BRS: ఆ ఛానల్, పత్రికలపై భారత రాష్ట్ర సమితి కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-03-14T19:15:37+05:30 IST

ఓ ఛానల్, పత్రికలపై భారత రాష్ట్ర సమితి(Bharat Rashtra Samithi) కీలక నిర్ణయం తీసుకుంది.

BRS: ఆ ఛానల్, పత్రికలపై భారత రాష్ట్ర సమితి కీలక నిర్ణయం
Bharat Rashtra Samithi

హైదరాబాద్: ఓ ఛానల్, పత్రికలపై భారత రాష్ట్ర సమితి(Bharat Rashtra Samithi) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా దెబ్బతీస్తోందని ఆరోపిస్తూ ఆ ఛానల్, పత్రికలను బహిష్కరించాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సదరు మీడియా సంస్థలు భారతీయ జనతా పార్టీ(BJP) జేబు సంస్థగా మారి అబద్ధాలు, అసత్యాలు, కట్టుకథలతో తమ పార్టీపై విషం చిమ్మడమే ఏకైక ఎజెండాగా పని చేస్తున్నాయని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మీడియా సమావేశాలకు ఆ మీడియా సంస్థలను అనుమతించకూడదని నిర్ణయించింది. దీంతోపాటు ఆ సంస్ధలు నిర్వహించే చర్చలతో సహా, ఎలాంటి కార్యక్రమాల్లోనూ పార్టీ ప్రతినిధులెవరూ పాల్గొనకూడదని నిర్ణయం తీసుకుంది. తాము బహిష్కరిస్తున్న మీడియా సంస్ధల అసలు స్వరూపాన్ని, ఎజెండాను తెలంగాణ ప్రజలు గ్రహించాలని బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది.

వాస్తవానికి రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(Kalvakuntla Taraka Rama Rao) మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన ఓ ఛానల్, పత్రికలను ఎప్పుడు బ్యాన్ చేయలో తమకు తెలుసని, సందర్భం కోసం ఎదురుచూస్తున్నామని వ్యాఖ్యానించి కలకలం రేపారు. కేటీఆర్(KTR) ప్రకటన వచ్చిన రెండు రోజుల్లోనే బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బీఆర్ఎస్ బహిష్కరించాలనుకున్న టీవీ ఛానెల్, పత్రిక భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడివి కావడం గమనార్హం.

Updated Date - 2023-03-14T19:16:22+05:30 IST