Ayyanna Patrudu : అసెంబ్లీ కమిటీలు చురుగ్గా ఉండాలి
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:32 AM
కనీసం రెండు సార్లు సమావేశం కావాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు.

నెలలో కనీసం రెండుసార్లు సమావేశమవ్వాలి: స్పీకర్
అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): శాసనసభ ఆర్థిక కమిటీలు నెలలో కనీసం రెండు సార్లు సమావేశం కావాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. మంగళవారం అసెంబ్లీ భవనంలో శాసనసభ ప్రజాపద్దుల కమిటీ, అంచనాల కమిటీ, ప్రభుత్వ సంస్థల కమిటీల ప్రాథమిక సమావేశాన్ని స్పీకర్ అధ్యక్షతన నిర్వహించారు. స్పీకర్ మాట్లాడుతూ కమిటీల ఏర్పాటులో ఇప్పటికే చాలా ఆలస్యమైందని, కమిటీ మెంబర్లు చాలా చురుగ్గా ఉండాలని సూచించారు. తద్వారా అసెంబ్లీ ప్రొసీడింగ్లోగానీ, అసెంబ్లీని నడిపించడంగానీ ఎంతో సులభమవుతుందన్నారు. ఏ రాష్ట్రమైనా సరే అసెంబ్లీ సమావేశాలను సంవత్సరానికి కనీసం 60 రోజులు జరపాలని ఢిల్లీలో నిర్వహించిన అన్ని రాష్ట్రాల స్పీకర్ల సమావేశంలో తీర్మానం చేసినట్టు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ కమిటీల సమావేశాలను గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించి మంచి పేరు తీసుకురావాలన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ పార్టీలకతీతంగా పారదర్శకంగా, వివేకవంతంగా తమ కమిటీ పనిచేస్తుందన్నారు.