Share News

Gulf Countries: గల్ఫ్‌ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా

ABN , Publish Date - Oct 08 , 2024 | 03:38 AM

గల్ఫ్‌ దేశాల్లో పనిచేసేందుకు వెళ్లి, వివిధ కారణాలతో తెలంగాణకు చెందిన కార్మికులు చనిపోతే ఆ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది.

Gulf Countries: గల్ఫ్‌ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా

  • పరిహారానికి ఆరు నెలల్లో దరఖాస్తు చేసుకోవాలి

  • కుటుంబానికి రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

  • తెలంగాణకు చెందిన కార్మికుల కుటుంబాలకే..

  • నిరుడు డిసెంబరు 7 తర్వాత మృతి చెందినవారికే ..

  • మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): గల్ఫ్‌ దేశాల్లో పనిచేసేందుకు వెళ్లి, వివిధ కారణాలతో తెలంగాణకు చెందిన కార్మికులు చనిపోతే ఆ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. మృతుల కుటుంబాల్లో ఎక్స్‌గ్రేషియా పొందే అర్హత గల సభ్యుల వివరాలను కూడా వెల్లడించింది. గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులకే ఈ ఎక్స్‌గ్రేషియా వర్తిస్తుంది. గత సంవత్సరం డిసెంబరు 7 తర్వాత మృతి చెందినవారికి దీన్ని అమలుచేస్తారు. మృతిచెందిన ఆరు నెలలలోపు బాధిత కుటుంబసభ్యులు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గల్ఫ్‌ దేశాల్లో రాష్ట్రానికి చెందిన కార్మికులు మృతిచెందితే 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామంటూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలను సోమవారం సీఎస్‌ శాంతికుమారి జారీచేశారు.


  • ఇవీ మార్గదర్శకాలు...

  • ఏడు గల్ఫ్‌ దేశాలైన బహ్రెయిన్‌, కువైట్‌, ఇరాక్‌, ఒమన్‌, ఖతార్‌, సౌది అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో మృతి చెందే తెలంగాణ కార్మికులకు వర్తింపు

  • మృతుల భార్య లేదా భర్త, పిల్లలు, తల్లిదండ్రులను కుటుంబసభ్యులుగా పరిగణిస్తారు. వీరికి ప్రాధాన్య క్రమంలో ఎక్స్‌గ్రేషియా అందజేస్తారు.

  • దరఖాస్తుతో పాటు సదరు కార్మికుడి మరణ ధ్రు వీకరణ పత్రం, రద్దు చేసిన పాస్‌పోర్టు, పై ఏడింటిలోని ఏదైనా ఒక దేశంలో పని చేస్తున్నట్లు వీసా ధ్రువీకరణ పత్రం, ఎక్స్‌గ్రేషియా పొందేవారి బ్యాం కు అకౌంటు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

  • పైన పేర్కొన్న అన్ని ధ్రువీకరణ పత్రాలతో అర్హత గల కుటుంబ సభ్యుడు తమ జిల్లా కలెక్టరుకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు, ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్‌ పరిశీలించాలి.

  • దరఖాస్తు పరిశీలన అనంతరం ఎక్స్‌గ్రేషియాను మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ జారీ చేయాలి. వెంటనే సంబంధిత కుటుంబ సభ్యుడి బ్యాంకు అకౌంట్‌లో రూ.5 లక్షల ఎక్స్‌గేషియా సొమ్మును జమ చేయాలి.

  • గల్ఫ్‌ కార్మికుడు మరణించిన నాటి నుంచి లేదా మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకున్న నాటి నుంచి ఆరు నెలల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్‌కు ఎక్స్‌గ్రేషియా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు అందిన తర్వాత సాధ్యమైనంత తక్కువ సమయంలోనే ఎక్స్‌గ్రేషియాను మంజూరు చేసేలా కలెక్టర్లు జాగ్రత్త వహించాలి.

Updated Date - Oct 08 , 2024 | 03:38 AM