Manipur Violence: రాష్ట్రపతిని కలుసుకోనున్న INDIA కూటమి

ABN , First Publish Date - 2023-08-01T19:06:42+05:30 IST

మణిపూర్‌లో పరిస్థితిని తెలుసుకునేందుకు ఇటీవల ఆ రాష్ట్రంలో పర్యటించిన విపక్ష నేతల కూటమి ఇండియా ప్రతినితి బృందంతో సహా 21 మంది ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బుధవారం ఉదయం 11.30 గంటలకు కలుసుకోనున్నారు. మణిపూర్‌లో పరిస్థితిని రాష్ట్రపతికి వివరించనున్నారు.

Manipur Violence: రాష్ట్రపతిని కలుసుకోనున్న INDIA కూటమి

న్యూఢిల్లీ: విపక్ష నేతల కూటమి ఇండియా (INDIA) ఫ్లోర్ లీడర్లు, మణిపూర్‌‍లో పర్యటించిన 21 మంది ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ను బుధవారం ఉదయం 11.30 గంటలకు కలుసుకోనున్నారు. ఈ ప్రతినిధి బృందానికి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సారథ్యం వహించనున్నారు. మణిపూర్‌లో పరిస్థితిని ఈ సందర్భంగా వారు రాష్ట్రపతికి వివరించనున్నారు. హర్యానాలో మత ఘర్షణలు చెలరేగడం, పార్లమెంటు పనితీరు వంటి అంశాలను కూడా ప్రతినిధి బృందం రాష్ట్రపతితో చర్చించే అవకాశం ఉంది.


సంచలనం సృష్టించిన వీడియో

మణిపూర్ హారర్‌పై సోషల్ మీడియాలో జూలై 19న వచ్చిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇద్దరు మహిళలను వివస్త్రగా ఊరేగించినట్టు కనిపిస్తున్న ఆ ఘటన మే 4న జరిగింది. మే 3న జాతుల ఘర్షణ తలెత్తిన మరుసటి రోజు ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై ఇటీవల సీబీఐ దర్యాప్తు చేపట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీ, ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పటి నుంచి 180 మంది ప్రాణాలు కోల్పోగా, వీరిలో 60 మంది మెయితీలు, 113 మంది కుకీలు, ముగ్గురు సీఏపీఎఫ్ సిబ్బంది, ఒక నేపాలీ, ఒక నాగా, ఒక గుర్తుతెలియని వ్యక్తి, 20 మంది మహిళలు (17 కుకీలు, ముగ్గురు మెయితీలు, ఒకరు నాగా) ఉన్నారు. 10,000కు పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యారు. మే 3న జరిగిన అల్లర్లలో 120 మంది ప్రాణాలు కోల్పోగా, 3000 మందికి పైగా గాయపడ్డారు. మణిపూర్‌లో తిరిగి యథాపూర్వ పరిస్థితి నెలకొనేందుకు మణిపూర్ పోలీసులు సహా 40,000 మంది కేంద్ర బలగాలను మోహరించారు.

Updated Date - 2023-08-01T19:06:42+05:30 IST