Share News

Medigadda Barrage: మేడిగడ్డ తుది నివేదికపై విజిలెన్స్‌ కసరత్తు

ABN , Publish Date - Oct 06 , 2024 | 03:32 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి గల కారణాలపై తుది నివేదిక అందించడానికి వీలుగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కసరత్తును ముమ్మరం చేసింది.

Medigadda Barrage: మేడిగడ్డ తుది నివేదికపై  విజిలెన్స్‌ కసరత్తు

  • మాజీ ఈఎన్సీ మురళీధర్‌రావు నుంచి వివరాల సేకరణ

  • రేపు, ఎల్లుండి మరికొందరు నుంచి సమాచారం

హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి గల కారణాలపై తుది నివేదిక అందించడానికి వీలుగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కసరత్తును ముమ్మరం చేసింది. మేడిగడ్డ బ్యారేజీతో ముడిపడిన అంశాలపై వివరాలు సేకరణకు వీలుగా శనివారం అధికారులను పిలిపించింది. ఈ మేరకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు మాజీ ఈఎన్సీ(జనరల్‌) సి.మురళీధర్‌ రావు, డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ అజ్మల్‌ఖాన్‌ హాజరయ్యారు. మేడిగడ్డ నిర్మాణంలో మార్పులు, చేర్పులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? సవరణ అంచనాలకు ఆమోదం తెలిపిందెవరూ? మేడిగడ్డ నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారంటీలు విడుదల చేయాలని ఆదేశించింది ఎవరు? వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.


ఇక ఈనెల 7న ఈఎన్సీ(వో అండ్‌ ఎం), రాష్ట్ర స్థాయి స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు బి.నాగేంద్రరావు, 8వ తేదీన సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) మాజీ చీఫ్‌ ఇంజనీర్‌(సీఈ) టి.శ్రీనివాస్‌, వి.ఫణీభూషణ్‌ శర్మ నుంచి విజిలెన్స్‌ వివరాలు కోరనుంది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యాలకు గల కారణాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ ప్రాథమిక, మధ్యంతర నివేదికలు కాళేశ్వరం విచారణ కమిషన్‌ అందించగా... తుది నివేదికను సమర్పించడానికి అవసరమైన వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకోవడానికి వీలుగా కసరత్తును చేపట్టింది.

Updated Date - Oct 06 , 2024 | 03:32 AM