Share News

Lok Sabha Election 2024: ఆ సర్వేల రిపోర్టు చూస్తే రేవంత్, కిషన్ రెడ్డిలకు దిమ్మతిరిగింది: రావుల శ్రీధర్ రెడ్డి

ABN , Publish Date - May 08 , 2024 | 05:44 PM

మాజీ సీఎం కేసీఆర్ (KCR) అంటే భయంతోనే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రైతు బంధును మళ్లీ మొదలుపెట్టిందని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి (Ravula Sridhar Reddy) అన్నారు. రైతు బంధును ఎన్నికల కమిషన్ ఆపమని చెప్పిందని అబ్బద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రైతు బంధు విషయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు నిజమా భట్టి విక్రమార్క మాటలు నిజమా అని ప్రశ్నించారు.

 Lok Sabha Election 2024: ఆ సర్వేల రిపోర్టు చూస్తే రేవంత్, కిషన్ రెడ్డిలకు దిమ్మతిరిగింది: రావుల శ్రీధర్ రెడ్డి
Ravula Sridhar Reddy

హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ (KCR) అంటే భయంతోనే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రైతు బంధును మళ్లీ మొదలుపెట్టిందని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి (Ravula Sridhar Reddy) అన్నారు. రైతు బంధును ఎన్నికల కమిషన్ ఆపమని చెప్పిందని అబ్బద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రైతు బంధు విషయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు నిజమా భట్టి విక్రమార్క మాటలు నిజమా అని ప్రశ్నించారు. రైతు బంధు విషయంలో బీఆర్ఎస్ ఎక్కడా ఫిర్యాదులు చేయలేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉద్దేశపూర్వకంగా రైతు బంధును కాంగ్రెస్ ఆపిందని ధ్వజమెత్తారు. రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పని చేసిందని తెలిపారు. ఎన్నడూ కేసీఆర్ సర్కార్ రైతు బంధును ఆపలేదని స్పష్టం చేశారు.


పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు బీఆర్ఎస్ వైపు ఉంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభద్రతాభావంలో ఉందని చెప్పుకొచ్చారు. బుధవారం తెలంగాణ భవన్ లో రావుల శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల్లో పొటీ కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యనే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊదరగొడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారాయని తెలిపారు. పలు సర్వేలు ఇచ్చిన రిపోర్ట్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిమ్మతిరగటం ఖాయమన్నారు. వాగ్ధానాల వరద, నోటి దురద, అబద్దాల బురద తప్ప రేవంత్ రెడ్డి దగ్గర ఏం లేదని ఎద్దేవా చేశారు.


రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఎందుకు ప్రమాణాలు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.రాష్ట్రంలో మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.ఆరు గ్యారెంటీలు,13 హామీలు పార్లమెంట్ ఎన్నికలకు 23 అంశాలపై కాంగ్రెస్ హామీలు ఇచ్చిందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లని చెక్కు లాంటిదని విమర్శించారు.కేసీఆర్ రోడ్ షోలకు ప్రజలు ప్రభంజనంలా తరలి వేస్తున్నారని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్ సభలకు జనం రావడం లేదని ఎద్దేవా చేశారు.పదేళ్లలో విభజన హామీలు నెరవేర్చారో లేదో చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు అడగాలన్నారు. తెలంగాణకు బీజేపీ చేసింది ఏం లేదని మండిపడ్డారు.


కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేస్తే కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉండి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణకు ఏం చేశారని బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. హైదరాబాద్ నగరంలో కేంద్ర ప్రభుత్వం కట్టే రెండు ఫ్లైఓవర్లు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో 37 ఫ్లైఓవర్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని తెలిపారు. నిజామాబాద్ కు పసుపు బోర్డు తెస్తానని అరవింద్ మోసం చేశారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు.పార్లమెంటులో తెలంగాణ గొంతుక బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే క్యాడర్ ఉందన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం పక్కానని రావుల శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - May 08 , 2024 | 05:44 PM