AP MLC Elections : మరికొన్ని గంటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. అదే జరిగితే వైసీపీ పతనానికి కౌంట్‌డౌన్‌ స్టార్టయినట్లే..!

ABN , First Publish Date - 2023-03-22T18:27:18+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) విద్యావంతులు అనూహ్య రీతిలో వైసీపీని (YSR Congress) ఛీత్కరించిన విషయం తెలిసిందే...

AP MLC Elections : మరికొన్ని గంటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. అదే జరిగితే వైసీపీ పతనానికి కౌంట్‌డౌన్‌ స్టార్టయినట్లే..!

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) విద్యావంతులు అనూహ్య రీతిలో వైసీపీని (YSR Congress) ఛీత్కరించిన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ ప్రాంతాల్లో ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులు (TDP Candidates) భారీ మెజారిటీతో గెలుపొందారు. దొంగ ఓట్లు, ప్రలోభాలు, నగదు పంపిణీ, రిగ్గింగ్‌తో గెలవాలని చూసినా అధికార పక్షం చావుదెబ్బ తింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో (MLA Quota MLC Seat) కూడా ఓడితే.. వైసీపీ పతనానికి కౌంట్‌డౌన్‌ స్టార్టయినట్లే! అందుకే ఎలాగైనా మొత్తం ఏడు స్థానాలను గెలుచుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. సొంత ఎమ్మెల్యేలను సైతం ‘విప్‌’ బూచి చూపి బెదిరిస్తోంది. అధికారిక అభ్యర్థికి ఓటేయకపోతే శాసనసభ్యత్వం రద్దవుతుందని భయపెడుతోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల్లో ఎవరి బలమెంత..? ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వైసీపీ వేసిన వ్యూహాలేంటి..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం..

రంగంలోకి దిగిన జగన్..!

మరికొద్ది గంటల్లోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ (MLC Election Polling) ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఈ పోలింగ్ ప్రక్రియ జరగనుంది. కాగా.. ఏడు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్దిని రంగంలోకి దించింది. టీడీపీ రంగంలోకి దిగడంతో అధికార వైసీపీ అప్రమత్తమైంది. కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలపై వైసీపీ పెద్దలు నిఘా విధించారని సమాచారం. మరోవైపు.. అనుమానం ఉన్న ఎమ్మెల్యేలపై వైసిపి హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. అంతేకాదు.. కొంతమంది ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మోహన్ రెడ్డే (YS Jagan Mohan Reddy) నేరుగా మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అనుమానం ఉన్న ఎమ్మెల్యేలు, వారి బంధువులతోనూ వైసీపీ హైకమాండ్ మాట్లాడుతోంది. ఓటు వేయించే బాధ్యతను సీనియర్ నేతలకు సీఎం జగన్ అప్పగించారు. ఏడుగురు సీనియర్ నేతలకు ఒక్కొక్కరికి 22 మంది ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకునే బాధ్యత వైసీపీ అధిష్ఠానం కట్టబెట్టింది. సీనియర్ ఎమ్మెల్యేలకు తోడు కొంతమంది మంత్రులను వైసీపీ కేటాయించింది. బుధవారం (మార్చి-22న) రాత్రి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులు డిన్నర్ ఇస్తున్నారు.

YS-Jagan.jpg

ఎవరి బలమెంత..!?

మరోవైపు.. టీడీపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. అయితే.. టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక వైసీపీకి మాత్రం 154 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అధికార పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. వైసీపీ తరపున ఏడుగురు, టీడీపీ తరపున ఒకరు ఎమ్మెల్సీ అభ్యర్దులు పోటీకి దిగారు. ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేలతో ఇరుపక్షాలు మాక్ పోలింగ్ నిర్వహించాయి. వైసీపీ మాక్ పోలింగ్‌లో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు ఓట్లు సరిగ్గా వేయలేకపోవడం గమనార్హం. పదే పదే ఇలా ఓటు వేయాలని చెప్పినప్పటికీ వారికి అర్థం కాలేదట. వాళ్లకు మళ్లీ సక్రమంగా ఓటు వేయడంలో సీనియర్ నేతలు శిక్షణ ఇస్తున్నారు. మొత్తానికి చూస్తే.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠబరితంగా మారాయి.

YSR-Congress.jpg

అదే జరిగితే..!

