Minister Senthilbalaji: మంత్రి సెంథిల్‌బాలాజీకి చుక్కెదురు.. ఈడీ అరెస్టు సక్రమమేనంటూ సుప్రీంకోర్టు స్పష్టీకరణ

ABN , First Publish Date - 2023-08-08T08:44:48+05:30 IST

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల విచారణ వలయంలో ఉంటూ ప్రస్తుతం పుళల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్న రాష్ట్రమంత్రి సెంథిల్‌బాలాజీ

Minister Senthilbalaji: మంత్రి సెంథిల్‌బాలాజీకి చుక్కెదురు.. ఈడీ అరెస్టు సక్రమమేనంటూ సుప్రీంకోర్టు స్పష్టీకరణ

- అప్పీలు పిటిషన్‌ తోసివేత

- 5 రోజుల కస్టడీకి అనుమతి

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల విచారణ వలయంలో ఉంటూ ప్రస్తుతం పుళల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్న రాష్ట్రమంత్రి సెంథిల్‌బాలాజీ(Senthilbalaji)కి సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు సెంథిల్‌బాలాజీని అరెస్టు చేయడం చట్ట వ్యతిరేకమని ఆరోపిస్తూ ఆయన సతీమణి మేఘల దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడాన్ని సవాలూ చేస్తూ సుప్రీంకోర్టు(Supreme Court)లో అప్పీలు పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... సెంథిల్‌బాలాజి అరెస్టు సక్రమమేనని స్పష్టం చేసింది. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రవాణాశాఖ మంత్రిగా వ్యవహరించిన సెంథిల్‌ బాలాజి ఉద్యోగాలు తీసిస్తానంటూ పలువురి వద్ద లక్షలాదిరూపాయలను తీసుకుని మోసగించారనే ఆరోపణలపై నమోదైన కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారులు సెంథిల్‌బాలాజి వద్ద విచారణ జరిపారు. జూన్‌ 14 వేకువజామున సెంథిల్‌బాలాజీని అరెస్టు చేసిన సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఈడీ అధికారులు ఆయన్ని ఓమండూరార్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆళ్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రికి తరలించి అక్కడే బైపాస్‌ సర్జరీ చేశారు. ప్రస్తుతం సెంథిల్‌బాలాజి పుళల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు.

nani5.jpg

ఈ పరిస్థితుల్లో సెంథిల్‌బాలాజి భార్య మేఘల అప్పీలు పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నా, జస్టిస్‌ ఎం.సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉదయం తీర్పు వెలువరించింది. ఈడీ అధికారులు సెంథిల్‌బాలాజీని అరెస్టు చేయడం సక్రమమేనని, ఈ వ్యవహారంలో హైకోర్టు జారీ చేసిన తీర్పుపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. అదేవిధంగా అరెస్టు తర్వాత హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి వీలులేదని తేల్చి చెప్పింది. అంతేగాకుండా పుళల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్న సెంథిల్‌బాలాజీని ఐదు రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపేందుకు కూడా అనుమతి ఇచ్చింది. సోమవారం నుండి ఈ నెల 12 వరకూ సెంథిల్‌బాలాజీని ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరపవచ్చని పేర్కొంది. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు తీర్పు తమకు సానుకూలంగా వెలువడటంతో ఈడీ అధికారులు పుళల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్న మంత్రి సెంథిల్‌బాలాజీని కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారు. కాగా మంత్రిని సోమవారం రాత్రి ఈడీ అధికారులు తమ కార్యాలయానికి తీసుకెళ్లారు.

Updated Date - 2023-08-08T08:44:48+05:30 IST