India vs Canada: భారత్‌పై ఉన్న ఆరోపణలు నిజమని తేలితే.. కెనడా రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-09-25T12:26:31+05:30 IST

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరంగా ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

India vs Canada: భారత్‌పై ఉన్న ఆరోపణలు నిజమని తేలితే.. కెనడా రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు

టొరంటో: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరంగా ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ది వెస్ట్‌ బ్లాక్‌లో ఆదివారం ప్రసారమైన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారత్‌తో బంధం తమకు ముఖ్యమైనది అంటూనే నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు తప్పకుండా కొనసాగుతుందని తెలిపారు. భారత్‌పై ఉన్న ఆరోపణలు నిజమని రుజువైతే, ఇది తమకు సవాల్‌తో కూడుకున్న సమస్యగా మారుతుందని ఆయన అన్నారు. కానీ తమ చట్టాలను గౌరవించుకోవడం, తమ పౌరులను రక్షించుకోవడం తమ బాధ్యత అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ కేసులో సమగ్రంగా దర్యాప్తు జరిపి నిజాలను వెలికితీయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఒక వేళ ఈ ఆరోపణలు నిజమని తేలితే, ఇది చాలా ఆందోళనకర అంశంగా మారుతుందని ఆయన చెప్పారు. తమ గడ్డపై తమ పౌరుడిని హత్య చేయడం, తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అని బిల్ బ్లెయిర్ పేర్కొన్నారు. అలాగే కెనడాకు ఇండో-పసిఫిక్ వ్యూహం ఇప్పటికీ కీలకమైనది అని ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో సైనిక ఉనికిని పెంచడానికి, పెట్రోలింగ్ సామర్థ్యాలను మెరుగుపరడానికి అది ఉపయోగపడుతందని అని అన్నారు.


అసలు ఏం జరిగిందంటే.. ఈ ఏడాది జూన్‌లో ఖలీస్థాన్ మద్దతారుడు, భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా గుర్తించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో దారుణ హత్యకు గురయ్యాడు. సర్రేలోని గురుద్వారా సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చిచంపారు. దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్ వేదికగా భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్యకు భారతదేశానికి సంబంధం ఉందని తమకు సమాచారం ఉందంటూ వ్యాఖ్యానించారు. తమ దేశ పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కెనడాలోనే హత్య చేయడాన్ని తమ సార్వభౌమత్వంపై జరిగిన దాడిగా ఆయన చెప్పుకొచ్చారు. కెనడా విదేశాంగ మంత్రి కూడా భారత్‌పై ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా కెనడాలోని భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు వేశారు.

దీంతో కెనడా ఆరోపణలపై భారత్ స్పందించింది. కెనడా ఆరోపణలను ఖండిస్తూ భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే కెనడాకు కౌంటర్‌గా భారత్‌లోని కెనడా రాయబారిపై వేటు వేసింది. ఐదు రోజుల్లోగా భారత దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. అలాగే భారత్ రావడానికి కెనడియన్లకు ఇచ్చే వీసాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. కెనడాలో ఉండే భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మరోవైపు ఈ వివాదంలో ప్రపంచదేశాలు భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పటికే భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2023-09-25T12:26:31+05:30 IST