PM Modi: ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు.. భారత్-న్యూజిలాండ్ సంయుక్త ప్రకటన
ABN , Publish Date - Mar 17 , 2025 | 08:47 PM
ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా సహించేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2019లో క్రైస్ట్ చర్చి నగరంపై దాడి అయినా, 2008లో ముంబైపై ఉగ్రవాద దాడులైనా ఒకరటేనన్నారు.

న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఉగ్రవాదంపై సమష్టి పోరాటానికి భారత్-న్యూజిలాండ్ నిర్ణయించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తెలిపారు. ఉభయదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచుకోవడం, అంతర్జాతీయ సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిష్టోపర్ లక్సన్ (Christopher Luxon) తో భేటీ అనంతరం ఉభయులూ సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా సహించేది లేదన్నారు. 2019లో క్రైస్ట్ చర్చి నగరంపై దాడి అయినా, 2008లో ముంబైపై ఉగ్రవాద దాడులైనా ఒకరటేనన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదులపై పోరాటంలో పరస్పరం సహకరించుకోవాలని తమ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. న్యూజిలాండ్లో కొన్ని శక్తులు భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయాన్ని ఆ దేశ ప్రధాని దృష్టికి తెచ్చామని చెప్పారు. అక్రమ కార్యకలాపాలపై న్యూజిలాండ్ ప్రభుత్వం చర్చలు తీసుకుంటుందని తాము విశ్వసిస్తు్న్నామని అన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు, కలిసి పనిచేయడానికి ఉద్దేశించిన ఐపీఓఐలో చేరేందుకు న్యూజిలాండ్ను స్వాగతిస్తున్నామన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సెక్యూరిటీ రంగంలో పరస్పర సహకారం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు రెండు దేశాలు నిర్ణయించినట్టు చెప్పారు.
న్యూజిలాండ్ ప్రధాన లక్సన్ మాట్లాడుతూ, భారతదేశంతో పటిష్ట సంబంధాలకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇరుదేశాల మధ్య వారధిగా న్యూజిలాండ్లోని ఎన్ఆర్ఐలు నిలుస్తున్నారని ప్రశంసించారు. న్యూఢిల్లీకి తనను ఆహ్వానించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, లక్సన్ పర్యటన సందర్భంగా రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య సహకరాన్ని కొనసాగించే ఒక ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.
ఇవి కూడా చదవండి..