SCO Meeting : పాక్ మంత్రి ఎదుటే ఉగ్రవాదంపై విరుచుకుపడ్డ విదేశాంగ మంత్రి జైశంకర్

ABN , First Publish Date - 2023-05-05T14:37:04+05:30 IST

షాంఘై సహకార సంఘం (SCO) విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత దేశ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్

SCO Meeting : పాక్ మంత్రి ఎదుటే ఉగ్రవాదంపై విరుచుకుపడ్డ విదేశాంగ మంత్రి జైశంకర్
Bilawal Bhutto Zardari, S Jaishankar

గోవా : షాంఘై సహకార సంఘం (SCO) విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత దేశ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలను అరమరికలు లేకుండా వివరించారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ (Bilawal Bhutto Zardari) సమక్షంలోనే క్రాస్ బోర్డర్ ఉగ్రవాదంపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందుతున్న మార్గాలను మూసివేయాలని కరాఖండీగా చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి, భౌగోళిక రాజకీయాల్లో ఒడుదొడుకులు వంటివాటిపై గళమెత్తారు.

ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల మండలి ప్రారంభ సమావేశంలో శుక్రవారం జైశంకర్ మాట్లాడుతూ, ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందుతున్న మార్గాలను మూసివేయాలని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి, భౌగోళిక రాజకీయాల్లో ఒడుదొడుకులు వంటి సమస్యలు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నాయన్నారు. కోవిడ్ మహమ్మారిని, దాని పర్యవసానాలను ప్రపంచం ఎదుర్కొంటున్న సమయంలో ఉగ్రవాద జాఢ్యం వేధింపులు కొనసాగాయని చెప్పారు. ఈ జాఢ్యం గురించి పట్టించుకోకపోతే మన భద్రతకు విఘాతం కలుగుతుందని తెలిపారు. ఉగ్రవాదాన్ని సమర్థించడం ఏ విధంగానూ సాధ్యం కాదన్నారు. దీనికి అనేక రూపాలు ఉన్నాయని, వీటిలో క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఒకటి అని చెప్పారు. అన్ని రూపాల్లోని ఉగ్రవాదానికీ అడ్డుకట్ట వేయాలని చెప్పారు. తారతమ్యాలు లేకుండా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను నిలిపేయాలన్నారు. ఆ కార్యకలాపాలకు అవకాశం కల్పించే అన్ని మార్గాలను మూసేయాలని చెప్పారు. ఉగ్రవాదంతో పోరాడటమనేది ఎస్‌సీఓ ఒరిజినల్ మేండేట్‌లో భాగమేనని సభ్యులకు మరోసారి గుర్తు చేయవలసిన అవసరం లేదన్నారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి రావడంవల్ల ఏర్పడిన పరిస్థితులను మనం గమనించాలని చెప్పారు. ఆఫ్ఘన్ ప్రజల సంక్షేమం పట్ల మనం దృష్టి సారించాలన్నారు. మానవతావాద సాయం అందజేయడం, వాస్తవంగా అందరినీ కలుపుకునిపోయే ప్రభుత్వం ఏర్పాటవడం, ఉగ్రవాదంతో పోరాడటం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడం, మహిళలు, బాలల హక్కులను కాపాడటం వంటివి మన తక్షణ ప్రాథమ్యాలని తెలిపారు.

అంతకుముందు జైశంకర్ పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీని భారతీయ సంప్రదాయ పద్ధతిలో గౌరవించారు. కరచాలనం ఇవ్వడానికి బదులుగా నమస్కారం పెట్టారు.

ఇవి కూడా చదవండి :

Tipu Sultan : కేరళలో రాడికల్ జీహాదిజమ్‌ విత్తనాలు నాటినవాడు టిప్పు సుల్తాన్

Manipur Violence : మణిపూర్ హింసాకాండ వెనుక అసలు వాస్తవాలు

Updated Date - 2023-05-05T14:37:04+05:30 IST