వాస్తవానికి.. టీడీపీ బరిలోకి దిగదని వైసీపీ అధిష్ఠానం భావించింది. అయితే అనూహ్యంగా ఒక సీటులో అభ్యర్థిని నిలపడంతో ఓటింగ్‌ అనివార్యమైంది. టీడీపీకి, అధికార పక్ష ఏడో అభ్యర్థికి అవసరమైనంత మెజారిటీ లేదు. తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీలో 23 మంది సభ్యులున్నా.. వారిలో నలుగురు వైసీపీకి మద్దతిస్తున్నారు. అటు పాలకపక్షానికి చెందిన నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీకి ఓటేసే అవకాశం ఉందని అంటున్నారు. అదే జిల్లాకు చెందిన ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూడా అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. కనీసం ఆరు జిల్లాల్లో ఒక్కొక్క వైసీపీ ఎమ్మెల్యే ఊగిసలాడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఏడో అభ్యర్థి ఓడితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమాద ఘంటికలు మోగినట్లేనని సీఎం జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అటు టీడీపీ సైతం తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలియడంతో అడుగడుగునా వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం నిఘా పెట్టింది. చివరిగా ‘విప్‌’ అస్త్రాన్ని ప్రయోగించింది. పార్టీ నిర్దేశించిన వారికి ప్రాధాన్య క్రమంలో ఓటేయాలంటూ ఎమ్మెల్యేలందరికీ ‘విప్‌’ జారీ చేసింది. టీడీపీ కూడా పేరు పేరునా ప్రతి శాసనసభ్యుడికీ విప్‌ జారీ చేస్తూ లేఖలు అందజేసింది.

TDP.jpg

ఓటింగ్ ఎలా జరుగుతుంది..!?

ఈ ఓటింగ్‌ సాధారణ ఎన్నికల తరహాలోనే రహస్య విధానంలో జరుగుతుంది. ఎమ్మెల్యేలు తమకు నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛగా ఓటు వేసుకోవచ్చు. ఎవరు ఎవరికి వేశారో తెలిసే అవకాశమే ఉండదు. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో చెబుతారే తప్ప.. ఎవరు ఎవరికి ఓటు వేశారో రిటర్నింగ్‌ అధికారులు వెల్లడించరు. అత్యుత్సాహంతో ఎవరైనా సభ్యుడు తానెవరికి వేశానో బ్యాలెట్‌ చూపిస్తే ఆ ఓటు చెల్లకుండా పోతుంది. ఇంత రహస్య విధానంలో ఓటింగ్‌ జరిగే ప్రక్రియకు పార్టీలు జారీ చేసే ‘విప్‌’ ఏమాత్రమూ వర్తించదు. అందువల్ల ఉద్దేశపూర్వకంగా విప్‌ను ధిక్కరించినా.. చర్యలు తీసుకునేందుకు, శాసనసభ్యత్వాన్ని రద్దు చేసేందుకు ఎవరికీ అధికారం లేదు. ఒకవేళ స్పీకర్‌ చర్యలు తీసుకున్నా.. న్యాయ సమీక్షకు నిలబడదని నిపుణులు తేల్చిచెబుతున్నారు.

మొత్తానికి చూస్తే.. ఇప్పటికే పట్టభద్ర స్థానాల్లో ఓటమితో ప్రభుత్వంపై వ్యతిరేకత మరీ ఇంత తీవ్రంగా ఉందని ఊహించలేదని సీఎం జగన్, మంత్రులు మధనపడుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో గనుక ఓడిపోతే అసెంబ్లీ ఎన్నికలపై దాని ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంటుందన్న భయంతోనే.. ఎమ్మెల్యేలను భయపెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఫైనల్‌గా ఏం జరుగుతుందో వేచి చూడాలి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

YSRCP : వైసీపీలో ఇంత చిల్లర బ్యాచ్ ఉందేంట్రా బాబోయ్.. ఛీ.. ఛీ.. సిగ్గో సిగ్గు..!


******************************

AP MLC Election Results 2023 : వైఎస్ జగన్‌ను ఏకిపారేస్తున్న వైసీపీ సోషల్ మీడియా.. ఏమైందా అని ఆరాతీస్తే..!

******************************

BRS MLC Kavitha : ఢిల్లీ నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు కవిత.. సీఎం కేసీఆర్‌తో కీలక భేటీ.. ఏమేం చర్చిస్తున్నారంటే..!

******************************

MLC Kavitha ED Enquiry : కవిత మీడియాకు చూపించిన మొబైల్ ఫోన్లను కాస్త జూమ్ చేస్తే...!!


******************************

MLC Kavitha ED Enquiry : విచారణలో రివర్స్ అటాక్.. కవిత ప్రశ్నలకు ఈడీ అధికారులు నీళ్లు నమిలారా.. కొసమెరుపు ఏమిటంటే..!

******************************

Updated Date - 2023-03-22T18:34:57+05:30 IST