IND Vs PAK: వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే.. టీమిండియా పరిస్థితేంటి?

ABN , First Publish Date - 2023-09-02T12:40:55+05:30 IST

శ్రీలంకలోని క్యాండీలో ఈరోజు ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మ్యాచ్ జరిగే సమయంలోనూ 90 శాతం వర్షం పడొచ్చని వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో అంపైర్లు హై ఓల్టేజ్ మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశాలను కొట్టిపారేయలేం.

IND Vs PAK: వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే.. టీమిండియా పరిస్థితేంటి?

శ్రీలంకలోని క్యాండీ వేదికగా ఈరోజు జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా ఈరోజు ఉదయం నుంచి క్యాండీలో భారీ వర్షం కురుస్తున్నట్లు తెలుస్తోంది. మరి మ్యాచ్ సమయానికి వర్షం పడినా.. లేక వర్షం కారణంగా ఆడే పరిస్థితులు లేకపోయినా అంపైర్లు హై ఓల్టేజ్ మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. మరి అదే జరిగితే సూపర్-4 దశకు టీమిండియా అర్హత సాధిస్తుందా.. లేదా అన్న పాయింట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: Cricket News: ప్రపంచకప్ జట్టులో ట్రాన్స్‌జెండర్.. చరిత్రలో ఇదే తొలిసారి

ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేసిన నేపథ్యంలో అంపైర్లు భారత్, పాకిస్థాన్ జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. ఇప్పటికే నేపాల్‌ను చిత్తుగా ఓడించిన పాకిస్తాన్.. టీమిండియాతో మ్యాచ్ రద్దయినా కూడా సూపర్-4 దశకు చేరుతుంది. భారత్ మాత్రం సూపర్-4 బెర్తు కోసం నేపాల్‌తో తలపడాల్సి ఉంటుంది. నేపాల్‌తో మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా గెలిచితీరాలి. అటు కొంచెం సేపు మ్యాచ్ జరిగిన తర్వాత వర్షం ఆటంకం కలిగిస్తే అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ విధానాన్ని ఉపయోగించనున్నారు. డక్‌వర్త్ లూయిస్ విధానంలో మ్యాచ్ ఫలితం తేలాలన్నా కూడా.. రెండు జట్లు కనీసం 20 ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం ఉండాలి. లేదంటే ఈ మ్యాచ్ ఫలితాన్ని పరిగణనలోకి తీసుకోవడం కుదరదు. అదే తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు పూర్తి ఓవర్లు ఆడి, ఛేజింగ్ మధ్యలో వర్షం పడితే.. ఛేజింగ్‌లో వేయాల్సిన ఓవర్ల పర్సంటేజీతో తొలి ఇన్నింగ్స్ స్కోరును గుణిస్తారు. దీన్ని బట్టి విజేతను నిర్ణయిస్తారు.

Updated Date - 2023-09-02T12:43:10+05:30 IST