Share News

Liquor: నూతన సంవత్సర వేడుకల కోసం బకెట్లలో భారీగా మద్యం బాటిళ్లు.. కానీ ఇంతలోనే..

ABN , Publish Date - Dec 27 , 2023 | 01:07 PM

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలోకి మద్యం రవాణా చేయడానికి కేటుగాళ్లు కొత్త దారులను తొక్కుతున్నారు. పోలీసుల కళ్లు గప్పి ఎలాగైనా సరే మద్యం చేరవేయడమే లక్ష్యంగా పని చేస్తున్న పలువురు అందుకోసం కొత్త కొత్త వ్యూహాలు పన్నుతున్నారు.

Liquor: నూతన సంవత్సర వేడుకల కోసం బకెట్లలో భారీగా మద్యం బాటిళ్లు.. కానీ ఇంతలోనే..

వడోదరా: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలోకి మద్యం రవాణా చేయడానికి కేటుగాళ్లు కొత్త దారులను తొక్కుతున్నారు. పోలీసుల కళ్లు గప్పి ఎలాగైనా సరే మద్యం చేరవేయడమే లక్ష్యంగా పని చేస్తున్న పలువురు అందుకోసం కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో మద్యం సీసాలను బకెట్లలో దాచి ఉంచారు. అయితే ప్రెవెన్షన్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్ (పీసీబీ) పోలీసులు వారి ఆట కట్టించారు. మకరంద్ దేశాయ్ రోడ్డులోని ఓ బంగ్లాపై దాడి చేసి 1,404 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పడవలో ప్రయాణించడానికి ఉపయోగించే బకెట్లలో నిందితులు మద్యం బాటిళ్లను దాచిపెట్టారు. ‘‘మద్యం సీసాలను ప్యాక్ చేసిన బకెట్లలో దాచిపెట్టారు. వాటిని బహిరంగంగా రవాణా చేస్తున్నారు. టూబ్రికెంట్ ఆయిల్ బకెట్లు వాడుతున్నందున ఎవరూ అనుమానించలేదు.’’ అని క్రైమ బ్రాంచ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌డీ రటాడ తెలిపారు.


మద్యం దొంగతనంలో నిందితులైన వారిలో రితేష్ శుక్లా అనే వ్యక్తిని పోలీసులు సంఘటనా స్థలంలోనే అరెస్ట్ చేశారు. మరో నిందితుడైన శంకర్ పరారీలో ఉన్నాడు. కాగా నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో శుక్లాపై ఇప్పటికే ఏడు కేసులు నమోదయ్యాయి. కాగా ఇటీవల ఎల్పీజీ కంటైటర్‌లలో భారీ మొత్తంలో మద్యం తరలిస్తున్న ముఠాను కూడా పోలీసులు పట్టుకున్నారు.హైవేపై కట్టుదిట్టమైన నిఘా ఉంచడంతో మద్యం అక్రమ రవాణాకు నిందితులు కొత్త ట్రిక్స్ ఉపయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు. గత 10 నెలల కాలంలో పీసీబీ రూ.1.20 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా ఇటీవల ఎల్పీజీ ట్యాంకర్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.50.06 లక్షల విలువైన 12,516 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఢిల్లీ-జైపూర్ హైవేపై షాపురా గ్రామం సమీపంలో ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాజస్థాన్ నివాసి అయిన మేఘరామ్ జాట్ అనే డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. మరో ఘటనలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నలుగురు అంతర్ రాష్ట్ర మద్యం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.1 కోట్లు విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 27 , 2023 | 01:07 PM