Tungabhadra: రోజురోజుకూ తగ్గుతున్న ‘తుంగభద్ర’

ABN , First Publish Date - 2023-10-06T14:16:25+05:30 IST

రోజ రోజుకు తుంగభద్ర(Tungabhadra) జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతుండంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళనలు మొదలయ్యాయి.

Tungabhadra: రోజురోజుకూ తగ్గుతున్న ‘తుంగభద్ర’

- ఆయకట్టు రైతుల్లో పెరుగుతున్న ఆందోళన

- జాగ్రత్త పడుతున్న బోర్డు అధికారులు

బళ్లారి(బెంగళూరు): రోజ రోజుకు తుంగభద్ర(Tungabhadra) జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతుండంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. రెండేళ్లుగా సాగునీటికి ఎలాంటి ఢోకా లేకుండా ఖరీఫ్‌, రబీ సీజన్‌లో పంటలు సాగుచేసిన రైతులకు ఈ ఏడాది కష్టాలు తప్పేలా లేవు. తుంగభద్ర జలాశయం పైభాగంలో ఆశించిన రీతిలో వర్షాలు కురవక పోవడంతో జలాశయం పూర్తిస్థాయిలో నిండలేదు. ప్రతి ఏటా జలాశయం జూలై ఆఖరికి పూర్తిస్థాయిలో నిండడంతో దిగువకు వరద నీటిని వదిలే వారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. జలాశయంలో సేకరణ జరిగిన నీటినే ఆచితూచి ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా నిర్మాణమైన తుంగభద్ర జలాశయం రైతుల జీవనాడిగా నిలిచింది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో కావేరి నీటిని తమిళనాడుకు విడుదలలో తలెత్తుతున్న సమస్యలు కర్ణాటక ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. భవిష్యత్‌లో తుంగభద్ర పరిస్థితి ఇలాగా కొనసాగితే.. కావేరి సమస్య తుంగభద్రకు ఎక్కడ తలెత్తుతుందోనని టీబీ బోర్డు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అభిప్రాయం స్థానిక రైతు సంఘాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బృహత్‌ సాగునీటి ప్రాజెక్టులలో ఒకటైన తుంగభద్ర జలాశయం హెచ్చెల్సీ, ఎల్లెల్సీ కుడి, ఎడమ కాలువలు ఎక్కువ భాగం కర్ణాటక రాష్ట్రంలో ఉండడంతో పొరుగు రాష్ట్రాల వాటా నీటి కంటే ఈ ప్రాంత రైతులే అధికంగా ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుంగభద్ర ఆయుకట్టులో అక్రమ సాగు కారణంగా ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల ఆయకట్టు రైతులకు ఆశించిన మేర జలాలు చేరడం లేదనే ఆరోపణలు ఆయా రాష్ట్రాల రైతుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే బోర్డు అధికారులు మాత్రం ఆరోపణలకు తావులేకుండా ఆంధ్రావాటా కింద రైతుల ఇండెంట్‌ ప్రకారం సాగునీటిని అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జలాశయం 1617.1 అడుగులకు పడిపోగా, జలాశయంలో 53.726 టీఎంసీలు మాత్రమే నిరు నిలువ ఉండగా, జలాశయానికి 3702 క్యూసెక్కుల నీరు చేరుతోంది. వివిధ కాలువలకు 9,737 క్యూసెక్కులు నీరు సాగునీరు సరఫరా అవుతోంది. గత ఏడాది ఇదే సమయానికి 1633 అడుగుల మేరతో 83.879 టీఎంసీల నీరు నిలువ ఉండగా, 14,034 క్యూసెక్కుల ఇన్‌ప్లో నమోదైనట్లు బోర్డు అధికారులు తెలిపారు. గత ఏడాదికంటే 33 టీఎంసీల నీరు తక్కువగా ఉన్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-10-06T14:21:36+05:30 IST