SLBC Tunnel: డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో సొరంగం!?
ABN , Publish Date - Feb 28 , 2025 | 05:08 AM
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు ముందుకు సాగుతాయా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) కట్టర్ భాగం మినహాయించి మిగతా యంత్రమంతా ధ్వంసమైంది.

సర్కారుకు జేపీ అసొసియేట్స్ ప్రత్యామ్నాయ ప్రణాళిక!
13.5 కి.మీ. నుంచి పక్కకు జరిగి 20వ కి.మీ. వద్ద లింక్
ఈ పద్ధతిలో తవ్వితే త్వరగా పూర్తిచేయొచ్చని అంచనా
ఎన్జీఆర్ఐ, ఎన్ఆర్ఎ్సఏ సూచనలతో ఎస్ఎల్బీసీ
పూర్తికి ప్రత్యామ్నాయ మార్గం
మహబూబ్నగర్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు ముందుకు సాగుతాయా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) కట్టర్ భాగం మినహాయించి మిగతా యంత్రమంతా ధ్వంసమైంది. సహాయక చర్యల్లో భాగంగా టీబీఎంను కట్ చేయాలని నిర్ణయించడంతో మళ్లీ పనులు ప్రారంభించాలంటే కొత్త యంత్రం కావాలి. పాత దాన్ని అక్కడి నుంచి తొలగించడం కూడా కష్టమైన పనే. కొత్త టీబీఎం అంటే నిర్మాణ సంస్థకు భారం కావడంతో పాటు ప్రభుత్వం కూడా ప్రాజెక్టు అంచనా వ్యయాలను పెంచా ల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు 18 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ క్రమం లో నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్ ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాన్ని ప్రభుత్వం ముందు పెట్టనున్నట్లు సమాచారం. ఎన్జీఆర్ఐ, ఎన్ఆర్ఎ్సఏ సూచనలతో పాటు కంపెనీ చైర్మన్ పర్యటన సందర్భంగా ఇంజనీర్లు ప్రాజెక్టు పూర్తికి ఒక ప్రత్యామ్నాయ మ్యాప్ను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఆ ప్రణాళికను పరిశీలించిన తర్వాతనే టీబీఎంను కట్ చేయడానికి కూడా సర్కారు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆ ప్రత్యామ్నాయ మ్యాప్ను ‘ఆంధ్రజ్యోతి’ సంపాదించింది. ఇక టీబీఎంతో సొరంగం తవ్వడం అసాధ్యం కాబట్టి.. డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ (డీబీఎం) పద్ధతిలో టన్నెల్ను పూర్తిచేసుకోవచ్చని ఎన్జీఆర్ఐ నిపుణులు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ప్రమాదం 13.900 కి.మీ. వద్ద జరగ్గా.. 13.500 కి.మీ. వరకు బాగానే ఉంది. అక్కడి నుంచి 50 మీటర్లు కుడి వైపునకు తిరిగి పాత లెవల్ను కొనసాగిస్తూ 20వ కి.మీ. వద్ద పాత అలైన్మెంట్కు టన్నెల్ను కలపనున్నారు. ఇప్పటికే ఔట్లెట్ టన్నెల్ వైపు 20.435 కి.మీ. మేర తవ్వకం పూర్తయింది. పాత డిజైన్ ప్రకారం ఇంకో 3.545 కి.మీ. తవ్వాలి. కానీ, టీబీఎం చెడిపోవడంతో పనులు ఆగిపోయాయి. దీంతో ఔట్లెట్ టన్నెల్ తవ్వ కాన్ని నిలిపివేసి ఇన్లెట్ నుంచి 50 మీటర్లు పక్కకు జరిగి 13.500 కి.మీ. నుంచి 20వ కి.మీ. వరకు డీబీఎం పద్ధతిలో టన్నెల్ను తవ్వుతారు. దీనివల్ల ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసే అవకాశముంటుందని అంచనా. ప్రస్తుతం టన్నెల్ డయా 9.25 మీట ర్లు వృత్తాకారంలో ఉండగా అది 10 మీటర్లకు ‘షూ’ షేప్ సైజ్గా మార్చనున్నారు. ఈ డిజైన్ను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది.
ప్రస్తుత టన్నెల్ తవ్వకం ఇలా..
ఈ ప్రాజెక్టు పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ లిఫ్టులు పెట్టాలన్నా, కాలువలు తవ్వాలన్నా అటవీ అనుమతులు తప్పనిసరి. అవి రావ డం చాలా కష్టం. 2005లో ఈ టన్నెల్ తవ్వకానికి జీవో ఇచ్చినప్పుడు టీబీఎంతో తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించారు.రెండువైపుల నుంచి టన్నెల్ తవ్వకం చేపట్టారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునే దగ్గర చేపట్టిన ఇన్లెట్ టన్నెల్ 19.500 కి.మీ.కు గాను ఇప్పటివరకు 13.935 కి.మీ. పూర్తయింది. ఇంకా 6.015 కి.మీ. సొరంగం తవ్వాల్సి ఉంది. రెండోవైపునల్లగొండ జిల్లా మన్నేవారిపల్లి నుంచి అవుట్లెట్ టన్నెల్ 23.980 కి.మీ.కు గాను 20.435 కి.మీ.పూర్తయింది. మరో 3.545 కి.మీ. తవ్వాల్సి ఉంది. శనివా రం ఇన్లెట్ టన్నెల్ వైపు ప్రమాదం జరిగింది. అయితే సొరంగం పనులు ప్రారంభిస్తే మళ్లీ కూలిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరించారు.