I.N.D.I.A : ప్రతిపక్ష ఇండియా కూటమికి కొత్త పేరు పెట్టిన మోదీ

ABN , First Publish Date - 2023-08-04T13:25:31+05:30 IST

రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A)కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కొత్త పేరు పెట్టారు. ఇకపై ఈ పేరుతోనే పిలవాలని ఎన్డీయే భాగస్వాములను కోరారు. ఎన్డీయే ఎంపీలను బృందాలవారీగా కలుస్తున్న ఆయన గురువారం బిహార్ ఎంపీలతో సమావేశమయ్యారు.

I.N.D.I.A : ప్రతిపక్ష ఇండియా కూటమికి కొత్త పేరు పెట్టిన మోదీ
Narendra Modi

న్యూఢిల్లీ : రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A)కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కొత్త పేరు పెట్టారు. ఇకపై ఈ పేరుతోనే పిలవాలని ఎన్డీయే భాగస్వాములను కోరారు. ఎన్డీయే ఎంపీలను బృందాలవారీగా కలుస్తున్న ఆయన గురువారం బిహార్ ఎంపీలతో సమావేశమయ్యారు. యూపీఏ హయాంలో అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారని, అందుకే కొత్త పేరు పెట్టుకున్నారని మోదీ ఇటీవల మండిపడుతున్న సంగతి తెలిసిందే.

మోదీ గురువారం బిహార్ ఎన్డీయే ఎంపీలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్ష ఇండియా కూటమిని ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహాన్ని వెల్లడించారు. ఈ కూటమిని ఇకపై ‘ఘమండియా’ (దురహంకారుల కూటమి) అని పిలవాలన్నారు. యూపీయే హయాంలో అనేక అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారని, ఇప్పుడు ఆ కళంకాన్ని తొలగించుకోవడం కోసమే ఇండియా అని పేరు పెట్టుకున్నారని దుయ్యబట్టారు.


ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, యూపీయే హయాంలో పేదలకు వ్యతిరేకంగా కుంభకోణాలకు పాల్పడ్డారని, ఆ కళంకం నుంచి తప్పించుకోవడానికే ఇండియా అని పేరు పెట్టారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నది తమ దేశ భక్తిని చాటుకోవడం కోసం కాదని, కేవలం దేశాన్ని దోచుకోవడం కోసమేనని చెప్పారు.

రానున్న లోక్ సభ ఎన్నికల్లో మోదీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, జేడీయూ, ఆప్, డీఎంకే, ఆర్జేడీ, టీఎంసీ సహా ప్రతిపక్ష పార్టీలు పాట్నా, బెంగళూరులలో సమావేశాలు నిర్వహించాయి. తదుపరి సమావేశం ముంబైలో త్వరలో జరుగుతుంది. బెంగళూరులో గత నెలలో జరిగిన సమావేశంలో 26 రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. తమ కూటమికి ఇండియా (I.N.D.I.A) అని నామకరణం చేశారు. భారత దేశ భావన కోసం తాము పోరాడతామని, ఆ విషయాన్ని తెలియజేయడానికి తమ కూటమికి ఈ పేరు పెట్టామని చెప్పారు. భారత దేశ భావనపై దాడి జరుగుతోందని ఆరోపించారు.


ఇవి కూడా చదవండి :

Gyanvapi : జ్ఞానవాపిలో ఏఎస్ఐ సర్వే ప్రారంభం.. బహిష్కరించిన ముస్లిం పక్షం..

Kedarnath yatra : కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియ.. శిథిలాల్లో 10 మంది చిక్కుకున్నట్లు ఆందోళన..

Updated Date - 2023-08-04T13:25:31+05:30 IST