Hindu Sena: మోదీ పేరుతో ఓట్లు అడిగితే చెప్పుతో కొట్టండి!
ABN , First Publish Date - 2023-03-03T21:15:25+05:30 IST
మరికొన్ని నెలల్లో కర్ణాటక(Karnataka) అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్రీయ
బెంగళూరు: మరికొన్ని నెలల్లో కర్ణాటక(Karnataka) అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్రీయ హిందూసేన(Rashtriya Hindu Sena) చీఫ్ ప్రమోద్ ముతాలిక్(Pramod Muthalik) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi) పేరు చెప్పుకుని రాష్ట్రంలో ఓట్లు అడిగే బీజేపీ నాయకులను చెప్పుతో కొట్టాలని అన్నారు. మోదీ పేరు చెప్పకుండా, ఆయన ఫొటో లేకుండా ఓట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నించాలని సవాలు విసిరారు.
ఈ ఎన్నికల్లో మోదీ పేరు ఎత్తకుండా, పాంఫ్లెట్లు, బ్యానర్లపై మోదీ ఫొటో లేకుండా ఓట్లు అడగాలని బీజేపీ నాయకులను ముతాలిక్ కోరారు. రాష్ట్రంలో మీరు చేసిన అభివృద్ధిని మాత్రమే చెప్పుకుని ఓట్లు పొందాలని సూచించారు. గోవులను రక్షించామని, హిందుత్వ కోసం పనిచేశామని చెప్పుకోవాలన్నారు. రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డామన్న గర్వంతో గుండెలు చరుచుకుంటూ ఓట్లు అడగాలని ముతాలిక్ పేర్కొన్నారు. కర్వార్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఎవరూ ఓట్లు వేయొద్దని, ఆ పార్టీకి మోదీ పేరును వాడుకోవడం ఒక్కటే తెలుసని విమర్శించారు.