Chief Minister: ‘కావేరి’ ని విడవండి

ABN , First Publish Date - 2023-07-21T09:23:03+05:30 IST

డెల్టా జిల్లాల్లో రైతులు సకాలంలో సాగుచేసేందుకు వీలుగా కావేరి జలాలను తక్షణమే విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలని

Chief Minister: ‘కావేరి’ ని విడవండి

- కర్ణాటకను ఆదేశించాలంటూ కేంద్ర మంత్రికి స్టాలిన్‌ లేఖ

చెన్నై, (ఆంధ్రజ్యోతి): డెల్టా జిల్లాల్లో రైతులు సకాలంలో సాగుచేసేందుకు వీలుగా కావేరి జలాలను తక్షణమే విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) కేంద్ర జలశక్తి మంత్రి గజేందసింగ్‌ షెకావత్‌(Minister Gajendsingh Shekawat)కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం స్టాలిన్‌ రాసిన లేఖను ఢిల్లీలో గురువారం ఉదయం కేంద్ర మంత్రి షెకావత్‌ను కలిసి రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌ అందజేశారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డెల్టా జిల్లాలకు జూన్‌ 12నే మేట్టూరు డ్యామ్‌ నుండి సాగునీరు విడుదల చేస్తోందని, గత రెండేళ్లలో కావేరి జిలాలను కర్ణాటక ప్రభుత్వం తక్కువ పరిమాణంలోనే కావేరి జలాలను విడుదల చేసిందని స్టాలిన్‌ ఆ లేఖలో వివరించారు. ఈ యేడాది జూన్‌ 12న మేట్టూరు డ్యామ్‌ నుంచి జలాలను విడుదల చేశామని, ప్రస్తుతం ఆ డ్యామ్‌లో నీటి మట్టం తగ్గుతోందని, ఈ పరిస్థితుల్లో కావేరి జలాల విడుదల అవసరమని తెలిపారు. 2018 ఫిబ్రవరి 16న సుప్రీం కోర్టు తీర్పు మేరకు జూన్‌, జూలైలో కావేరి జలాలను కర్ణాటక(Karnataka) ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందన్నారు. కావేరి నది నుంచి జూన్‌ ఒకటి నుంచి జూలై 17 వరకు 26.32 టీఎంసీల జలాలను బిలిగుండ్లు ప్రాంతానికి చేరాలని, అయితే ప్రస్తుతం బిలిగుండ్లు వద్ద 5.78 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని స్టాలిన్‌ తెలిపారు. ప్రస్తుతం కేఆర్‌ఎస్‌, కబిని జలాశయాల నుంచి స్వల్ప పరిమాణంలో విడుదలైన ఈ జలాలు డెల్టా జిల్లాల్లో సాగునీరందించడానికి సరిపోవని స్టాలిన్‌(Stalin) ఆ లేఖలో పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యమైనప్పటికీ కర్ణాటకలోని రెండు జలాశయాల పరీవాహక ప్రాంతాల్లో ప్రస్తుతం భారీగా వర్షాలు కురిసినా ఆ రాష్ట్ర ప్రభుత్వం జలాలు విడుదల చేయలేదని ఆరోపించారు. ఇటీవల రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులతో, కావేరి నిర్వాహక మండలి అధికారులతో కావేరి జలాల విడుదల విషయమై చర్చించారని, వీలైనంత త్వరగా కావేరి జలాలు విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వానికి ఉత్తర్వు జారీ చేయాలని కోరారని స్టాలిన్‌ గుర్తు చేశారు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కావేరి జలాలను వీలైనంత త్వరగా విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని ఆ లేఖలో డిమాండ్‌ చేశారు.

nani5.jpg

తమిళ జాలర్లపై దాడులను నిరోధించండి...

తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం జరుపుతున్న దాడులను, అక్రమ నిర్బంధాలను నిరోధించే దిశగా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని, ఈ విషయమై శుక్రవారం ఢిలీవస్తున్న శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘేతో చర్చలు జరపాలని కోరుతూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ లేఖ రాశారు. గత మూడేళ్లుగా శ్రీలంక నావికాదళం 48 సార్లు దాడులు జరిపి 619 మంది జాలర్లను అక్రమంగా నిర్బంధించడమే కాకుండా, 83 మరపడవలను స్వాధీనం చేసుకుందని, దీనితో జాలర్లు తీవ్రంగా నష్టపోయారన్నారు. 67 మరపడవలను శ్రీలంక ప్రభుత్వం జాలర్లకు అప్పగించలేదని ఆరోపించారు. ఈ నెల తొమ్మిదిన శ్రీలంక నావికాదళం సభ్యులు 15 మంది తమిళజాలర్లను నిర్బంధించారని తెలిపారు. ఇలా అడ్డూ అదుపులేకుండా తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం జరుపుతున్న దాడులను నిరోధించేలా శ్రీలంక అధ్యక్షుడితో ప్రధాని చర్చలు జరపాలన్నారు. ఇదే విధంగా కచ్చాతీవును మళ్ళీ భారత భూభాగంగా చేర్చేందుకు కూడా చర్యలు తీసుకోవాలని స్టాలిన్‌ ఆ లేఖలో కోరారు.

Updated Date - 2023-07-21T09:23:03+05:30 IST