I.N.D.I.A. bloc: హాట్‌హాట్‌గా ముంబై మీట్..!

ABN , First Publish Date - 2023-08-28T17:17:38+05:30 IST

బీజేపీ ఓటమే లక్ష్యంగా 26 విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి ఈనెల 31, సెప్టెంబర్ 1న ముంబైలో సమావేశం అవుతుండటంతో అందరి దృష్టి దానిపై పడింది. మరికొన్ని విపక్ష పార్టీలు కూడా 'ఇండియా' కూటమిలో చేరబోతున్నాయంటూ అటు జేడీయూ, ఇటు కాంగ్రెస్ బహిరంగంగానే ప్రకటించడంతో ఏయే పార్టీలు ముంబై మీట్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయనే హాట్‌హాట్‌ చర్చ మొదలైంది.

I.N.D.I.A. bloc: హాట్‌హాట్‌గా ముంబై మీట్..!

న్యూఢిల్లీ: బీజేపీని లోక్‌సభ ఎన్నికల్లో ఓడించడమే ప్రధాన లక్ష్యంగా 26 విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా (I.N.D.I.A.) కూటమి ఈనెల 31, సెప్టెంబర్ 1న ముంబై (Mumbai)లో సమావేశం అవుతుండటంతో అందరి దృష్టి దానిపై పడింది. మరికొన్ని విపక్ష పార్టీలు కూడా 'ఇండియా' కూటమిలో చేరబోతున్నాయంటూ అటు జేడీయూ, ఇటు కాంగ్రెస్ బహిరంగంగానే ప్రకటించడంతో ఏయే పార్టీలు ముంబై మీట్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి, ఎవరెవరితో కూటమి నేతలు సంప్రదింపులు సాగిస్తున్నారనే హాట్‌హాట్‌ చర్చ మొదలైంది. పంజాబ్‌లోని శిరోమణి అకాలీ దళ్ (SAD) సహా మొత్తం 8 ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమితో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయా పార్టీల సమాచారం.


ఇండియా కూటమిలో చేరేందుకు నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూతో శిరోమణి అకాలీ‌దళ్ (సాద్) సంప్రదింపులు సాగిస్తోందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం పలు రాజకీయ పార్టీలతో చర్చలు సాగిస్తోందని తెలుస్తోంది. కొత్త భాగస్వాములను చేర్చుకోవడంపై రాహుల్‌గాంధీతో ప్రాథమిక చర్చలు జరిగినట్టు సమాచారం.


ముంబై ఎజెండా..

ఇండియా బ్లాక్ ముంబై సమావేశంలో పలు అంశాలపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నట్టు చెబుతున్నారు. చిహ్నం (లోగో), సీట్ల పంపకం సహా పలు వ్యూహాత్మక, కీలక అంశాల మీద అవగాహనకు రానున్నారు. కూటమికి సమన్వయ కమిటీ నియామకం, కన్వీనర్‌ ఎన్నిక కూడా జరిగే వీలుంది. ఆయా పార్టీలకు చెందిన అగ్రనేతలు సంయుక్తంగా ర్యాలీలు నిర్వహించడంపై కూడా సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. 11 మంది సభ్యులతో కమిటీగా ఏర్పడి, గాంధీ జయంతి (అక్టోబర్ 2) తర్వాత దేశవ్యాప్తంగా సంయుక్త విపక్ష పార్టీల ర్యాలీలను గణనీయంగా నిర్వహించనున్నారు.


కన్వీనర్ ఎవరు?

ముంబై సమావేశంలో 'ఇండియా' కూటమి కన్వీనర్‌గా ఎవరిని ఎంపిక చేసే అవకాశం ఉందనే అంశంపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కన్వీనర్ బాధ్యత జేడీయూ చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అప్పగించే అవకాశాలున్నాయని బలంగా వినిపిస్తుండగా, తాను ఏ పదవి కోరుకోవడం లేదని నితీష్ సోమవారం ప్రకటించారు. వేరే నేతకు ఆ బాధ్యత అప్పగించాలని కూడా సూచించారు. దీంతో కూటమి కన్వీనర్‌గా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేరు కొత్తగా తెరపైకి వచ్చింది.

Updated Date - 2023-08-28T17:17:38+05:30 IST