Afghanistan: తుపాకులు పేలే చోట టపాసుల మోత.. ఇది తాలిబన్ల రాజ్యమేనా..
ABN , Publish Date - Feb 27 , 2025 | 01:25 PM
AFG vs ENG: ఆఫ్ఘానిస్థాన్ జట్టు మరోసారి సంచలనం సృష్టించింది. తాను ఎంత మాత్రమూ పసికూన కాదని నిరూపించింది. తనతో పెట్టుకుంటే దబిడిదిబిడేనని టాప్ టీమ్స్కు వార్నింగ్ ఇచ్చింది.

అసాధ్యం అనుకునే పనులను ఒక్కసారి చేసి చూపిస్తే అద్భుతం అంటాం. మరి.. అదే పనులను పదే పదే రిపీట్ చేస్తూ పోతే.. అత్యద్భుతం, అమోఘంగా పిలుచుకుంటాం. ఇప్పుడు ఆఫ్ఘానిస్థాన్ జట్టును అందరూ ఇలాగే పిలుస్తున్నారు. ఆఫ్ఘాన్ వీరుల పోరాటాన్ని, తెగువను, గెలుపును అంతా మెచ్చుకుంటున్నారు. క్రికెట్లో కొత్త శక్తి పుట్టుకొచ్చిందని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. దీనంతటికీ కారణం.. ఒకే ఒక విజయం. చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో షాహిదీ సేన 8 పరుగుల తేడాతో అనూహ్య విజయం సాధించి అందర్నీ షాక్కు గురిచేసింది.
అడుగు దూరం
వన్డే వరల్డ్ కప్-2023లో ఇంగ్లండ్ను ఆఫ్ఘాన్ ఓడించినప్పుడు చాలా మంది లైట్ తీసుకున్నారు. ఇది గాలివాటంగా వచ్చిన విజయం అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన టీ20 ప్రపంచ కప్-2024లోనూ అద్భుతంగా రాణించి సెమీఫైనల్స్కు క్వాలిఫై అయింది ఆఫ్ఘాన్. ప్రస్తుతం జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలోనూ మరోమారు ఇంగ్లండ్ను ఓడించి తమ సత్తాను అనుమానిస్తే ముప్పు తప్పదని ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపించింది. సెమీస్కు ఇంకో అడుగు దూరంలో తమ టీమ్ నిలవడంతో ఆఫ్ఘాన్ ప్రజలు సంబురాల్లో మునిగారు. నిత్యం తుపాకుల శబ్దాలు వినిపించే చోట ఇప్పుడు టపాసుల మోత మోగుతోంది.
సంతోషం పట్టలేక..
ఆఫ్ఘాన్ విజయాన్ని అక్కడి ప్రజలు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తాలిబన్ల రాజ్యం అని కూడా మర్చిపోయి జనాలు ఒక్కసారిగా రోడ్ల మీదకు దూసుకొచ్చారు. టపాసులు పేలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ, ఒకర్నొకరు హగ్ చేసుకుంటూ సంబురాల్లో మునిగిపోయారు. కఠిన నిబంధనలు, చావుబతుకుల సంఘర్షణ మధ్య జీవించే ఆఫ్ఘాన్ పౌరులు తమ క్రికెట్ టీమ్ సాధించిన విజయంతో ఉద్వేగానికి లోనయ్యారు. సంతోషం పట్టలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడి సెలబ్రేషన్స్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇవీ చదవండి:
తోటి బాక్సర్పై గుడ్డుతో దాడి!
జట్టుతో చేరిన మోర్నీ మోర్కెల్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి