Share News

Cyber Fraud: జగన్‌ మీడియాపై కేంద్రానికి ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఫిర్యాదు

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:42 AM

వైసీపీ అధినేత జగన్‌ మీడియా.. సైబర్‌ ఫ్రాడ్‌, వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌ వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్న వైనంపై ‘ఏబీఎన్‌-ఆంద్రజ్యోతి’ కేంద్ర సమాచార, ప్రసార శాఖకు ఫిర్యాదు చేసింది.

Cyber Fraud: జగన్‌ మీడియాపై కేంద్రానికి ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఫిర్యాదు

  • ‘సాక్షి’ చానల్‌కు కేంద్ర హోం శాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్‌ లేదన్న విషయమూ ఫిర్యాదులో ప్రస్తావన

  • శాటిలైట్‌ ఫ్రీక్వెన్సీ హ్యాకింగ్‌పైనా విజయవాడలో కేసు

అమరావతి, హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్‌ మీడియా.. సైబర్‌ ఫ్రాడ్‌, వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌ వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్న వైనంపై ‘ఏబీఎన్‌-ఆంద్రజ్యోతి’ కేంద్ర సమాచార, ప్రసార శాఖకు ఫిర్యాదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ, సాక్షి కంటే మెరుగైన ర్యాంకింగ్‌ ఉన్న ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ వెబ్‌సైట్‌కు వచ్చే ట్రాఫిక్‌ను సైబర్‌ నేరగాళ్లు ట్యాగ్స్‌ ద్వారా మళ్లిస్తున్నారని.. వారికి ‘సాక్షి’తో సంబంధాలు ఉన్నాయని బలంగా అనుమానిస్తున్నట్టు వెల్లడించింది. జగన్‌ రోత మీడియా చేస్తున్న ఈ చర్యల వల్ల వాటిల్లుతున్న ఆర్థిక నష్టం గురించి, సంస్థ ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతింటున్న వైనం గురించి ఈ లేఖలో పేర్కొంది. బాధ్యులైనవారిపై వెంటనే కఠినచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ‘న్యూస్‌ బ్రాడ్‌క్యాస్టింగ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (ఎన్‌బీఎ్‌సఏ)’ రూపొందించిన నైతిక నియమావళిని సాక్షి టీవీ గతంలో పలు సందర్భాల్లో ఉల్లంఘించిన విషయాన్ని కూడా ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ తన లేఖలో గుర్తుచేసింది.


2022 జనవరి 20న.. కేంద్ర హోం శాఖ నిఘా వర్గాల నివేదికలను ఉటంకిస్తూ సాక్షి చానల్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్‌ ఇవ్వడానికి నిరాకరించిన విషయాన్ని, ప్రస్తుతం ఆ చానల్‌ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక నిలుపుదల ఉత్తర్వులపై నడుస్తున్న విషయాన్ని సమాచార శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకొచ్చింది. మరోవైపు.. జగన్‌ మీడియాపై విజయవాడలో సైబర్‌ కేసు నమోదైంది. గడిచిన రెండు నెలలుగా ఇంటర్‌నెట్‌లో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ వెబ్‌సైట్‌ చూడాలనుకుంటే.. సాక్షి వెబ్‌సైట్‌ వచ్చేలా ఫ్రాడ్‌ జరిగిందని, దీనివల్ల నెలకు రూ.50 లక్షల నష్టం వాటిల్లుతోందని, అలాగే ఏబీన్‌-ఆంధ్రజ్యోతి ఓబీ వ్యాన్‌ (డీఎ్‌సఎన్‌జీ) శాటిలైట్‌ ఫ్రీక్వెన్సీని కూడా ఇటీవల హ్యాక్‌ చేశారని.. దీనిపై ఇస్రోకు కూడా ఫిర్యాదు చేశామని, దీని వెనుక కూడా సాక్షి హస్తం ఉందని అనుమానిస్తూ విజయవాడలో సంస్థ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు.. బీఎన్‌ఎ్‌స యాక్ట్‌లోని 318 (4), 319 (2) సెక్షన్లతోపాటు, ఐటీచట్టంలోని 66, 66సీ, 66డీ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 03:42 AM