ChatGPT : అవును.. ఛాట్ జీపీటీ ఈ పొలిటికల్ పార్టీకి అనుకూలంగా ఉంది.. మస్క్..
ABN , Publish Date - Feb 04 , 2025 | 04:51 PM
ఛాట్ జీపీటీ ఈ పొలిటికల్ పార్టీకి అనుగుణంగా ప్రవర్తిస్తోందని ఇటీవల ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ విషయాన్ని నేనూ సమర్థిస్తున్నాను అంటూ తాజాగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏఐ పనితీరుపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.

రాబోయేది ఏఐ యుగమని ఇప్పుడు ప్రపంచంలోని ప్రజలంతా బలంగా నమ్ముతున్నారు. ప్రతి రంగాన్ని శాసించేది ఆర్టిఫిషియల్ టెక్నాలజీనే అనే ఉద్దేశంతో అందుకు అనుగుణంగా అన్ని వ్యవస్థలు ఇప్పటి నుంచే ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పుడు సోషల్ మీడియా ప్రజలతో పాటు రాజకీయ పార్టీలను ఎంతగా ప్రభావితం చేస్తోందో చూస్తూనే ఉన్నాం. చిన్న విషయానికి ఇంటర్నెట్ మీదనే ఆధారపడుతున్నాం. ఏది నిజం ఏది అబద్ధం అని ఇప్పటికే చాలామంది తెలుసుకోవాలనే స్పృహ కూడా చాలామందికి లేదు. ఉన్నా కనిపెట్టడం అందరికీ చేతకాదు. ఇదిలా ఉంటే ప్రారంభంలోనే ఏఐ టెక్నాలజీ సృష్టిస్తున్న సంచనాలు ఏ పరిస్థితులకు దారితీస్తాయోనని అంతా కంగారు పడుతున్నారు. అడిగినవల్లా క్షణాల్లో చేసిపెట్టే ఆర్టిఫిషియల్ టెక్నాలజీని తప్పుడు పనులకు వినియోగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఏఐ మోడల్ ఛాట్ జీపీటీ పనితీరుపై పరిశోధన చేయగా అనూహ్య విషయాలు బయటికొచ్చాయి. ఇది నిజమని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిర్ధారించడం ఆందోళన చెందుతున్నారు.
అమెరికాకు చెందిన ఓపెన్ ఏఐ ఛాట్ జీపీటీని ప్రజలకు పరిచయం చేసి ఏఐ శకాన్ని కొత్త మలుపు తిప్పింది. చైనాకు చెందిన డీప్ సీక్ ఏఐ రంగంలో అడుగుపెట్టనంతవరకూ ఛాట్ జీపీటీదే హవా. ఈ రేసులో త్వరలో భారత్ కూడా అడుగుపెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలు, ప్రముఖ దేశాలు ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అభివృద్ధి చేయడంలో తలమునకలుగా ఉన్నాయి. డీప్ సీక్ దెబ్బకు అమెరికా ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి స్టార్గేట్ అనే ప్రాజెక్టును మొదలుపెట్టింది. ఈ సమయంలోనే ఛాట్ జీపీటీ పనితీరుపై ఓ పరిశోధన సంస్థ వెల్లడించిన నివేదిక బయటికి వచ్చింది. ఛాట్ జీపీటీ పక్షపాతంతో వ్యవహరిస్తోందని, ఓ వర్గం భావజాలానికి అనుకూలంగా పనిచేస్తోందని తెలపడం ఏఐ పనితీరుపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ సమర్థిస్తూ పోస్ట్ పెట్టడంతో చర్చనీయాంశంగా మారింది.
సైటెక్డెయిలీ కథనంలో ఏముందంటే..?
కన్జర్వేటీవ్లను పరిగణనలోకి తీసుకోకుండా ఛాట్ జీపీటీ లెఫ్ట్ భావజాలానికి అనుకూలంగా పనిచేస్తోందని.. రాజకీయ పక్షపాతం చూపిస్తోందనే ఆరోపణలున్నాయి. ఈ అనుమానాలు నిజమా కాదా అని తేల్చేందుకు యూనివర్శిటీ ఆఫ్ ఆంగ్లియా ఓ బ్రెజిల్ సంస్థతో కలిసి ఉమ్మడిగా పరిశోధన చేసింది. చాట్ జీపీటీ టెక్స్ట్, ఇమేజ్ జనరేషన్లు కమ్యునిజానికి మద్ధతుగా పనిచేస్తున్నాయని పేర్కొంది. ఈ నివేదికల ఆధారంగా సైటెక్డెయిలీ కథనం ప్రచురించింది. ఈ తరహాలో ఏఐ టెక్నాలజీ పనిచేస్తే జర్నలిజం, పాలిటిక్స్, ఎడ్యుకేషన్ ఇలా అన్ని రంగాలు సోషల్ ఎథిక్స్ కోల్పోయి ప్రజలు ప్రమాదంలో పడతారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేలా నిబంధనలు తెచ్చి ఏఐని నియంత్రించాలని సూచించింది. ఎక్స్లో ఈ కథనానికి సంబంధించిన పోస్ట్నే రీపోస్ట్ చేసి తన మద్ధతు ప్రకటించారు టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్.