారసు చేస్తారు. మొత్తంగా విద్యార్థుల మానసిక ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చే వరకు అండగా ఉంటారు. కానీ, ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో లక్ష్యం నెరవేర లేదు.


  • ప్రముఖులు ముందుకొచ్చినా పట్టించుకోరే?

విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు తాము ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామంటూ పలు స్వచ్ఛంద సంస్థలు, పలువురు ప్రముఖులు ముందుకొచ్చినా ఎస్సీ గురుకుల ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. 80గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు మానసిక ఉల్లాస పాఠాలు చెప్పేందుకు తమ బృందాలను పంపిస్తామని టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరో సతీమణి నిర్వహిస్తున్న సంస్థ ప్రతిపాదన పంపితే అధికారులు స్పందించలేదని సమాచారం. అలాగే, మానసిక ఉల్లాస తరగతుల నిర్వహణపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని ముందుకొచ్చిన మైసూరుకు చెందిన ఓ సంస్థ కూడా అధికారుల తీరుతో వెనక్కివెళ్లిపోయినట్టు తెలిసింది.

Updated Date - Aug 26 , 2024 | 03:56 AM