Share News

Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. ప్రధాని మోదీ స్పందన

ABN , Publish Date - Jan 29 , 2025 | 07:01 AM

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో అపశృతి చోటుచేసుకుంది. ఈరోజు మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై ప్రధాని మోదీ సహా పలువురు అధికారులు స్పందించారు.

Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. ప్రధాని మోదీ స్పందన
Kumbh Mela 2025

ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా(Kumbh Mela 2025)లో ఈరోజు మౌని అమావాస్య స్నానానికి హాజరైన భక్తుల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. సంగం నది దగ్గర జరిగిన ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. ఈ క్రమంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఇది మంగళవారం నుంచి బుధవారం మధ్య రాత్రి 1:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ సమయంలో రెండో రాజ స్నానం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో సంగం నది వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.


స్పందించిన ప్రధాని..

ఆ క్రమంలో పురుషులు, స్త్రీలు సహా అందరూ ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో అరుస్తూ, కేకలు వేస్తూ తమ కుటుంబ సభ్యుల కోసం ఆర్తనాదాలు చేశారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది అక్కడి నుంచి గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఆయన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకున్నారు. ప్రధాని మోదీ తక్షణమే బాధితులకు సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

అధికారుల క్లారిటీ

కుంభమేళా అథారిటీ ప్రత్యేక కార్యనిర్వాహక అధికారి ఆకాంక్ష రాణా ఈ ఘటన గురించి వివరణ ఇచ్చారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, సంగం నోస్ వద్ద అడ్డంకి విరిగిపోవడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ఆ క్రమంలో భక్తులు ఒకరికొకరు పడిపోయారని చెప్పారు. ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారని, వారు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇది తీవ్రమైన పరిస్థితి కాదని ఆమె అన్నారు. భయాందోళన చెందాల్సిన పరిస్థితి లేదని స్పష్టం చేశారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.


సమీప ఘాట్‌లో స్నానం చేయాలని విజ్ఞప్తి

ఇదే సమయంలో జగత్గురు రాంభద్రాచార్య భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు. గంగానదికి సమీపంలోని ఏ ఘాట్‌లోనైనా పవిత్ర స్నానం చేయాలని సూచించారు. సంగం వద్ద మాత్రమే స్నానం చేయాలని భక్తులు అనుకోవద్దన్నారు. ప్రజలు గంగానదిపై నిర్మించిన ఏ ఘాట్‌లోనైనా స్నానం చేయాలని, నది ప్రతిచోటా ఒకేలా ఉంటుందన్నారు. కాబట్టి సంగం వద్ద మాత్రమే స్నానం చేయాలని భక్తులు మొండిగా ఉండకూడదన్నారు. మేళా మొత్తం సంగం వలె పవిత్రమైనదని వెల్లడించారు.


సాధువుల స్నానం రద్దు

ఈ ఘటన నేపథ్యంలో అఖిల భారతీయ అఖారా పరిషత్ (ABAP) అధ్యక్షుడు శ్రీమహంత్ రవీంద్ర పురి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు చేయనున్న అమృత్ స్నానం రద్దు చేసుకున్నట్లు తెలిపారు. సాధువులు, నాగ సాధువులతో కూడిన ఊరేగింపుతో స్నానం చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఈ ఘటన కారణంగా నిలిపివేసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో తాము ఫిబ్రవరి 3న మూడో అమృత స్నానం చేస్తామన్నారు. అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య స్నాన్ కోసం తాము వెళ్ళడం లేదన్నారు.


ఇవి కూడా చదవండి:

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో..


Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 29 , 2025 | 07:42 AM