Share News

KTR: బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టరు...

ABN , Publish Date - Mar 21 , 2025 | 10:17 AM

రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు కావాలని అడగరని..ఉన్న పరిశ్రమలను ఉంచాలని కోరరని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చే పనిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, తూకానికి అమ్మే పనిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. మంటికైనా ఇంటోడే కావాలని ఊరికే అనలేదన్నారు. ఈ కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పటికీ ఓట్లు, సీట్లే ముఖ్యమని విమర్శించారు.

 KTR: బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టరు...
BRS Working President KTR

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.)పై సోషల్ మీడియా (Social Media) ఎక్స్ (X) వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ (Steel industry)పెట్టరని, ఆదిలాబాద్‌లో సీసీఐ ఫ్యాక్టరీ (CCI Factory) వేలానికి పెడ్తతారని.. బీజేపీ (BJP) నుండి ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక్కరూ నోరు తెరిచి దీని గురించి మాట్లాడరని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది ఎంపీలు, 64 మంది ఎమ్మెల్యేలు ఒక్కరూ ఈ అన్యాయాన్ని ప్రశ్నించరని కేటీఆర్ నిలదీశారు.


రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు కావాలని అడగరని..ఉన్న పరిశ్రమలను ఉంచాలని కోరరని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చే పనిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, తూకానికి అమ్మే పనిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. మంటికైనా ఇంటోడే కావాలని ఊరికే అనలేదన్నారు. ఈ కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పటికీ ఓట్లు, సీట్లే ముఖ్యమని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ఆకాంక్షలు ఈ పార్టీలకు పట్టవని అన్నారు.

శనివారం చెన్నైకు కేటీఆర్..

కాగా కేటీఆర్ శనివారం చెన్నై పర్యటనకు వెళ్లనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగే దక్షిణాది రాష్ట్రాల నాయకుల సమావేశానికి ఆయన హాజరవుతున్నారు. కేటీఆర్‌తో పాటు చెన్నైకు మాజీ ఎంపీ వినోద్, బీఆర్ఎస్ ఎంపీలు వెళుతున్నారు.


వచ్చే ఏడాది పాదయాత్ర

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా వచ్చే ఏడాది పాదయాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. పాదయాత్ర చేయాలని కార్యకర్తలు, నాయకులు కోరుతున్నారని.. దీనిపై పార్టీలో కసరత్తు జరుగుతోందని తెలిపారు. ఈ ఏడాదంతా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడుతున్నామన్నారు. అంతకుముందు సూర్యాపేటలో జరిగిన సభలోనూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌.. కేటీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కోరారు. ఆ సమయంలో కార్యకర్తలు చప్పట్లు కొట్టగా కేటీఆర్‌ తల ఊపారు. కేటీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘకాలం పాదయాత్ర చేపడతారని, అందుకోసం పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత శారీరక దృఢత్వంపైనా దృష్టి పెట్టనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సూర్యాపేటలోని పార్టీ కార్యాలయంలో గురువారం జిల్లా ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. రాష్ట్రంలో సాగు నీరందక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువని ఆరోపించారు. కేసీఆర్‌పై కోపంతో కావాలనే కాళేశ్వరాన్ని ఖాళీ చేసి పంటలు ఎండిపోయేలా చేశారన్నారు. కేసీఆర్‌ హయాంలో కాళేశ్వరం ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లోని సుమారు 2.50లక్షల ఎకరాలకు రెండు పంటలకూ నీళ్లిచ్చారని గుర్తుచేశారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ సూర్యాపేట జిల్లాకు చెందిన వాడైనా ఎందుకు నీళ్లివ్వడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కృష్ణా జలాలను 36శాతం వాడుకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి 24శాతం కూడా వాడుకునే తెలివి లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సను లేకుండా చేసేందుకు కాంగ్రెస్‌, బీజేపీ కుట్ర పన్నుతున్నాయని అన్నారు. సీఎం రేవంత్‌ను కాపాడుతున్నది బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి అని ఆరోపించారు. అవినీతిపై ఆధారాలతో కేంద్రానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.


నాడు ఎన్టీఆర్‌.. నేడు కేసీఆర్‌

తెలుగు వారి కోసం నాడు ఎన్టీఆర్‌ పోరాడితే.. తెలంగాణ కోసం నేడు కేసీఆర్‌ పోరాడారని కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ కోసం 2001లో కేసీఆర్‌ మంత్రి పదవులను వదులుకొని ఒక్కడే పార్టీని ఏర్పాటు చేశారన్నారు. కేసీఆర్‌ 14 ఏళ్లు తెలంగాణ కోసం అన్నివర్గాల ప్రజలనూ ఏకం చేశారని తెలిపారు. శూన్యం నుంచి సునామీని సృష్టించిన మొనగాడు కేసీఆర్‌ అని.. ఆయన ఆనవాళ్లు చెరిపివేయడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పారు.భూమికి మూడు ఫీట్లు లేనోడు, కేసీఆర్‌ మోకాళ్ల ఎత్తు లేనోడు ఆయన్ని ఉద్దేశించి అసెంబ్లీలో ఇష్టానుసారం మాట్లాడడం ఎంతవరకు సమంజసమని కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ రాక ముందు ఎకరం భూమి ధర రూ.3-5లక్షల వరకు ఉంటే వచ్చాక రూ.20-50 లక్షల వరకు పెరిగిందన్నారు. దీంతో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకులు బాగా సంపాదించారనే అసూయ ప్రజలకు కలిగిందని.. అలాగే కేసీఆర్‌ కుటుంబంలోనే ఎక్కువ మందికి పదవులు వచ్చాయని, వారే బాగుపడ్డారంటూ విష ప్రచారం చేశారని చెప్పారు. చిన్న వయసులో రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాడని, అతనికి అదృష్టం కలిసి వచ్చిందని అన్నారు. ఇప్పుడైనా పర్సనాలిటీ పెంచుకుంటాడనుకుంటే పర్సంటేజీలు పెంచుకుంటున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే జగదీ్‌షరెడ్డి దళితుల పక్షపాతి అన్నారు. కావాలనే ఆయన్ను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేశారని మండిపడ్డారు. మజ్లిస్‌ ఎమ్మెల్యే అసెంబ్లీని గాంధీభవన్‌ లెక్క నడిపితే బాగుండదంటే వారినేమీ అనలేదని, అంత ధైర్యం కూడా లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ 27న వరంగల్‌లో నిర్వహించే సభను చూసి కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలని అన్నారు. ఆ సభకు ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. మేలో పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. ఆ తర్వాత పార్టీ కమిటీలను నియమిస్తామని చెప్పారు.

Updated Date - Mar 21 , 2025 | 10:17 AM