Asian Games 2023: సెంచరీతో శుభ్‌మన్ గిల్ రికార్డును బద్దలు కొట్టిన యశస్వి జైస్వాల్

ABN , First Publish Date - 2023-10-03T09:44:30+05:30 IST

ఏషియన్ గేమ్స్ 2023 క్వార్టర్ ఫైనల్ 1లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. 8 ఫోర్లు, 7 సిక్సులతో 49 బంతుల్లోనే 100 పరుగులు బాదేశాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు.

Asian Games 2023: సెంచరీతో శుభ్‌మన్ గిల్ రికార్డును బద్దలు కొట్టిన యశస్వి జైస్వాల్

చైనా: ఏషియన్ గేమ్స్ 2023 క్వార్టర్ ఫైనల్ 1లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. 8 ఫోర్లు, 7 సిక్సులతో 49 బంతుల్లోనే 100 పరుగులు బాదేశాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అతి చిన్న వయసులోనే సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా చరిత్ర సృ‌ష్టించాడు. ఈ క్రమంలో 23 ఏళ్ల 146 రోజుల వయసులో సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్ రికార్డును అధిగమించాడు. కాగా ప్రస్తుతం జైస్వాల్ వయసు 21 ఏళ్ల 9 నెలల 13 రోజులు మాత్రమే కావడం గమనార్హం. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన 8వ భారత ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ కంటే ముందు సురేష్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గల్ సెంచరీలు సాధించారు. అలాగే ఈ మ్యాచ్‌లో చేసిన సెంచరీ ద్వారా ఆసియా క్రీడల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా కూడా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. పురుషుల, మహిళల క్రీడల్లో కలిపి కూడా భారత్ తరఫున మొదటి సెంచరీ నమోదు చేసింది జైస్వాలే కావడం గమనార్హం.


ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు మొదటి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. యశస్వి జైస్వాల్ అయితే ఆరంభం నుంచే భారీ షాట్లతో రెచ్చిపోయాడు. వరుసగా ఫోర్లు, సిక్సులు బాదుతూ నేపాల్ బౌలర్లను అల్లాడించాడు. దీంతో టీమిండియా స్కోర్ బోర్డు ఎక్స్‌ప్రెస్ వేగంతో పరుగులు పెట్టింది. ఈ క్రమంలో జైస్వాల్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్ ధాటిగా ఆడుతుంటే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అతనికి సహకరించాడు. దీంతో టీమిండియా స్కోర్ బోర్డు 10 రన్ రేటుకు తగ్గకుండా దూసుకుపోయింది. ఈ క్రమంలో పవర్ ప్లేలోనే 63 పరుగులు వచ్చాయి. వీరి భాగస్వామ్యం 9.1 ఓవర్లలోనే 100కు చేరుకుంది. అయితే 10వ ఓవర్లో ఈ భాగస్వామ్యాన్ని దీపేంద్ర సింగ్ విడదీశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన రుతురాజ్ గైక్వాడ్(25) రోహిత్ పౌడేల్‌కు దొరికిపోయాడు. దీంతో 104 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత తిలక్ వర్మ(2), జితేష్ శర్మ(5) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు.

అయితే తన దూకుడును కొనసాగించిన యశస్వి జైస్వాల్ 8 ఫోర్లు, 7 సిక్సులతో 48 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే సెంచరీ చేసిన వెంటనే దీపేంద్ర సింగ్ వేసిన 17వ ఓవర్లో ఔటయ్యాడు. జైస్వాల్ ఔట్ అనంతరం టీమిండియా స్కోర్ బోర్డులో వేగం తగ్గింది. దీంతో 200 పరుగుల మార్కు చేరుకోవడం కష్టమే అనిపించింది. కానీ అభినాష్ బోహరా వేసిన చివరి ఓవర్లో రింకూ సింగ్ రెచ్చిపోయాడు. 2 సిక్సులు, 2 ఫోర్లతో 25 పరుగులు రాబట్టాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. చివరి 2 ఓవర్లలోనే టీమిండియాకు 39 పరుగులొచ్చాయి. 2 ఫోర్లు, 4 సిక్సులతో 15 బంతుల్లోనే 37 పరుగులు చేసిన రింకూ సింగ్, 2 ఫోర్లు, ఒక సిక్సుతో 19 బంతుల్లోనే 25 పరుగులు చేసిన శివమ్ దూబే నాటౌట్‌గా నిలిచారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అజేయంగా 22 బంతుల్లోనే 52 పరుగులు జోడించారు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్ 2, సోంపాల్ కమీ, లామిచ్ఛనే తలో వికెట్ తీశారు.

Updated Date - 2023-10-03T09:44:30+05:30 IST