Botsa on Budget: ఏపీ బడ్జెట్పై బొత్స హాట్ కామెంట్స్
ABN , Publish Date - Feb 28 , 2025 | 02:10 PM
Bosta Satyanarayana: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని మండిపడ్డారు.

అమరావతి, ఫిబ్రవరి 28: ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (AP Minister Botsa Satyanarayana) ప్రవేశపెట్టిన బడ్జెట్పై వైసీపీ ఎమ్మెల్సీలు ఘాటుగా స్పందించారు. బడ్జెట్లో ఏ రంగానికి న్యాయం జరగలేదని.. అంతా అరకొరకగానే నిధులు కేటాయించారని విమర్శించారు. సూపర్ సిక్స్కు కేటాయింపులు లేవన్నారు. బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందంటూ ఎమ్మెల్సీలు దుయ్యబట్టారు. రాష్ట్ర బడ్జెట్పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. బడ్జెట్ అంతా ఆత్మస్తుతి, పరనిందలా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాన్ని తిట్టడం .. ముఖ్యమంత్రిని ఆయన కుమారుడిని పొగుడుకోవడమే కనిపించిందన్నారు. ఈ తరహా సాంప్రదాయం కొనసాగించడం దురదృష్టకరమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై అరకొరగా కేటాయింపులు చేశారని విమర్శించారు.
ప్రభుత్వం ప్రజలను వంచించిందని, మోసం చేసిందన్నారు. 18-50 ఏళ్ల మహిళలకు నెలకు 1500 ఇస్తామన్నారని .. బడ్జెట్లో ఆ మాటే లేదన్నారు. బడ్జెట్తో నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదన్నారు. నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకానికి సరిపడా నిధులు కేటాయించలేదన్నారు. 81 లక్షల మంది విద్యార్థులు ఉండగా... రూ.12 వేల కోట్లు కావాల్సి వస్తే కేవలం రూ.9400 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. అలాగే 52 లక్షల మంది రైతులకు రైతుభరోసా రూ.20 వేలు ఇచ్చేందుకు రూ.12 వేల కోట్లు కావాల్సి ఉండగా అరకొరగా కేటాయించారన్నారు. ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అన్నారని.. కానీ ఆ ఊసే లేదని అన్నారు. గత ప్రభుత్వంలో 3 వేల కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెడితే... ఈ బడ్జెట్లో రూ.300 కోట్లే పెట్టారన్నారు. జబ్బలు చరచుకోవడం కాదని... ఆచరణలో చూపిస్తామన్నారని...చూపించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు న్యాయం జరిగే బడ్జెట్ కాదన్నారు. సామాన్య ప్రజలకు , నిరుద్యోగులకు న్యాయం జరగదన్నారు. బడ్జెట్తో ఏ వర్గానికీ న్యాయం జరగదని బొత్స సత్యనారాయణ విమర్శించారు.
Payyavula Keshav: అన్నింటిలో డ్రాప్ అవుట్లే.. ఆకట్టుకున్న పయ్యావుల బడ్జెట్ ప్రసంగం
అంతా అంకెలే తప్ప: రవిబాబు
బడ్జెట్లో అంకెలే తప్ప అభివృద్ధి లేదని వైసీపీ ఎమ్మెల్సీ కుంబా రవిబాబు అన్నారు. వెనుకబడిన వర్గాలకు కేటాయింపులు లేవన్నారు. ఉత్పాదక రంగానికి పూర్తిగా కేటాయింపులు లేవని తెలిపారు. సూపర్ సిక్స్కు కేటాయింపులు లేవని.. నిరుద్యోగులకు 3 వేలు ఇస్తామని చెప్పారని.. ఆ ప్రస్తావన ఎక్కడా లేదని ఎమ్మెల్సీ వ్యాఖ్యలు చేశారు.
నిట్టనిలువునా మోసం: కళ్యాణి
బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసిందని మరో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని మండిపడ్డారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులను మోసం చేశారన్నారు. మహాశక్తి పథకానికి నిధుల కేటాయింపుల ప్రస్తావన లేదని అన్నారు. నిరుద్యోగులను నిట్టనిలువునా మోసం చేశారని విమర్శించారు. తల్లికి వందనంకు కేవలం రూ.9 వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఉచిత గ్యాస్ పథకాన్ని రూ. 90 లక్షలకే కుదించారన్నారు. ధరల స్థిరీకరణ నిధి 5 వేల కోట్లు కావాల్సి ఉండగా.. రూ.300 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. ఏరు దాటాక తెప్ప తగలేశారంటూ వరుదు కళ్యాణి దుయ్యబట్టారు.
ఐఆర్, పీఆర్సీ ప్రస్తావన ఏది: చంద్రశేఖర్
ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ అన్నారు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ గురించి ప్రస్తావనే లేదన్నారు. నిరుద్యోగ భృతి మాటే లేదన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు రూపాయి కూడా చెల్లించలేదని... వీటికి నిధులు కేటాయించలేదని అన్నారు. 79 వేల కోట్లు మాత్రమే జగన్ హయాంలో అప్పులు చేశారని చెప్పారని.. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.4. లక్షల కోట్లు అప్పులు చేస్తామని చెప్పారన్నారు. 3 న వీసీలను బెదిరించారించిన ఆధారాలు ఇస్తామని తెలిపారు. వీసీలను బెదిరించిన వ్యవహారంపై జ్యుడిషియరీ విచారణ జరపాలని కోరతామని చంద్రశేఖర్ వెల్లడించారు.
బడ్జెట్లో ఒరిగిందేమీ లేదు: ఇజ్రాయిల్
బడ్జెట్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ప్రయోజనం చేకూర్చేలా లేదని వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయిల్ అన్నారు. ఆత్మస్తుతి పరనింద తప్ప మరోటి లేదన్నారు. ఏడాదిలోనే 1.19 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పుకొచ్చారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇస్తామన్నారని.. కానీ దానికి బట్జెట్లో కేటాయింపులు లేవన్నారు. బడ్జెట్ అంకెల గారడి తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని బొమ్మి ఇజ్రాయిల్ విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి...
MLC Election: పోటెత్తిన టీచర్లు
AP Budget 2025: అభివృద్ధి పథకాలకు భారీగా కేటాయింపులు..
Read Latest AP news And Telugu News