Share News

Yadagirigutta: యాదగిరిగుట్టలో పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Jun 19 , 2024 | 08:39 AM

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Yadagirigutta Sri Lakshminarasimhaswamy) వారి ఆలయంలో ఆనవాయితీగా వస్తున్న గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. ఉద్ఘాటన అనంతరం మంగళవారం గిరి ప్రదక్షిణను ప్రారంభించగా.. భక్తులు ‘నమో నారసింహ’ అంటూ ఆద్యంతం ఉత్సాహంగా పాల్గొన్నారు.

Yadagirigutta:  యాదగిరిగుట్టలో పోటెత్తిన భక్తులు

భువనగిరి అర్బన్‌: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Yadagirigutta Sri Lakshminarasimhaswamy) వారి ఆలయంలో ఆనవాయితీగా వస్తున్న గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. ఉద్ఘాటన అనంతరం మంగళవారం గిరి ప్రదక్షిణను ప్రారంభించగా.. భక్తులు ‘నమో నారసింహ’ అంటూ ఆద్యంతం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏకశిఖరవాసుని పట్ల తమ భక్తిని చాటుకున్నారు. యాద‘గిరి’పై కొలువైన లక్ష్మీసమేతుడి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున సుమారు 10 వేల మందికిపైగా భక్తులు గిరి ప్రదక్షిణలో భాగస్వాములైనట్లు అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. ఆలయ ఈవో ఏ.భాస్కర్‌రావుతో కలిసి ప్రదక్షిణలో స్వామివారి భక్తులతో పాటు వారు పాల్గొన్నారు. ఉదయం 5.30 గంటలకు వైకుంఠ ద్వారం వద్దకు చేరిన సుమారు 2 వేల మంది భక్తజనులతో ప్రారంభమై కొండచుట్టూ సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర 45 నిమిషాలపాటు సాగిన ప్రదక్షిణ పూర్తయ్యేటప్పటికి భక్తుల సంఖ్య 10 వేలు దాటింది.


ప్రదక్షిణ చేసిన భక్తులు మెట్ల దారిలో కొండపైకి చేరుకుని క్యూ లైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి మొక్కులు తీర్చుకున్నారు. విప్‌, ఈవో, ఆలయ అధికారులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తెలంగానలో గిరిప్రదక్షిణ కలిగిన ఏకైక ఆలయంగా యాదగిరిగుట్ట పేరొందింది. ఇక యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం స్వాతి నక్షత్ర పూజలు వైభవంగా జరిగాయి. స్వామివారి భక్తులకు నిత్యాన్నదానం కోసం హైదరాబాద్‌ అజశ్రా హోమ్స్‌కు చెందిన నిమ్మగడ్డ రామకృష్ణారావు, జ్యోతి దంపతులు మంగళవారం రూ.18 లక్షల చెక్కును అందజేశారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 19 , 2024 | 08:39 AM