Share News

Telangana Elections: కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డికి టీడీపీ పూర్తి మద్దతు

ABN , First Publish Date - 2023-11-21T16:24:07+05:30 IST

Telangana Elections: ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయా రెడ్డికి టీడీపీ పూర్తి సంఘీభావం తెలిపింది.

Telangana Elections: కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డికి టీడీపీ పూర్తి మద్దతు

హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయా రెడ్డికి (Congress Candidate Vijayareddy) టీడీపీ (TDP) పూర్తి సంఘీభావం తెలిపింది. మంగళవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ నేతలతో కలసి విజయారెడ్డి స్వర్గీయ ఎన్టీరామారావుకు నివాళులు అర్పించారు. నియోజకవర్గం టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు, గత మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ తరపున కార్పొరేటర్లుగా పోటీ చేసిన నాయకులు బాలాజీ గోస్వామి, పి.వంశీకృష్ణ, నల్లెల కిషోర్, ప్రవీణ్, నరసింహ, శ్రీనివాస్ నాయీ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా కాంగ్రెస్‌కు, దివంగత మాజీ సీఎల్పీ నేత పి.జనార్ధన్‌రెడ్డి కుమార్తె విజయారెడ్డి గెలుపుకు కృషి చేస్తామని ప్రకటించారు. విజయా రెడ్డిని ఎన్నికల్లో గెలిపిస్తామని అనంతరం ఎన్టీఆర్, పీజేఆర్లలా ఆమె మంచి పేరు తెచ్చుకోవాలని బాలాజీ గోస్వామి కోరారు.


విజయారెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ వర్గాల మద్దతు తమకెంతో కీలకమని, ఎన్టీఆర్, పీజేఆర్‌లు ప్రజల కోసం శ్రమించారని, వారి అడుగుజాడల్లో నడుస్తున్న తనకు టీడీపీ శ్రేణుల మద్దతు ఎంతో ఉపకరిస్తుందన్నారు. అందరిని కలుపుకుపోతూ టీడీపీ నాయకుల సూచనల మేరకు ప్రజల్లోకి వెళ్తామని, ఖైరతాబాద్ నియోజకవర్గ అభివృద్ధే తమ ధ్యేయంగా పని చేస్తామని విజయారెడ్డి తెలిపారు.

Updated Date - 2023-11-21T16:24:09+05:30 IST