Share News

Nizamabad: కూతురి ఆత్మహత్యతో రగిలిపోయి.. వియ్యంకుడి దారుణ హత్య

ABN , Publish Date - Sep 27 , 2024 | 02:38 AM

కూతురు ఆత్మహత్యకు అల్లుడే కారణం అని రగిలిపోతున్న ఓ తండ్రి.. తన అల్లుడిని ఎలాగైనా చంపాలని పథకం పన్నాడు. నేరుగా అల్లుడి ఇంటికి వెళ్లగా అతడు కనిపించకపోవడంతో వియ్యంకుడిపై తన కోపాన్నంతా చూపాడు.

Nizamabad: కూతురి ఆత్మహత్యతో రగిలిపోయి.. వియ్యంకుడి దారుణ హత్య

  • వాస్తవానికి అల్లుడే టార్గెట్‌.. ఆ టైంలో

  • లేకపోవడంతో అతడికి తప్పిన ముప్పు

  • వియ్యంకుడి కంట్లో కారం కొట్టి కర్రతో

  • విచక్షణారహితంగా దాడి.. అక్కడికక్కడే మృతి

  • నిజామాబాద్‌ జిల్లాలో ఘటన

మోపాల్‌, సెప్టెంబరు 26: కూతురు ఆత్మహత్యకు అల్లుడే కారణం అని రగిలిపోతున్న ఓ తండ్రి.. తన అల్లుడిని ఎలాగైనా చంపాలని పథకం పన్నాడు. నేరుగా అల్లుడి ఇంటికి వెళ్లగా అతడు కనిపించకపోవడంతో వియ్యంకుడిపై తన కోపాన్నంతా చూపాడు. కంట్లో కారం చల్లి.. కర్రతో విచక్షణారహితంగా కొట్టి చంపాడు. నిజామాబాద్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మోపాల్‌ మండలం కంజర్‌ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ సత్యనారాయణ తన కూతురు భవితను అదే గ్రామానికి చెందిన గోవర్ధన్‌కు ఇచ్చి పదేళ్ల క్రితం పెళ్లి జరిపించాడు. భవిత-గోవర్ధన్‌కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. మూడు నెలల క్రితం భవిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అల్లుడి వేధింపుల కారణంగానే కూతురు బలవన్మరణానికి పాల్పడిందంటూ గోవర్ధన్‌పై సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


పోలీసులు గోవర్ధన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే గోవర్దన్‌ బెయిల్‌పై ఇంటికి తిరిగొచ్చాడు. ఈ క్రమంలో తన కూతురు పిల్లలకు ఆస్తిని రాసి ఇవ్వాలని సత్యనారాయణ తన అల్లుడు గోవర్దన్‌ను కోరగా.. ఇందుకు అతడు అంగీకరించలేదు.. బుధవారం రాత్రి సత్యనారాయణ కారం, కర్ర పట్టుకొని గోవర్ధన్‌ ఇంటికి వెళ్లాడు. ఆ సమయానికి గోవర్దన్‌ ఇంట్లో లేడు. అతడి తండ్రి నరహరి (55) ఇంట్లో పడుకొని ఉన్నాడు. సత్యనారాయణ అతడి కంట్లో కారం చల్లి, కర్రతో తలపై చితకబాది పరారయ్యాడు. తీవ్రగాయాలతో నరహరి అక్కడికక్కడే మృతిచెందాడు. నిజామాబాద్‌ ఏసీపీ రాజావెంకట్రెడ్డి, సీఐ సురేశ్‌ గురువారం ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. హత్యలో సత్యనారాయణతో పాటు మరికొంత మంది ఉన్నారని తాము భావిస్తున్నామని ఎస్సై యాదగిరి తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామన్నారు.

Updated Date - Sep 27 , 2024 | 02:38 AM