Asia Cup 2023: వరుణుడు మళ్లీ వచ్చేశాడు.. ఆగిపోయిన భారత్-శ్రీలంక మ్యాచ్

ABN , First Publish Date - 2023-09-12T18:36:50+05:30 IST

ఆసియా కప్‌లో టీమిండియా మ్యాచ్‌కు మరోసారి వర్షం అడ్డుగా నిలిచింది. సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది.

Asia Cup 2023: వరుణుడు మళ్లీ వచ్చేశాడు.. ఆగిపోయిన భారత్-శ్రీలంక మ్యాచ్

ఆసియా కప్‌లో సూపర్-4లో భాగంగా భారత్-శ్రీలంక జరుగుతున్న మ్యాచ్‌కు కూడా వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో ఆట ముగిసే సమయానికి 47 ఓవర్లలో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆరంభంలోనే వేగంగా ఆడిన బ్యాటర్లు ఆ తర్వాత శ్రీలంక స్పిన్నర్లకు దాసోహం అన్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడే ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్ కావడం గమనించాల్సిన విషయం. ఇషాన్ కిషన్ (33), కేఎల్ రాహుల్ (39) తప్ప మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

ఇది కూడా చదవండి: IND vs SL: పాకిస్థాన్ లెజెండ్ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. కోహ్లీతో కలిసి సరికొత్త రికార్డు!

తొలి 10 ఓవర్లలో 65 పరుగులు చేసిన టీమిండియా ఆ తర్వాత తడబడింది. తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించిన తర్వాత వికెట్ల పతనం ప్రారంభమైంది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగే 5 వికెట్లతో సత్తా చాటాడు. తొలి ఆరు వికెట్లలో ఐదు వికెట్లను అతడే పడగొట్టాడు. గిల్, కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య వికెట్లను వెల్లలాగే సాధించాడు. అనంతరం మిగతా బ్యాటర్లను చరిత్ అసలంక చుట్టేశాడు. అతడు 4 వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో కేవలం 3 పరుగులకే అవుటయ్యాడు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య (5), రవీంద్ర జడేజా (4) విఫలమయ్యారు. కాగా సూపర్-4లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఆదివారం వర్షం ఆటంకం కలిగించడంతో రిజర్వు డే సోమవారం కొనసాగించారు. దీంతో వరుసగా మూడు రోజులు టీమిండియా బ్యాటర్లు మైదానంలో గడపాల్సి వచ్చింది.

Updated Date - 2023-09-12T18:36:50+05:30 IST