No-confidence motion : మోదీకి భారీ షాక్.. అవిశ్వాస తీర్మానానికి ఎన్డీయే భాగస్వామ్య పార్టీ మద్దతు..

ABN , First Publish Date - 2023-08-10T12:22:16+05:30 IST

జాతీయ ప్రజాస్వామిక కూటమి (NDA)లో లుకలుకలు బయటపడ్డాయి. ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని ఎన్డీయే భాగస్వామ్య పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపాదించిన తీర్మానంపై మంగళవారం నుంచి చర్చ జరుగుతోంది.

No-confidence motion : మోదీకి భారీ షాక్.. అవిశ్వాస తీర్మానానికి ఎన్డీయే భాగస్వామ్య పార్టీ మద్దతు..
Narendra Modi

న్యూఢిల్లీ : జాతీయ ప్రజాస్వామిక కూటమి (NDA)లో లుకలుకలు బయటపడ్డాయి. ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని ఎన్డీయే భాగస్వామ్య పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రతిపాదించిన ఈ అవిశ్వాస తీర్మానంపై మంగళవారం నుంచి చర్చ జరుగుతోంది. గురువారం మధ్యాహ్నం మోదీ ఈ చర్చకు సమాధానం చెబుతారు.

ఎంఎన్ఎఫ్ ఎంపీ సీ లాల్రోసంగ గురువారం మీడియాతో మాట్లాడుతూ, తాను అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తానని చెప్పారు. మణిపూర్‌లో హింసాకాండను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. దీనినిబట్టి తాను కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నానని కానీ, బీజేపీని వ్యతిరేకిస్తున్నానని కానీ భావించరాదన్నారు. ప్రభుత్వాలు, మరీ ముఖ్యంగా మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలమైందన్నారు.

మణిపూర్‌లోని జో ప్రజల పరిస్థితి తమను తీవ్రంగా కలవరపరుస్తోందన్నారు. ఈ సమస్యపై తాను తమ పార్టీ అధ్యక్షుడు, మిజోరాం ముఖ్యమంత్రి జొరాంతంగతో మాట్లాడానని చెప్పారు. తమ పార్టీ నేతలంతా అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వడంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారన్నారు.


బీజేపీ నేతృత్వంలోని నార్త్ ఈస్ట్ డెమొక్రాటిక్ అలయెన్స్ (NEDA)లోనూ, కేంద్రంలోని ఎన్డీయేలోనూ ఎంఎన్ఎఫ్ భాగస్వామి. ఎంఎన్ఎఫ్ రాజ్యసభ సభ్యుడు కే వన్లల్వేనా మాట్లాడుతూ, మణిపూర్ పరిస్థితిని చక్కదిద్దడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని పార్లమెంటులో ఎండగట్టడాన్ని కొనసాగిస్తానని తెలిపారు.

ఈ తీర్మానం గెలవాలంటే కనీసం 272 మంది ఎంపీల మద్దతు అవసరం. కానీ దాదాపు 331 మంది ఎంపీలు ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశం ఉంది. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించిన ఇండియా కూటమికి 144 మంది ఎంపీల బలం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ కూడా మద్దతిస్తే ఈ సంఖ్య 152కు చేరుతుంది.

తీర్మానం వీగిపోవడం ఖాయమని తెలిసినప్పటికీ ఇండియా కూటమి ఈ చర్యకు ముందడుగు వేసింది. మణిపూర్ సమస్యపై మోదీ మాట్లాడేలా చేయడం ద్వారా ‘పైకి కనిపించే యుద్ధం’లో గెలవడం కోసం ఇది దోహదపడుతుందని సమర్థించుకుంటోంది.

మోదీ 2018లో తొలిసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు.


ఇవి కూడా చదవండి :

Chennai: 12 నుంచి చెన్నైలో చాగంటి ప్రవచనాలు

No-confidence motion : అవిశ్వాస తీర్మానంపై చర్చకు మోదీ సమాధానం మరి కాసేపట్లో

Updated Date - 2023-08-10T12:22:16+05:30 IST