Minister Nara Lokesh : ఏఐ సెంటర్ మాకివ్వండి
ABN , Publish Date - Feb 05 , 2025 | 04:13 AM
కృత్రిమ మేధ (ఏఐ)తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్రం చేయూతనివ్వాలని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి లోకేశ్ విన్నవించారు.

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్కు లోకేశ్ వినతి
విశాఖ డేటా సిటీకి సహకరించండి
కేంద్రం అనుమతులు సులభతరం చేయండి
సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్లు ఇవ్వండి
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం
ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం
ఎలక్ర్టానిక్స్ కంపెనీలతో యువతకు ఉపాధి
వాటి స్థాపనకు సహకారం అందించండి
కేంద్ర ఐటీ-ఎలకా్ట్రనిక్స్ మంత్రికి అభ్యర్థన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ‘ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ ఎడ్యుకేషన్’ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి లోకేశ్.. కేంద్ర ఐటీ, ఎలక్ర్టానిక్స్, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కోరారు. కృత్రిమ మేధ (ఏఐ)తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్రం చేయూతనివ్వాలని విన్నవించారు. విశాఖపట్నంలో తాము ఏర్పాటు చేసే డేటా సిటీకి సహకరించాలని కోరారు. మంగళవారమిక్కడ రైల్ భవన్లో కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. ఆయన్ను మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించారు. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి అత్యధికంగా కేటాయింపులు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఐటీ, ఎలక్ర్టానిక్స్ రంగాల అభివృద్థికి తీసుకుంటున్న చర్యలు, నూతన పాలసీల గురించి కేంద్ర మంత్రికి వివరించారు. ఏఐ విప్లవంతో డేటా సిటీలకు పెద్దఎత్తున డిమాండ్ రాబోతోందని.. కృత్రిమ మేధ రంగంలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ డేటా సిటీల ఏర్పాటుకు అవసరమైన ప్రత్యేక పాలసీల రూపకల్పన, సింగిల్ విండో పద్థతిలో కేంద్రం నుంచి అనుమతులు సులభతరం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ‘డేటా సిటీలు, ఎలక్ర్టానిక్స్ కంపెనీల ఏర్పాటుతో ఏపీ యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 2047కి 30 ట్రిలియన్ డాలర్లకు దేశ ఆర్థిక వ్యవస్థ చేరాలన్నది ప్రధాని మోదీ లక్ష్యం. కేంద్ర సహకారంతో ఏఐ రంగంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని వికసిత్ భారత్ లక్ష్యంలో ఏపీ భాగస్వామి అవుతుంది.
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలో ఎలక్ర్టానిక్స్ కంపెనీల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి. ఐటీ, ఎలక్ర్టానిక్స్ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడమే కాకుండా.. ప్రాజెక్టులు త్వరితగతిన ఏర్పాటయ్యేవిధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు చర్యలు తీసుకుంటున్నాం’ అని లోకేశ్ తెలిపారు. కాగా.. మంగళగిరిలో ఎన్నో ఏళ్లుగా 800 నిరుపేద కుటుంబాలు నిరుపయోగంగా ఉన్న రైల్వే భూముల్లో నివసిస్తున్నారని.. మానవతా దృక్పథంతో ఆ భూములను రాష్ట్రప్రభుత్వానికి కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు. వారికి అక్కడ శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేస్తామని చెప్పారు.
సమష్టి కృషితోనే రాష్ట్రానికి మేలు
కలిసికట్టుగా ఉండడం వల్లే విశాఖ స్టీల్ప్లాంట్ను కాపాడుకోగలిగామని, రాష్ట్రప్రయోజనాల విషయంలో ఇక ముందు కూడా ఇదే పంథా కొనసాగిద్దామని లోకేశ్ అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, టీడీపీ ఎంపీలు, బీజేపీ నేతలు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. 7 నెలల్లోనే సమష్టి కృషితో విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్కు నిధులు తెచ్చుకోగలిగామని చెప్పారు. రాష్ట్రాభివృద్థికి కేంద్ర మంత్రులు, ఎంపీలు చేస్తున్న కృషిని అభినందించారు. అతి తక్కువ కాలంలో విశాఖ స్టీల్ సహా అనే సమస్యలు పరిష్కారం కావడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం
శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News