Bangalore: కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని నిరసిస్తూ.. నేడు బెంగళూరు బంద్‌

ABN , First Publish Date - 2023-09-26T07:19:38+05:30 IST

కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ సంఘాల పిలుపు మేరకు మంగళవారం బెంగళూరు(Bangalore) బంద్‌ జరగనుంది.

Bangalore: కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని నిరసిస్తూ.. నేడు బెంగళూరు బంద్‌

- వివిధ సంఘాలు, పార్టీల మద్దతు

- స్తంభించనున్న రవాణా

- విద్యా సంస్థలకు సెలవు

- బంద్‌కు సహకరిస్తాం : డీసీఎం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ సంఘాల పిలుపు మేరకు మంగళవారం బెంగళూరు(Bangalore) బంద్‌ జరగనుంది. ఈ బంద్‌కు 45కు పైగా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆటో, క్యాబ్‌ సర్వీస్‌ డ్రైవర్లు, యజమానుల సంఘం, కేఎ్‌సఆర్టీసీ, బీఎంటీసీ ఉద్యోగుల ఫెడరేషన్‌ మద్దతు పలకడంతో రవాణా స్తంభించే అవకాశం ఉంది. కావేరి జలాల విషయంలో పోరాటాలకు సంపూర్ణమద్దతు ఇస్తున్నామని సినిమా రంగం ప్రకటించింది. దీంతో సినిమా హాళ్లు పూర్తిగా మూతపడనున్నాయి. మాల్స్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు మూసివేసేందుకు సంసిద్ధత ప్రకటించాయి. బెంగళూరుకు తాగునీరు సమకూర్చే కావేరి జలాశయాల్లో నీటిమట్టం అడుగంటినా తమిళనాడు(Tamil Nadu)కు రోజూ 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలనే ఆదేశాల పరంపర సాగుతుండడంతో ప్రజలు, ప్రజాసంఘాలు, వ్యాపారవర్గాలు స్వచ్ఛందంగా బంద్‌ చేసేందుకు ముందుకు వస్తున్నాయి. సోమవారం మైసూరు బ్యాంకు సర్కిల్లో కన్నడ సంఘాల ఐక్య కూటమి అధ్యక్షుడు వాటాళ్‌ నాగరాజ్‌ ఆధ్వర్యంలో ఎడ్లబండిపై నిరసన తెలిపారు. కావేరి విషయంలో తమిళనాడు ఏళ్ల తరబడి ఇబ్బంది కలిగిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్రస్థాయిలో పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. బెంగళూరు బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో బెంగళూరు నగర జిల్లా పరిధిలోని విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. విద్యార్థుల సురక్షత దృష్ట్యా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్టు నగర జిల్లా అధికారి కేఏ దయానంద సోమవారం ప్రకటన విడుదల చేశారు. బెంగళూరు బంద్‌కు సంపూర్ణంగా సహకరిస్తామని ఉపముఖ్యమం త్రి డీకే శివకుమార్‌ వెల్లడించారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమం కోసం పోరాటం చేస్తే తమ సహకారం ఉంటుందని తెలిపారు. పోరాటం పేరిట శాంతికి భంగం కలిగించరాదని, ప్రజలు ఇబ్బంది పడరాదని పేర్కొన్నారు.

కావేరి జలాల కోసం బీజేపీ నిరసన

కావేరి జలాల విడుదలను నిరసిస్తూ రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ప్రదర్శన చేపట్టింది. మైసూరుబ్యాంకు సర్కిల్లో సోమవారం నిరసన కొనసాగించారు. పార్టీ అగ్రనేతలు సీటీ రవి, నెల నరేంద్రబాబు, అశ్వత్థనారాయణ, భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ చలవాది నారాయణస్వామి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

ముందు జాగ్రత్తలు తీసుకోండి : హైకోర్టు

బెంగళూరు బంద్‌కు పిలుపు ఇచ్చిన మేరకు ముందస్తు చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి సూచించాలని సామాజిక కార్యకర్త రవికుమార్‌ కంచెనహళ్లి దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ శశికిరణ్‌శెట్టి వాదనలు వినిపిస్తూ నిరసన ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని, కేవలం ఫ్రీడంపార్కులో శాంతియుత నిరసనకు అవకాశం ఉందన్నారు. అయితే ఆందోళనకారులు టౌన్‌హాల్‌ నుంచి ఫ్రీడంపార్కు దాకా ర్యాలీ చేస్తామని ప్రకటించారు. కాగా ప్రభుత్వం ముందుజాగ్రత్తలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.

Updated Date - 2023-09-26T07:19:38+05:30 IST